ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. పలు రాష్ట్రాల్లో డీఏ పెంపు.. ఏ రాష్ట్రం ఎంత శాతం పెంచిందంటే..
నిత్యం పెరుగుతున్న జీవన వ్యయాలను తట్టుకునేందుకు వీలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, రక్షణ సిబ్బంది, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు ,పెన్షనర్లకు అందించే కరువు భత్యం దేశవ్యాప్తంగా భారీగా పెరుగుతోంది. ఆల్-ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ (AICPI) గణాంకాల ఆధారంగా ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఈ డిఏను సవరిస్తారు.
సాధారణంగా మార్చి, అక్టోబర్ నెలల్లో దీనికి సంబంధించిన కొత్త ప్రకటనలు వెలువడగా, జనవరి ,జూలై నెలల నుండి ఇవి అమల్లోకి వస్తాయి. ప్రస్తుతం దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం, ఆహార ద్రవ్యోల్బణం పెరగడంతో పాలు, కూరగాయలు, విద్యుత్, ఇంధనం వంటి నిత్యావసరాల ధరలు ఎగబాకి మధ్యతరగతి, తక్కువ ఆదాయ వర్గాల కుటుంబాలపై తీవ్ర భారం పడుతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం డిఏను పెంచగా, దానిని అనుసరిస్తూ పలు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ ఉద్యోగులకు డిఏ పెంపులను ప్రకటించి ఊరటనిచ్చాయి.

ఈ ఏడాది ప్రారంభంలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ,పెన్షనర్లకు రెండు శాతం మేర డిఏ పెంపును సవరించింది. ఈ పెంపు 2026 జనవరి 1 నుండి అమల్లోకి వచ్చింది, దీనివల్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల మూల వేతనంలో డిఏ భాగం 58 శాతం నుండి 60 శాతానికి పెరిగింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని అనుసరిస్తూ భారతీయ రైల్వే కూడా తమ ఉద్యోగులకు రెండు శాతం డిఏ, డిఆర్ పెంపును ప్రకటించింది. ఏడవ కేంద్ర వేతన సంఘం ఫ్రేమ్వర్క్ పరిధిలోకి వచ్చే లక్షలాది మంది రైల్వే ఉద్యోగులు, పెన్షనర్లు ,కుటుంబ పెన్షనర్లు ఈ నిర్ణయం వల్ల లబ్ధి పొందుతున్నారు.
కేంద్రంతో పాటు పలు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ ఉద్యోగుల కరువు భత్యాన్ని పెంచుతూ కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. తమిళనాడు ప్రభుత్వం తమ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ,పెన్షనర్లకు డిఏను రెండు శాతం పెంచడంతో అక్కడ డిఏ మూల వేతనంలో 60 శాతానికి చేరింది. దీనివల్ల దాదాపు 16 లక్షల మంది లబ్ధి పొందుతుండగా, రాష్ట్ర ఖజానాపై ఏటా అదనంగా భారం పడనుంది. అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం కూడా డిఏ ,డిఆర్లను రెండు శాతం పెంచి ఉత్తర్వులు జారీ చేయడంతో ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు, రెగ్యులర్ ఉద్యోగులతో కలిపి వేలాది మంది సిబ్బంది, పెన్షనర్లు ప్రయోజనం పొందుతున్నారు.
బీహార్ ప్రభుత్వం విభిన్న వేతన సంఘాల పరిధిలోని ఉద్యోగులకు ఐదు నుండి తొమ్మిది శాతం వరకు డిఏ పెంచగా, ఒడిశా ప్రభుత్వం కూడా డిఏను రెండు శాతం పెంచి, ఆ మొత్తాన్ని మే నెల జీతం ,పెన్షన్లతో కలిపి పంపిణీ చేసింది. అస్సాం ప్రభుత్వం సైతం జూలై 5 నుండి తక్షణమే అమల్లోకి వచ్చేలా డిఏ ,డిఆర్లను రెండు శాతం పెంచి 60 శాతానికి చేర్చడంతో ఎనిమిది లక్షల మందికి పైగా సిబ్బంది లబ్ధి పొందుతున్నారు.
బ్యాంకింగ్ రంగం ,ఇతర రాష్ట్రాలలో బకాయిల చెల్లింపుల ప్రక్రియ కూడా వేగవంతమైంది. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ మే, జూన్, జూలై నెలలకు గాను అన్ని స్థాయిల బ్యాంకు ఉద్యోగులు ,అధికారులకు సవరించిన డిఏను ప్రకటించింది. మహారాష్ట్ర ప్రభుత్వం ఐదు, ఆరు, ఏడవ వేతన సంఘాల పరిధిలోని ఉద్యోగులకు గత నవంబర్, డిసెంబర్ ,జనవరి నెలలకు సంబంధించి రూ. 800 కోట్ల డిఏ బకాయిల చెల్లింపును ఆమోదించింది.
పంజాబ్ ప్రభుత్వం కూడా 2021 జూలై నుండి 2024 మార్చి మధ్య కాలానికి ఉద్యోగులు, పెన్షనర్లకు బకాయి ఉన్న డిఏ చెల్లింపులను పరిశీలిస్తామని తెలపగా, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం పాత డిఏ బకాయిలపై సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేస్తామని హామీ ఇచ్చింది. కర్ణాటకలో మాత్రం రోడ్డు రవాణా సంస్థ కార్మిక సంఘాలు జీతాల పెంపుతో పాటు, 38 నెలల డిఏ బకాయిలను ఒకే విడతలో చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాయి. పెరుగుతున్న ద్రవ్యోల్బణ పరిస్థితుల దృష్ట్యా, రాబోయే జూలై నెలలో కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరో రెండు నుండి మూడు శాతం అదనపు డిఏ పెంపు కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.


Click it and Unblock the Notifications
