టాటా మోటార్స్ కు ఢిల్లీ ప్రభుత్వం భారీ షాక్ .. ఈవీ వెహికిల్ నెక్సాన్పై ఇచ్చే రాయితీలు తాత్కాలిక నిలిపివేత
టాటా మోటార్స్ కు ఢిల్లీ ప్రభుత్వం ఊహించని షాక్ ఇచ్చింది. నెక్సాన్ పేరుతో విక్రయిస్తున్న టాటా ఎలక్ట్రికల్ కార్లు ప్రమాణాలకు అనుగుణంగా లేవని ఢిల్లీ సర్కారు నిర్ధారించింది. టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ స్పోర్ట్ యుటిలిటీ వెహికల్ నెక్సాన్పై ఇచ్చే ప్రోత్సాహకాలను ఢిల్లీ ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. టాటా నెక్సాన్ కార్ ఎలక్ట్రిక్ వెర్షన్ వాహనాలను రాయితీల నుంచి తొలగిస్తూ ఢిల్లీ రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఫలితంగా ఈ కార్లను కొనుగోలు చేసే కస్టమర్లకు ఎలాంటి సబ్సిడీ రాదని పేర్కొంది. దీంతో విద్యుత్ కార్ల విభాగం లో దేశీయ మార్కెట్లో టాప్ లో దూసుకెళ్తున్న టాటా కంపెనీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది.
మూడో త్రైమాసిక ఫలితాల్లో పుంజుకున్న టాటా స్టీల్స్ లిమిటెడ్ .. క్యూ3 లాభం రూ. 4,010.94 కోట్లు
నెక్సాన్ ఈవీ మైలేజ్ పై కస్టమర్ ఫిర్యాదు , కమిటీ ఏర్పాటు చేసిన సర్కార్
ఒకే ఛార్జీలో కంపెనీ చెప్పినంత కిలోమీటర్ల దూరం ప్రయాణించే సామర్థ్యం ఈ వాహనానికి లేదని ఒక కస్టమర్ ఫిర్యాదు చేశాడు . అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ప్రభుత్వం దేశ రాజధానిలో కస్టమర్ చేసిన ఆరోపణలను పరిశీలించడానికి నలుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. రవాణా శాఖ విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం, 2020 డిసెంబర్ 3 న కారును కొనుగోలు చేసిన రాజేష్ కుమార్, నెక్సాన్ ఈవికి 312 కిలోమీటర్ల సర్టిఫికేట్ పరిధి ఉందని, అయితే ఆన్-రోడ్ పరిస్థితులలో 200 కిలోమీటర్లు మాత్రమే నడుస్తుందని ఫిర్యాదు చేశారు. పైన పేర్కొన్నఅభియోగాన్ని పరిశీలించి కమిటీ నివేదిక ఇవ్వాల్సి ఉంది.
సబ్సిడీ పొందే కార్ల జాబితా నుండి తాత్కాలిక తొలగింపు
ఈ విషయంలో తుది నిర్ణయం పెండింగ్లో ఉంది. ఎలక్ట్రిక్ వెహికల్స్ పాలసీపై మరియు దాని యొక్క ముఖ్యమైన మరియు ప్రాథమిక లక్ష్యాలతో పాటు ప్రజా ప్రయోజనాలపైన కూడా ప్రతికూలతను నివారించాల్సిన అవసరంతో పాటు, ఈవి యొక్క జాబితాను తాత్కాలికంగా నిలిపివేయడం అవసరం అని భావించి టాటా నెక్సాన్ ఈవీ ఢిల్లీ ఈవీ పాలసీ క్రింద సబ్సిడీ పొందటానికి అర్హత కలిగిన మోడళ్ల జాబితా నుండి తాత్కాలికంగా తొలగిస్తున్నట్లు గా ప్రకటన పేర్కొంది.
ఢిల్లీలో వాహన కాలుష్యం అరికట్టటానికి ఢిల్లీ సర్కార్ న్యూ పాలసీ
2020లో దేశ రాజధాని ఢిల్లీ ప్రభుత్వం దేశ రాజధానిలో వాహన కాలుష్యాన్ని అరికట్టడానికి ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించడానికి కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ విధానంలో భాగంగా ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనాల మొదటి 1000 యజమానులకు రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ ఫోర్-వీలర్ యొక్క లిథియం-అయాన్ బ్యాటరీ యొక్క కిలోవాట్ కు రూ 10000 సబ్సిడీ ఇస్తుంది. ఇలాంటి జీరో-ఉద్గార వాహనాల కోసం రోడ్ టాక్స్ మరియు రిజిస్ట్రేషన్ ఫీజులను తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ఢిల్లీ రవాణా కమిషన్ యొక్క ఉత్తర్వు దురదృష్టకరమన్న టాటా మోటార్స్ ... మైలేజ్ పై వివరణ
టాటా మోటార్స్ ప్రతినిధి ఒక ప్రకటనలో ఢిల్లీ రవాణా కమిషన్ యొక్క ఉత్తర్వు దురదృష్టకరమని పేర్కొన్నారు . సంస్థ తన వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించడానికి నిర్మాణాత్మకంగా నిమగ్నం అవుతుందని పేర్కొన్నారు.
నెక్సాన్ ఈవీ కోసం సింగిల్ ఫుల్ ఛార్జ్ 312 కిమీ మైలేజీ వస్తుందని ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ARAI) నుండి పొందిన ధృవీకరణ పొందిందని సంస్థ పేర్కొంది. సాంప్రదాయిక వాహనాల మాదిరిగానే వాహనం యొక్క మైలేజ్ (ఐసి ఇంజిన్లతో), ఈవీలలో సాధించిన వాస్తవ పరిధి ఏసీ వినియోగం, వ్యక్తిగత డ్రైవింగ్ శైలి మరియు వాహనం నడిచే వాస్తవ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది అని సంస్థ ప్రతినిధి తెలిపారు.
ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాల్లో నంబర్ 1 టాటా నెక్సాన్ కు షాకిచ్చిన ఢిల్లీ సర్కార్
టాటా మోటార్స్ 2020 లో 2500 యూనిట్లకు పైగా నెక్సాన్ ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించింది మరియు అమ్మకాలలో అగ్రస్థానంలో ఉంది . అలాంటి నెక్సాన్ ఎలక్ట్రిక్ వాహనాలకు రాయితీలను తాత్కాలికంగా తొలగిస్తూ ఢిల్లీ సర్కార్ షాక్ ఇచ్చింది.