జీతాల కంటే వేగంగా పెరుగుతున్న ఖర్చులు.. పార్ట్ టైం చేయకపోతే పూటగడవట్లేదని భోరుమంటున్న ఉద్యోగులు..
దేశంలో క్రమంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం ఇప్పుడు సాధారణ ప్రజల దైనందిన జీవితాన్నే కాకుండా.. వారి వృత్తి, ఉద్యోగ నిర్ణయాలను కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ఇంటి అద్దెలు, పిల్లల చదువులు, రవాణా ఖర్చులతో సహా రోజువారీ జీవన వ్యయం విపరీతంగా పెరిగిపోవడంతో, తమ ప్రస్తుత జీతాలు మునుపటిలా ఆర్థిక భరోసా ఇవ్వడం లేదని అత్యధిక శాతం మంది ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ నిరుత్సాహకర పరిస్థితుల వల్ల అదనపు ఆదాయ మార్గాలను వెతుక్కోవడం, ఎక్కువ ప్యాకేజీలు ఇచ్చే కంపెనీలకు మారడం, అలాగే ఖరీదైన మహానగరాలను వదిలి చిన్న నగరాలకు తరలివెళ్లడం వంటి కీలక మార్పులకు ఉద్యోగులు సిద్ధమవుతున్నారు. ప్రముఖ ఉద్యోగ నియామక వేదిక 'ఇండీడ్' (Indeed) నిర్వహించిన తాజా సర్వేలో ఈ సంచలన విషయాలు వెల్లడయ్యాయి. దేశవ్యాప్తంగా 1,200 మందికి పైగా ఉద్యోగులు, 1,000 కి పైగా కంపెనీల యాజమాన్యాల నుండి సేకరించిన అభిప్రాయాల ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు.

ఈ సర్వే నివేదిక ప్రకారం.. ప్రస్తుత కార్పొరేట్ రంగంలో అత్యధిక శాతం మంది ఉద్యోగులు తక్కువ జీతాలతో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. దాదాపు 68 శాతం మంది ఉద్యోగులు తమ ప్రస్తుత ఆదాయంతో నెలవారీ జీవన వ్యయాలను సౌకర్యవంతంగా తీర్చలేకపోతున్నామని స్పష్టం చేశారు. దీనిని బట్టి జీతాల పెరుగుదల వేగానికి, మార్కెట్లో వస్తువుల ధరల పెరుగుదల వేగానికి మధ్య ఉన్న అంతరం అంతకంతకూ విస్తరిస్తోందని స్పష్టమవుతోంది.
కేవలం 13 శాతం మంది ఉద్యోగులు మాత్రమే తమ ఆదాయం ప్రస్తుత సౌకర్యవంతమైన జీవితానికి సరిపోతుందని చెప్పగా, మిగిలిన వారిలో 32 శాతం మంది ఏదో ఒక రకంగా నెట్టుకొస్తున్నారు. మరో 24 శాతం మంది తమ ఆర్థిక పరిస్థితిని నిర్వహించడం కష్టంగా మారుతోందని అంగీకరించగా, 12 శాతం మంది ఉద్యోగులు తాము తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ఆర్థిక ఇబ్బందులు ప్రజల మానసిక ఆరోగ్యంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. సర్వేలో పాల్గొన్న వారిలో 41 శాతం మంది ఉద్యోగులు రెండు సంవత్సరాల క్రితం కంటే ఇప్పుడు తాము ఎక్కువ ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు అంగీకరించారు. ఆహారం, గృహ వసతి, వైద్యం మరియు విద్య వంటి ప్రాథమిక అవసరాల ఖర్చులు మధ్యతరగతి కుటుంబాల పొదుపును పూర్తిగా హరించివేస్తున్నాయని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. ఈ కారణంగా కేవలం ఒకే ఉద్యోగంపై వచ్చే జీతంపై ఆధారపడి తమ భవిష్యత్తు ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడం అసాధ్యంగా మారుతుండటంతో, 'అదనపు ఆదాయం' అనేది ఒక లగ్జరీగా కాకుండా నేటి కాలపు ముఖ్య అవసరంగా మారింది.
