Adani: అదానీ గ్రూప్ అప్పులపై మాటమార్చిన క్రెడిట్సైట్స్.. ఈ ట్విస్ట్ అస్సలు ఊహించరు.. ఇన్వెస్టర్లు సేఫేనా..!
Adani: అదానీ పని అయిపోయింది. అదానీ కంపెనీలకు కుప్పలు తెప్పలుగా అప్పులు ఉన్నాయి. గౌతమ్ అదానీ మోదీ సన్నిహితుడు కావటంతోనే అప్పులు పుడుతున్నాయనే వార్తలు మార్కెట్లలో పెద్ద విధ్వంసాన్ని సృష్టించిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంలో క్రెడిట్సైట్స్ సంస్థ మాట మార్చింది. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే..
చర్చల తరువాత..
అదానీ గ్రూప్ మేనేజ్మెంట్తో చర్చల అనంతరం దేశంలోని అత్యంత సంపన్నుడు గౌతమ్ అదానీ గ్రూప్ కంపెనీల్లో లెక్కలు మారాయి. ఆయనకు చెందిన అదానీ పవర్, అదానీ ట్రాన్స్మిషన్ కంపెనీల క్రెడిట్ లెక్కల్లో పొరపాటు జరిగినట్లు ఫించ్ గ్రూప్ అనుబంధ సంస్థ క్రెడిట్సైట్స్ తెలిపింది. దీనిపై అదానీ గ్రూప్ క్రెడిట్సైట్స్కు కొంత వివరణ ఇచ్చింది. అందువల్ల గత నెలలో ఇచ్చిన నివేదికలో లోపాలను గుర్తించినట్లు ఒప్పుకుంది. ఓవర్లెవరేజ్ వార్తలతో కంపెనీ స్టాక్స్ నష్టాలను చవిచూశాయి.
కొత్త సవరణలు..
సెప్టెంబర్ 7న క్రెడిట్ రీసెర్చ్ సంస్థ క్రెడిట్సైట్స్ ఇచ్చిన తాజా నివేదికలో.. అదానీ గ్రూప్లోని ఫైనాన్స్, ఇతర ఎగ్జిక్యూటివ్లతో మాట్లాడిన తర్వాత అదానీ ట్రాన్స్మిషన్, అదానీ పవర్లకు సంబంధించిన కొన్ని గణాంకాలను పునరుద్దరించినట్లు రీసెర్చ్ సంస్థ తెలిపింది.
అన్నీ కంట్రోల్ లో..
క్రెడిట్సైట్స్ తన నివేదికలో తాజాగా సవరించిన తర్వాత.. అదానీ గ్రూప్ బయటి రుణాలు నిర్వహించదగిన స్థాయిలోనే ఉన్నట్లు తెలిపింది. ఎందుకంటే.. వ్యాపార విస్తరణ ప్రణాళికలకు అదానీ గ్రూప్ ప్రధానంగా లోన్స్ ద్వారా డబ్బును సమీకరించదని గ్రూప్ యాజమాన్యం తెలిపింది. అవసరమైన నిధులను ఎక్కువగా డిబెంచర్ల ద్వారా సేకరిస్తోంది. అదానీ గ్రూప్ ఈ ఏడాది మాత్రమే తన విస్తరణ ప్రణాళికల కోసం బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందాలను ప్రకటించింది.
అదానీ కంపెనీలు..
మార్పుల తర్వాత అదానీ ట్రాన్స్మిషన్ కంపెనీ EBITDA స్థాయిని రూ.42 బిలియన్ల నుంచి రూ.52 బిలియన్లకు పెంచింది. అదేవిధంగా.. అదానీ పవర్ లోన్స్ మెుత్తం అంచనాను రూ.582 బిలియన్ల నుంచి రూ.489 బిలియన్లకు క్రెడిట్ సైట్స్ తగ్గించింది. అయితే ఈ మార్పుల కారణంగా క్రెడిట్ రేటింగ్ కంపెనీ చేసిన పెట్టుబడుల సిఫార్సులను మార్చటం లేదని తెలిపింది.