Dabur: వంట గదిపై కన్నేసిన డాబర్.. ఆ కంపెనీలో 51% వాటా కొనుగోలు డీల్.. 3 ఏళ్ల వ్యూహం అదే..
Dabur: భారత ప్రజలకు దశాబ్ధాలుగా పరిచయం ఉన్న కంపెనీ డాబర్. పళ్లపొడి నుంచి పర్సనల్ కేర్ వరకు అనేక వస్తువులను కంపెనీ దేశంలో విక్రయిస్తోంది. అయితే తాజాగా కంపెనీ భారతీయులకు మరింత చేరువ అయ్యేందుకు ఒక బడా డీల్ కుదుర్చుకోవటంతో వార్తల్లో నిలిచింది.

మసాలాల మార్కెట్లోకి..
కన్జూమర్ గూడ్స్ తయారీలో గుర్తింపు పొందిన డాబర్.. తన రెండో త్రైమాసిక ఫలితాలను బుధవారం విడుదల చేసింది. ఇదే సమయంలో ప్రముఖ మసాలాల తయారీ సంస్థ బాద్షాలో 51 శాతం వాటాను కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది. అయితే రూ.587.52 కోట్లకు జరుగుతున్న ఈ డీల్ కోసం ఇప్పటికే ఒప్పందాలు పూర్తైనట్లు స్పష్టం చేసింది. దీంతో బాద్షా మసాలా డాబర్ ఇండియా గూటికి చేరుతోంది.

స్టాక్ ఎక్స్ఛేంజ్కు సమాచారం..
బాద్షా మసాలా గ్రౌండ్ మసాలాలు, మిక్స్ డ్ మసాలాలు, ఇతర ఆహార ఉత్పత్తులను తయారీ, మార్కెటింగ్, ఎగుమతి చేస్తోంది. ఆహార రంగంలో కొత్త ఉత్పత్తుల విక్రయాల్లోకి ప్రవేశించేందుకు కంపెనీ వ్యూహాత్మకంగా ఈ కొనుగోలు చేసింది. ఈ వివరాలను డాబర్ ఇండియా దేశీయ స్టాక్ ఎక్స్ఛేంజ్కు వెల్లడించింది.

రానున్న 5 ఏళ్లలో..
ప్రస్తుతం డాబర్ కంపెనీ 1958 నుంచి మసాలాల వ్యాపారంలో ఉన్న బాద్షా కంపెనీలో 51 శాతం వాటాని రూ.587.52 కోట్లకు కొనుగోలు చేస్తోంది. అయితే ప్రస్తుతం పురాతన మసాలా దినుసుల తయారీదారు వ్యాపార మార్కెట్ విలువ రూ.1,152 కోట్లుగా గుర్తించటం జరిగింది. కంపెనీలోని మిగిలిన 49 శాతం మైనారిటీ వాటాను రానున్న 5 ఏళ్ల తర్వాత కొనుగోలు చేస్తామని డాబర్ వెల్లడించింది. ఈ కొనుగోలుతో డాబర్ ఇండియా ఆహార వ్యాపారాన్ని మూడేళ్లలో రూ.500 కోట్లకు పెంచాలని కంపెనీ భావిస్తున్నట్లు వెల్లడించింది.

డాబర్ లాభాల క్షీణత..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్ త్రైమాసికానికి డాబర్ ఇండియా కన్సాలిడేటెడ్ నికర లాభం 2.85 శాతం క్షీణించి రూ.490.86 కోట్లుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో కంపెనీ రూ.505.31 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అయితే గత ఏడాదితో పోల్చితే కంపెనీ ఆదాయం 6 శాతం పెరిగి రూ.2,986.49 కోట్లుగా నమోదైంది. సమీక్షిస్తున్న త్రైమాసికంలో డాబర్ ఇండియా మొత్తం ఖర్చులు 8.94 శాతం పెరిగి రూ.2,471.28 కోట్లకు చేరుకున్నాయి.

కంపెనీ హిస్టరీ.. స్టాక్ పెరుగుదల..
1884లో డాబర్ కంపెనీ ఆయుర్వేద ఉత్పత్తులను తయారు చేసే కంపెనీగా ప్రారంభమైంది. ప్రస్తుతం ఇది మల్టీనేషనల్ కన్జూమర్ గుడ్స్ తయారీదారుగా గుర్తింపు పొందింది. ప్రస్తుతం కంపెనీలో 5,144 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. కొత్త కంపెనీ కొనుగోలు నిర్ణయం వెలువడటంతో డాబర్ స్టాక్ ఒక్కసారిగా మార్కెట్లో పుంజుకుంది. ఉదయం 11.22 గంటల సమయంలో షేర్ ధర రూ.11 పెరిగి రూ.543.55 వద్ద ట్రేడ్ అవుతోంది.


Click it and Unblock the Notifications