సర్వే ప్రకారం ఇప్పటికే 14 శాతం మంది ఫ్రీలాన్సింగ్ లేదా ఇతర సైడ్ బిజినెస్ల ద్వారా క్రమం తప్పకుండా అదనపు ఆదాయాన్ని సంపాదిస్తుండగా, మరో 19 శాతం మంది అప్పుడప్పుడు పార్ట్ టైమ్ పనులు చేస్తున్నారు. దీనికి తోడు 24 శాతం మంది ఉద్యోగులు భవిష్యత్తులో అదనపు ఆదాయ మార్గాన్ని ప్రారంభించాలని యోచిస్తున్నారు. అంటే, మొత్తంగా 60 శాతం మంది ఉద్యోగులు కేవలం వార్షిక జీతాల పెంపు (అప్రైజల్స్) కోసం ఎదురుచూడకుండా సొంతంగా ప్రత్యామ్నాయ మార్గాలను సృష్టించుకుంటున్నారు.
ఈ జీవన వ్యయాల భారం మెట్రో నగరాల పట్ల ఉద్యోగుల్లో ఉన్న మోజును క్రమంగా తగ్గిస్తోంది. సర్వేలో 39 శాతం మంది గృహసముదాయాల అద్దెలను తమ అతిపెద్ద సవాలుగా పేర్కొనగా, 27 శాతం మంది ట్రాఫిక్ సమస్యలు మరియు సుదీర్ఘ ప్రయాణాల వల్ల విసిగిపోతున్నట్లు చెప్పారు. ఈ ఇబ్బందుల కారణంగా మెట్రో నగరాల్లో నివసిస్తున్న 54 శాతం మంది ఉద్యోగులు, తమకు గనుక సమానమైన కెరీర్ అవకాశాలు లభిస్తే టైర్-2, టైర్-3 నగరాలకు (చిన్న నగరాలు) మారిపోవడానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.
ఈ సరికొత్త ధోరణి ముఖ్యంగా హైదరాబాద్లోని ఉద్యోగులలో అత్యంత స్పష్టంగా కనిపించగా, ముంబై, ఢిల్లీ-ఎన్సీఆర్, బెంగళూరు నగరాల వారు సైతం ఈ మార్పునకు మొగ్గు చూపుతున్నారు. ఉద్యోగుల ఆలోచనలకు తగ్గట్టుగానే 43 శాతం మంది యజమానులు కూడా తమ నియామక వ్యూహాలను మార్చుకుంటూ, ప్రతిభను ఆకర్షించడానికి టైర్-2, టైర్-3 నగరాలు ఇప్పుడు తమకు అత్యంత ముఖ్యమైనవిగా మారుతున్నాయని అంగీకరించారు.
ఈ మారుతున్న కాలంలో ఉద్యోగాన్ని ఎంచుకునేటప్పుడు కేవలం అధిక జీతాలే కాకుండా, ఉద్యోగ భద్రతకు అభ్యర్థులు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. సర్వేలో 41 శాతం మంది ఉద్యోగ స్థిరత్వం మరియు భద్రతను ముఖ్యమైన అంశంగా పేర్కొనగా, 30 శాతం మంది మాత్రమే అధిక జీతాలు మరియు మెరుగైన ప్యాకేజీలను కోరుకున్నారు. తక్కువ ఖర్చుతో కూడిన నగరాలు మరియు మెరుగైన 'వర్క్-లైఫ్ బ్యాలెన్స్' (పని-జీవిత సమతుల్యత) కూడా నేటి తరం ఉద్యోగులకు ప్రాధాన్యత అంశాలుగా మారాయి. అయితే ఈ సర్వే ఒక విచిత్రమైన కార్పొరేట్ వైరుధ్యాన్ని కూడా బయటపెట్టింది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం వల్ల తమ సిబ్బంది తీవ్రంగా నష్టపోతున్నారని 73 శాతం కంపెనీలు అంగీకరించాయి.
అలాగే ఉద్యోగుల జీతాల అంచనాలు పెరుగుతున్నాయని 56 శాతం యజమానులు స్పష్టం చేశారు. అయినప్పటికీ, తమ ఉద్యోగులపై పడుతున్న ఈ ఆర్థిక భారాన్ని తగ్గించడానికి లేదా సహాయపడటానికి దాదాపు 77 శాతం కంపెనీలు ఎలాంటి కొత్త రాయితీలను, అలవెన్సులను లేదా ప్రత్యేక ఆర్థిక ప్రయోజనాలను ప్రకటించకపోవడం గమనార్హం. దేశంలో మారుతున్న ఈ ఉద్యోగ వాతావరణం భవిష్యత్తులో కంపెనీల నియామకాలను, నగరాల విస్తరణను పూర్తిగా మార్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications
