బంగారం ధరలు ఈ రేటును దాటకముందే కొనేయండి.. కొనుగోలుదారులకు బులియన్ నిపుణులు కీలక సూచన..
భారతదేశంలో బంగారం ధరలు ఎప్పటికప్పుడు హెచ్చుతగ్గులకు లోనవుతున్నప్పటికీ.. గతంలో కంటే గణనీయమైన పెరుగుదలను నమోదు చేశాయి. ఏప్రిల్ 2025 వరకు 10 గ్రాముల బంగారం ధర ఎప్పుడూ రూ. 1.10 లక్షలను మించలేదు. అయితే జూలై 24 నాటికి పసిడి రూ. 1.43 లక్షల స్థాయికి చేరుకుంది. ఈ ఊహించని పెరుగుదల తర్వాత.. ధర మళ్లీ రూ. 1. 10 లక్షలకు పడిపోతుందా అనే సందేహం చాలా మంది కొనుగోలుదారులలో వ్యక్తమవుతోంది.
అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రస్తుత పరిస్థితుల్లో gold ధరలు రూ. 1. 10 లక్షల స్థాయికి పడిపోయే అవకాశం చాలా తక్కువ. ఆగ్మాంట్లోని రీసెర్చ్ హెడ్ రెనిషా చైనాణి ప్రకారం.. ధరల్లో అటువంటి భారీ తగ్గుదల అనేది ఒక సాధారణ అంచనా కాదని, అది కేవలం ఒక రిస్క్ దృశ్యంగా మాత్రమే చూడాలని స్పష్టం చేశారు. 2026లో 10 గ్రాముల బంగారం ధరలు రూ. 1.4 లక్షల నుంచి రూ. 1.5 లక్షల పైన ఉండే అవకాశం ఉంది. స్వల్పకాలంలో 5 శాతం నుండి 15 శాతం వరకు ధరలు తగ్గడం సహజమైన విషయమే కానీ.. దానిని పెద్ద పతనంగా భావించలేము.

ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు నిరంతరం బంగారం కొనుగోళ్లు జరుపుతుండటమే దీనికి ప్రధాన కారణంగా చూడవచ్చు. ఈ కొనుగోళ్లు మార్కెట్లో బంగారం ధరలకు ఒక బలమైన మద్దతును అందిస్తున్నాయి.
బంగారం ధరలలో గణనీయమైన తగ్గుదల సంభవించాలంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కొన్ని ముఖ్యమైన మార్పులు రావలసి ఉంటుంది. నిపుణులు పేర్కొన్న ప్రధాన కారణాలు ఇవే:
అమెరికా డాలర్ బలపడటం: అంతర్జాతీయ మార్కెట్లో అమెరికా డాలర్ విలువ పెరిగినప్పుడు.. బంగారం ధరలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. డాలర్ బలపడితే బంగారంపై డిమాండ్ తగ్గి, ధరలు కిందకు దిగివచ్చే అవకాశం ఉంటుంది.
వడ్డీ రేట్ల పెరుగుదల: అమెరికా ఫెడరల్ రిజర్వ్ లేదా ఇతర ప్రధాన బ్యాంకులు దీర్ఘకాలం పాటు వడ్డీ రేట్లను అధికంగా కొనసాగిస్తే, పెట్టుబడిదారులు బంగారం కంటే ఇతర వడ్డీ రాబడి ఇచ్చే సాధనాల వైపు మొగ్గు చూపుతారు.
భౌగోళిక ఉద్రిక్తతలు తగ్గడం: యుద్దాలు, రాజకీయ గందరగోళాలు ఉన్న సమయంలో పెట్టుబడిదారులు బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా (Safe Haven) భావిస్తారు. ఒకవేళ ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలు తగ్గి ప్రశాంత వాతావరణం ఏర్పడితే, బంగారంపై ఆధారపడటం తగ్గుతుంది.
సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు మందగించడం: ప్రస్తుతం కేంద్ర బ్యాంకులు జరుపుతున్న నిరంతర కొనుగోళ్లే ధరలను పటిష్టంగా ఉంచుతున్నాయి. ఈ కొనుగోళ్ల వేగం తగ్గితే ధరలపై ఒత్తిడి పెరుగుతుంది.
పెట్టుబడిదారులు అనుసరించాల్సిన వ్యూహం
gold ధరలు అట్టడుగు స్థాయికి (Bottom) చేరుకునే వరకు వేచి చూడటం ప్రమాదకరమైన వ్యూహమని బోనాంజా సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్ నిర్పేంద్ర యాదవ్ వంటి నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిజమైన అట్టడుగు స్థాయిని కచ్చితంగా అంచనా వేయడం ఎవరికీ సాధ్యం కాదు. గతంలో బంగారం ధరలు 10 శాతం నుండి 20 శాతం వరకు తగ్గడం సర్వసాధారణంగా జరుగుతూనే ఉంది.
అందువల్ల ధరలు రూ. 1. 10 లక్షలకు తగ్గుతాయని ఆశించి కొనుగోళ్లను పూర్తిగా వాయిదా వేయడం సరైన నిర్ణయం కాకపోవచ్చు. ఒకేసారి పెద్ద మొత్తంలో నిధులు కేటాయించే బదులు.. క్రమపద్ధతిలో (SIP మోడ్లాగా) కొద్దికొద్దిగా పెట్టుబడి పెట్టడం శ్రేయస్కరం. మార్కెట్ వార్తలను చూసి భయాందోళనలతో హడావుడిగా కొనడం లేదా అమ్మడం మానుకోవాలి. దీర్ఘకాలికంగా పోర్ట్ఫోలియోను వైవిధ్యపరచడానికి బంగారం ఒక అద్భుతమైన సాధనంగా పనిచేస్తుంది. అయితే స్వల్పకాలిక పెట్టుబడిదారులు మాత్రం మార్కెట్ హెచ్చుతగ్గులకు సిద్ధంగా ఉండక తప్పదు.
డిస్క్లైమర్: ఈ వెబ్సైట్లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్సైట్లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
