చర్చలపై ఇరాన్ సంచలన ప్రకటన.. మళ్ళీ భగ్గుమన్న ముడిచమురు ధరలు.. ఆగని హార్ముజ్ టెన్సన్..
అమెరికా- ఇరాన్ల మధ్య నెలకొన్న సైనిక, రాజకీయ ఉద్రిక్తతలు.. ప్రపంచంలోనే అత్యంత కీలక సముద్ర రవాణా మార్గమైన హార్ముజ్ జలసంధిపై పడుతోంది. ఈ జలసంధిని తెరవడంపై కొనసాగుతున్న తీవ్ర అనిశ్చితి కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం త్వరలోనే కుదరవచ్చని అమెరికా ఆశాభావం వ్యక్తం చేస్తున్నప్పటికీ.. వాషింగ్టన్తో ఎలాంటి ప్రత్యక్ష చర్చలు జరగడం లేదని టెహ్రాన్ స్పష్టం చేయడంతో సోమవారం ట్రేడింగ్లో క్రూడ్ ఆయిల్ ధరలు మళ్లీ పెరిగాయ.
అంతర్జాతీయ బెంచ్ మార్క్ అయిన బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ ధరలు 1.09 శాతం మేర పెరిగి బ్యారెల్కు 84.46 డాలర్ల వద్దకు చేరుకోగా.. అమెరికాకు చెందిన వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) క్రూడ్ ఫ్యూచర్స్ ధర 0.84 శాతం పెరిగి బ్యారెల్కు 78.84 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. జలసంధి పునరుద్ధరణపై స్పష్టత లేకపోవడమే ఈ ధరల పెంపునకు తక్షణ కారణమని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవడానికి, ప్రస్తుత యుద్ధ వాతావరణాన్ని ముగించడానికి సంబంధించి ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి సంచలన ప్రకటన చేశారు. ప్రస్తుతం తాము అమెరికాతో నేరుగా ఎలాంటి చర్చలలో పాల్గొనడం లేదని ఆయన స్పష్టం చేశారు. అంతకుముందు జలసంధి తెరిచేందుకు ఇరు పక్షాల మధ్య ఒప్పందం త్వరలోనే కొలిక్కి వస్తుందని అమెరికా వర్గాలు చేసిన వ్యాఖ్యలను ఇరాన్ ఈ ప్రకటన ద్వారా తోసిపుచ్చినట్లయింది.
ఈ క్రమంలోనే Iran సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అధిపతి మొహమ్మద్ బఘేర్ జుల్ఘదర్ మాట్లాడుతూ.. హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవడానికి ఇరాన్ స్పష్టమైన ఆరు షరతులు విధించిందని తెలిపారు. తమ దేశంపై, తమ మిత్రదేశాలపై కొనసాగుతున్న దాడులను వెంటనే నిలిపివేయడంతో పాటు.. అమెరికా కలిగించిన నష్టానికి తగిన నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ ఆరు షరతులను అమెరికా నెరవేర్చే వరకు హార్ముజ్ జలసంధిని మూసివేసే ఉంచుతామని వారు హెచ్చరించారు.
మరోవైపు అమెరికా తన పట్టును సడలించడం లేదు. సిటీ గ్రూప్ విశ్లేషణల ప్రకారం.. జలసంధి తెరిచిన తర్వాత సరుకు రవాణా చేసే నౌకలపై ఇరాన్ ఎలాంటి ఆంక్షలు, సుంకాలు లేదా ముందస్తు అనుమతులు విధించకూడదని అమెరికా గట్టిగా డిమాండ్ చేస్తోంది. నౌకల రాకపోకలు అత్యంత స్వేచ్ఛగా, ఎటువంటి నిబంధనలు లేకుండా జరగాలని అమెరికా భావిస్తుండగా.. ఇరాన్ మాత్రం పన్నులు, ఆంక్షల అమలుపై పట్టుబడుతోంది. ఈ ప్రాథమిక అంశాలపైనే ఇరుపక్షాల మధ్య తీవ్ర భేదాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ ప్రాంతీయ ఉద్రిక్తతలు కేవలం హార్ముజ్ జలసంధికే పరిమితం కాకుండా చుట్టుపక్కల మార్గాలకు కూడా విస్తరిస్తున్నాయి. యెమెన్లోని ఇరాన్ మిత్రపక్షమైన హౌతీ గ్రూపులు ఎర్ర సముద్రం, బాబ్ అల్-మండేబ్ ప్రాంతాలలో సౌదీ అరేబియాకు చెందిన నౌకలను.. రవాణా మార్గాలను లక్ష్యంగా చేసుకుని దాడులు ముమ్మరం చేస్తున్నాయి. దీనివల్ల ప్రత్యామ్నాయ రవాణా మార్గాలు కూడా తీవ్ర ప్రమాదంలో పడ్డాయి.
ప్రస్తుతం అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు, యుద్ధ వాతావరణం ఆరో నెలలోకి ప్రవేశించిన నేపథ్యంలో గ్లోబల్ ఎనర్జీ మార్కెట్లలో తీవ్ర అనిశ్చితి నెలకొందని వెస్ట్పాక్ సంస్థ వ్యాఖ్యానించింది. ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు ఐదవ వంతు వాటా కలిగిన కీలక జలసంధి మూతపడటం.. ప్రత్యామ్నాయ మార్గాలలో దాడులు పెరగడం వల్ల రాబోయే రోజుల్లో ముడి చమురు ధరలు మరింత అస్థిరంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications
