‘ట్రాయ్’ సిఫార్సులకు ‘ఓకే’! స్పెక్ట్రమ్ భారీ వేలానికి రంగం సిద్ధం...
ఎంతో కాలంగా పెండింగులో ఉన్న స్పెక్ట్రమ్ వేలం ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చింది. టెలికాం నియంత్రణ సంస్థ 'ట్రాయ్' సిఫార్సులను డిజిటల్ కమ్యూనికేషన్స్ కమిషన్(డీసీసీ) ఆమోదించడంతో స్పెక్ట్రమ్ భారీ వేలానికి రంగం సిద్ధమవుతోంది.
దేశంలోని 22 టెలికాం సర్కిళ్ల పరిధిలో 8300 మెగా హెర్ట్జ్ స్పెక్ట్రమ్ వేలం జరగనుంది. అన్నీ అనుకూలిస్తే వచ్చే ఏడాది మార్చి-ఏప్రిల్ నెలల్లో రూ.5.22 లక్షల కోట్ల రిజర్వ్ ధర కలిగిన స్పెక్ట్రమ్ను వేలం వేయనున్నారు. టెలికాం కార్యదర్శి అన్షు ప్రకాశ్ ఈ మేరకు వెల్లడించారు.
ధరను తగ్గించని ప్రభుత్వం...
స్పెక్ట్రమ్ వేలం కోసం టెలికాం కంపెనీలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నాయి. అంతేకాదు, ప్రస్తుతం టెలికాం రంగ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని స్పెక్ట్రమ్ ధర తగ్గించమని కూడా కేంద్రాన్ని కోరాయి. అయితే స్పెక్ట్రమ్ రిజర్వ్ ధర తగ్గించే విషయంలో టెలికాం సంస్థల వినతిని కేంద్రం తోసిపుచ్చింది. ధర ఏమాత్రం తగ్గించకుండానే స్పెక్ట్రమ్ను వేలం వేయాలని టెలికాం శాఖ అధికారులు భావిస్తున్నారు. 700, 800, 900, 1800, 2100, 2300, 2500, 3300-3400, 3400-3600 మెగా హెర్ట్జ్ బ్యాండ్లలోని స్పెక్ట్రమ్ను వచ్చే ఏడాది ప్రథమార్థంలో వేలం వేయనున్నారు.
అందుబాటులో ఉన్నది ఎంతంటే...
తొలుత రూ.4.9 లక్షల కోట్ల రిజర్వ్ ధర కలిగిన స్పెక్ట్రమ్ను వేలం వేయాలంటూ టెలికాం నియంత్రణ సంస్థ ‘ట్రాయ్' ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. అయితే లైసెన్సు గడువు ముగిసిన స్పెక్ట్రమ్ను కూడా కలిపి వేలం వేయాలని టెలికాం విభాగం సూచించింది. ఇప్పటికే రిలయన్స్ కమ్యూనికేషన్స్(ఆర్కామ్)కు సంబంధించిన స్పెక్ట్రమ్ లైసెన్సు గడువు ముగిసింది. అలాగే 8 సర్కిళ్లలో భారతీ ఎయిర్టెల్, మరో 4 సర్కిళ్లలో వొడాఫోన్ ఐడియాలకు చెందిన స్పెక్ట్రమ్ లైసెన్స్ గడువు కూడా ముగిసింది. దీంతో మొత్తం స్పెక్ట్రమ్ ధర రూ.5,22,850 కోట్లు అయింది.
ఆ స్పెక్ట్రమ్ సైజు తక్కువ.. ధర ఎక్కువ...
మరోవైపు వేలానికి ఉంచిన 5జీ స్పెక్ట్రమ్ పరిమాణం తక్కువగా ఉన్నప్పటికీ ధర చాలా ఎక్కువగా ఉందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. పలు దేశాల్లో ఇటీవల జరిగిన స్పెక్ట్రమ్ వేలం ధరలను ఈ సందర్భంగా ఉదహరిస్తున్నారు. దానికంటే మన దేశంలో స్పెక్ట్రమ్ ధరలు 4 నుంచి 6 రెట్లు అధికంగా ఉన్నాయని ‘కోయ్' డైరెక్టర్ జనరల్ రాజన్ ఎస్ మాథ్యూస్ వ్యాఖ్యానించారు. అసలే టెలికాం సంస్థలు నష్టాల్లో ఉన్నాయని, దీనికి తోడు రుణాల ఊబిలో కూడా చిక్కుకున్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో స్పెక్ట్రమ్ వేలంలో ఈ సంస్థలు పాల్గొనడం కష్టమేనని, టెలికాం రంగ పరిస్థితిని అర్థం చేసుకుని కేంద్రం స్పెక్ట్రమ్ ధర తగ్గిస్తే ఏమైనా ప్రయోజనం ఉండొచ్చని ఆయన పేర్కొన్నారు.
స్పెక్ట్రమ్ వేలం చెల్లింపులు ఇలా...
స్పెక్ట్రమ్ వేలంలో పాల్గొనాలని భావించే టెలికాం కంపెనీలు ముందుగా బిడ్లు సమర్పించాల్సి ఉంటుంది. ఆ తరువాత వేలంలో స్పెక్ట్రమ్ను దక్కించుకున్నట్లయితే 1 గిగాహెర్ట్జ్ లోపు స్పెక్ట్రమ్కు 25 శాతం చొప్పున, ఒకవేళ దానికంటే అధిక బ్యాండ్ స్పెక్ట్రమ్ అయితే 50 శాతం చొప్పున ముందస్తుగా చెల్లించాల్సి వస్తుంది. ఆ తరువాత రెండేళ్లపాటు ఏమీ చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఇక మిగిలిన మొత్తాన్ని.. 3వ సంవత్సరం నుంచి 16 ఏళ్లపాటు ఏడాదికి ఒక విడతగా చెల్లించవచ్చు.
11 ద్వీపాలకు సముద్రగర్భ ఫైబర్ కేబుల్...
ఇక శుక్రవారం జరిగిన సమావేశంలో మరో కీలక ప్రాజెక్టు అయిన.. కోచి-లక్షద్వీప్ దీపాలను కలిపేలా సముద్ర గర్భంగుండా ఫైబర్ కేబుల్ ఏర్పాటుకు కూడా డిజిటల్ కమ్యూనికేషన్స్ కమిషన్ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టులో భాగంగా మొత్తం 11 ద్వీపాలను ఫైబర్ కేబుల్ ద్వారా అనుసంధానిస్తారు. దీనికోసం రూ.837 కోట్ల పెట్టుబడి, రూ.235 కోట్ల నిర్వహణ వ్యయం.. మొత్తం రూ.1,072 కోట్లను కేంద్ర ప్రభుత్వంవెచ్చించనుంది. ఆయా ద్వీపాల నడుమ రెండంచెల కనెక్టివిటీ ఏర్పడే ఈ ప్రాజెక్టును 24 నెలల్లో పూర్తి చేయాలని కూడా నిర్ణయించారు.