Karnataka: సీఎంగా నెల రోజులు పూర్తి చేసుకున్న డీకే శివకుమార్.. పాలన ఎలా ఉందంటే..!
డీకే శివకుమార్ కర్ణాటక ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టి నెల పూర్తయింది. నెల రోజుల కాలంలో శివకుమార్ ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు. ఎలా ముందుకు వెళ్లారో చూద్దాం. పార్టీలోని రాజకీయ అనిశ్చితి కంటే తన ప్రభుత్వంపైనే ప్రజల దృష్టి ఉండేలా ముఖ్యమంత్రి వ్యవహరించారు. కేంద్ర ప్రభుత్వంతో ఆచితూచీ వ్యవహరిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంతో బహిరంగ ఘర్షణకు దూరంగా ఉన్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS)ను తీవ్రంగా విమర్శిస్తున్నా శివ కుమార్ మాత్రం జోక్యం చేసుకోలేదు.
అయితే శివకుమార్ కు ఇది ఆరంభం మాత్రమేనని చెప్పుకోవాలి. ఆయన ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. ఆయనకు మంత్రివర్గ విస్తరణ తర్వాత ఇదే వేగాన్ని కొనసాగించడం సవాల్ తో కూడుకున్న పని. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో 34 మంత్రి పదవులు అందుబాటులో ఉన్నాయి. ఇందులో 13 మంత్రి పదవులు మాత్రమే భర్తీ అయ్యాయి. 21 మందిని మంత్రులుగా తీసుకునే అవకాశం ఉంది. అయితే మంత్రి పదవులు విషయంలో చాలా పోటీ ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రి పదవి రానివారు అలకబూనే అవకాశం ఉంటుంది. వారిని బుజ్జగించాల్సిన పని శివకుమార్ పైనే పడే అవకాశం ఉంది.

సిద్ద రామయ్య మంత్రివర్గంలో పని చేసిన వారిని తిరిగి తీసుకోకుంటే సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేసే అవకాశం ఉంది. సీనియర్లకు అవకాశం కల్పిస్తే కొత్తగా మంత్రి పదవులు ఆశిస్తున్నవారు నిరాశపడే అవకాశం ఉంది. అటు అధిష్ఠానం సూచించిన వారికి కూడా మంత్రి పదవులు ఇవ్వాల్సి వస్తుంది. ప్రస్తుతం శివకుమార్ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నట్లు చెప్పుకోవచ్చు. కాగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వచ్చే ఎన్నికల్లో విజయమే ధ్యేయంగా పని చేయాలని సూచిస్తోంది. తిరిగి మళ్లీ అధికారంలోకి రావాలంటే ప్రజల ఆలోచనలకు ప్రభుత్వ పాలన అనుగుణంగా ఉండాలి.
శివకుమార్ ప్రభుత్వ పరిపాలనా పరంగా చూస్తే ప్రస్తుతం రాష్ట్రంలో వ్యవసాయం, విద్య వంటి కీలక శాఖలకు పూర్తి స్థాయి మంత్రులు లేరు. ప్రస్తుతం ఆ శాఖల బాధ్యతలు ముఖ్యమంత్రి వద్దే ఉన్నాయి. రాష్ట్రంలోని అనేక జిల్లాలు కరువు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. జలాశయాలలో నీటి మట్టాలు తక్కువగా ఉన్నాయి. ఆనకట్టల నీటిపై ఆధారపడి పంటలు పండించడాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని ప్రభుత్వం రైతులకు సూచించింది. ముఖ్యమంత్రి రాజధానిలో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నప్పటికీ, మంత్రులు మాత్రం క్షేత్రస్థాయిలో పెద్దగా కనిపించడం లేదని వార్తలు వస్తున్నాయి. ఈ ప్రభుత్వం కేవలం 'బెంగళూరు-కేంద్రిత' ప్రభుత్వమనే ముద్ర పడే ప్రమాదం ఉందని కింది స్థాయి నాయకులు భయపడుతున్నారు. ఇలా సవాళ్లను ఎదుర్కొంటూ ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఎలా ముందుకు వెళ్తారో చూడాలి.


Click it and Unblock the Notifications