ఆ పదవి నాకొద్దు, కానీ: టాటా సన్స్పై సైరస్ మిస్త్రీ అనూహ్య నిర్ణయం
సైరస్ మిస్త్రీ, టాటా సన్స్ వివాహం కొత్త మలుపు తిరిగింది! మిస్త్రీ ఉద్వాసన చెల్లదని NCLAT ఇటీవల తీర్పు చెప్పింది. దీనిపై టాటా సన్స్, టీసీఎస్, రతన్ టాటా సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. ఈ రోజు (జనవరి 6) సుప్రీం విచారణ చేపడుతుందని భావిస్తున్నారు. ఇంతలో మిస్త్రీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టాటా గ్రూప్స్ బాధ్యతలు తాను చేపట్టే ప్రసక్తి లేదని చెప్పారు.
NCLT తీర్పును సవాల్ చేసి NCLATలో నెగ్గిన మిస్త్రీ తాను నైతిక విజయం సాధించినట్లు చెప్పారు. మైనార్టీ భాగస్వాముల హక్కుల కోసమే తాను ఈ న్యాయపోరాటం చేశానని చెప్పారు. తాజాగా, NCLAT తీర్పుపై సుప్రీం కోర్టుకు ఎక్కిన సమయంలో మిస్త్రీ స్పందించారు. టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా, టీసీఎస్, టాటా టెలీ సర్వీసెస్, టాటా ఇండస్ట్రీస్ డైరెక్టర్గా వెళ్లే ఉద్దేశం తనకు లేదని ఆదివారం స్పష్టం చేశారు. ఈ మేరకు బహిరంగ ప్రకటన విడుదల చేశారు.
వ్యక్తిగత ప్రయోజనాల కంటే టాటా గ్రూప్ ప్రయోజనాలు తనకు ముఖ్యమని చెప్పారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. రికార్డుల్లో ఉన్న అన్ని విషయాలను సమీక్షించిన తర్వాత తనను తొలగించిన పద్ధతి చట్టవిరుద్ధమైనదని NCLAT గుర్తించిందన్నారు. కాబట్టి NCLAT ఆదేశాలపై తనకు గౌరవం ఉందని చెప్పారు.
అయినప్పటికీ టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టాలని తాను అనుకోవడం లేదన్నారు. అదేవిధంగా టాటా గ్రూప్ నాయకత్వం గత మూడేళ్లుగా మైనార్టీ వాటాదారుల హక్కులపై అంతగా గౌరవం చూపడం లేదన్నారు. టాటా గ్రూప్స్కు తనకు మధ్య న్యాయపోరాటం కేవలం మైనార్టీ వాటాదారుల హక్కులను కాపాడటం కోసమే అన్నారు.