కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు మార్చి నెల ఎంతో కీలకం కానుంది. ఎందుకంటే.. 2026 హోలీ పండగ సందర్భంగా ప్రభుత్వం డియర్నెస్ అలవెన్స్ (DA Hike) పెంపుపై ప్రకటన చేసే అవకాశం ఉందని బలంగా వినిపిస్తోంది. ప్రస్తుత ద్రవ్యోల్బణ గణాంకాల ప్రకారం.. డీఏ మరో 2 శాతం మేర పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అదే జరిగితే ఉద్యోగుల డీఏ ప్రస్తుతం ఉన్న 58 శాతం నుండి 60 శాతానికి చేరుకుంటుంది. దీని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

హోలీ పండగ ముందే ప్రకటన?
సాధారణంగా ప్రభుత్వం ఏడాదికి రెండు సార్లు (జనవరి, జూలై) డీఏను సవరిస్తుంది. అయితే, వీటిని ప్రకటించే సమయం పండగలపై ఆధారపడి ఉంటుంది. 2026లో హోలీ పండగ మార్చి 3 న రానుంది. గతంలో దీపావళికి ముందే డీఏ పెంపును ప్రకటించిన సంప్రదాయాన్ని కేంద్రం పాటిస్తోంది. ఈ క్రమంలోనే మార్చి మొదటి వారంలోనే ప్రధాని మోదీ నేతృత్వంలోని కేబినెట్ ఈ పెంపునకు ఆమోదం తెలపవచ్చని ఉద్యోగ సంఘాలు ఆశిస్తున్నాయి. ఒకవేళ మార్చిలో ప్రకటన వస్తే, ఏప్రిల్ శాలరీతో పాటు జనవరి నుండి రావాల్సిన బకాయిలు కూడా కలిపి వస్తాయి.
డీఏ ఎందుకు ముఖ్యం?
పే కమిషన్ అమలులో ఉన్నప్పుడు బేసిక్ శాలరీ మారదు. కానీ మార్కెట్లో పెరిగే ధరలకు అనుగుణంగా ఉద్యోగుల జీవన ప్రమాణాలు దెబ్బతినకుండా ప్రభుత్వం ఈ డీఏను పెంచుతూ వస్తుంది. ప్రస్తుతం 7వ పే కమిషన్ గడువు 2025 డిసెంబర్ 31తో ముగిసింది. 8వ పే కమిషన్ ఏర్పాటు ప్రక్రియ ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది. కాబట్టి కొత్త పే కమిషన్ అమలులోకి వచ్చే వరకు, ఉద్యోగుల శాలరీ పెరగడానికి ఈ డీఏ సవరణే ఏకైక మార్గం.
డీఏ లెక్కలు ఎలా ఉంటాయంటే?
లేబర్ బ్యూరో విడుదల చేసిన డిసెంబర్ 2025 AICPI-IW (All India Consumer Price Index) గణాంకాల ప్రకారం, ఇండెక్స్ 148.2 వద్ద స్థిరంగా ఉంది. గత 12 నెలల సగటును పరిగణనలోకి తీసుకుంటే.. ఈసారి డీఏ 60.33 శాతం వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం ఎప్పుడూ రౌండ్ ఫిగర్ ను మాత్రమే తీసుకుంటుంది కాబట్టి, 60 శాతం డీఏ ఖాయమని విశ్లేషకులు చెబుతున్నారు.
జీతంపై ప్రభావం
ఉదాహరణకు ఒక సాధారణ గ్రూప్ డి ఉద్యోగి బేసిక్ శాలరీ రూ. 18,000 అనుకుంటే..
- 58% డీఏ ఉన్నప్పుడు: రూ. 10,440 (మొత్తం జీతం రూ. 28,440)
- 60% డీఏ పెరిగినప్పుడు: రూ. 10,800 (మొత్తం జీతం రూ. 28,800) అంటే నెలకు రూ. 360 పెరగడమే కాకుండా, పెరిగిన డీఏ ప్రభావం హెచ్ఆర్ఏ (HRA) వంటి ఇతర అలవెన్సులపై కూడా పడుతుంది.
ఏది ఏమైనా ప్రస్తుతం ద్రవ్యోల్బణం పెరుగుతున్న నేపథ్యంలో ఈ 2 శాతం పెంపు ఉద్యోగులకు కొంత ఊరటనిచ్చే విషయమే. అయితే, లక్షలాది మంది పెన్షనర్లు, ఉద్యోగులు మాత్రం అధికారిక నోటిఫికేషన్ కోసం వేచి చూస్తున్నారు. హోలీ రంగుల కంటే ముందే ప్రభుత్వం తమ శాలరీ ఖాతాల్లో పండగ తెస్తుందని అంతా ఆశిస్తున్నారు.


Click it and Unblock the Notifications