ఉద్యోగులకు అర్ధరాత్రి షాక్.. ఒక్క వీడియో కాల్తో 150 మంది ఉద్యోగాల తొలగింపు.. ఇంత దారుణమా..
అంతర్జాతీయ టెక్ రంగంలో ఉద్యోగాల కోతలు (Layoffs) ఎంత కర్కశంగా మారుతున్నాయో చెప్పడానికి తాజాగా హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. అమెరికాకు చెందిన ప్రముఖ రీటైల్, సూపర్ మార్కెట్ దిగ్గజం 'హై-వీ' (Hy-Vee) తమ భారతీయ ఇంజనీరింగ్ విభాగమైన 'హై-వీ ఇండియా' (Hy-Vee India) కేంద్ర కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేసింది. ఏ విధమైన ముందస్తు సమాచారం లేదా కనీస సంకేతాలు ఇవ్వకుండా, కేవలం ఒక్క రాత్రి జరిగిన ఆకస్మిక 'మైక్రోసాఫ్ట్ టీమ్స్' (Microsoft Teams) వర్చువల్ మీటింగ్ ద్వారా 150 మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లను ఒకేసారి ఉద్యోగాల నుండి తొలగించింది.
కంపెనీలో పూర్తిస్థాయి డెవలపర్గా పనిచేసిన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ రెడ్డిట్ (Reddit) వేదికగా ఈ భయానక అనుభవాన్ని పంచుకోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. హై-వీ లో 1.8 ఏళ్ల ప్రయాణం తర్వాత రాత్రికి రాత్రే ఉద్యోగం కోల్పోయాను అనే శీర్షికతో ఆ టెక్నీషియన్ పెట్టిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. తన కెరీర్లోనే అత్యంత కఠినమైన రోజుగా దీనిని ఆయన అభివర్ణించారు.

బాధిత ఉద్యోగి కథనం ప్రకారం.. జూన్ 23 రాత్రి 9 గంటలకు ఇంజనీరింగ్ బృందంలోని దాదాపు 150 మంది సభ్యులకు అత్యవసరంగా ఒక మైక్రోసాఫ్ట్ టీమ్స్ కాల్ లింక్ వచ్చింది. "రోజంతా ఎప్పటిలాగే కోడింగ్ చేస్తూ, బగ్లను సరిచేస్తూ సాధారణంగా గడిపాం. వార్షిక బోనస్లు, అప్రైజల్స్ కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఈ మీటింగ్ కాల్ వచ్చింది. సమావేశం ప్రారంభం కాగానే కంపెనీ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ (CTO) కేవలం రెండు నిమిషాల పాటు ఒక చిన్న ప్రకటన చదివి వినిపించారు. పునర్వ్యవస్థీకరణ (Restructuring) చర్యల్లో భాగంగా భారతదేశంలో తమ ఇంజనీరింగ్ కార్యకలాపాలను తక్షణమే నిలిపివేస్తున్నట్లు, బృందాన్ని తీసివేస్తున్నట్లు తెలిపారు. ఎలాంటి ప్రశ్నలకు తావు లేకుండానే ఆ మీటింగ్ ముగిసిపోయిందని ఉద్యోగి ఆవేదన వ్యక్తం చేశారు.
సమావేశం ముగిసిన కొద్ది నిమిషాల వ్యవధిలోనే ఉద్యోగుల ఆఫీస్ ఈమెయిల్స్, గిట్హబ్ (GitHub), వీపీఎన్ (VPN), కమ్యూనికేషన్ సిస్టమ్స్ అన్నింటికీ యాక్సెస్ కట్ చేసేశారు. ల్యాప్టాప్లను రిమోట్ పద్ధతిలో వైప్ (డేటా మొత్తం డిలీట్) చేయడంతో, ఉద్యోగులు కనీసం తమ వ్యక్తిగత సర్టిఫికెట్లు, పత్రాలను కూడా బ్యాకప్ చేసుకునే అవకాశం లభించలేదు. అంతకంటే దారుణమైన విషయం ఏంటంటే, నష్టపరిహారంగా ఎలాంటి సెవరెన్స్ ప్యాకేజీ గానీ, అదనపు ఆర్థిక సాయం గానీ కంపెనీ ప్రకటించలేదని సదరు ఉద్యోగి ఆరోపించారు (అయితే కేవలం సుమారు 50 రోజుల ప్రాథమిక వేతనం మాత్రమే అందించినట్లు తెలుస్తోంది).
భారతదేశంలోని హై-వీ ఇంజనీరింగ్ విభాగ డైరెక్టర్ అమిత్ గోయల్ ఈ ఆకస్మిక లేఆఫ్స్ను ధృవీకరిస్తూ లింక్డ్ఇన్ (LinkedIn) లో పోస్ట్ చేశారు. మా హై-వీ ఇండియా కేంద్రం శాశ్వతంగా మూతపడింది. అమెజాన్, మింత్రా వంటి అగ్రశ్రేణి ప్రొడక్ట్ కంపెనీల నుండి ఎంతో కష్టపడి నేను ఎంపిక చేసిన అత్యుత్తమ ఇంజనీర్లు ఇప్పుడు కొత్త అవకాశాల కోసం చూస్తున్నారు. వారు కేవలం సమర్థులే కాదు, అత్యంత అరుదైన గుణాలు కలిగిన నిపుణులు. ఎవరైనా రిక్రూటర్లు ఉంటే వీరికి అవకాశం ఇవ్వండని కోరారు. అయితే ఈ ప్రకటన వచ్చిన కొద్దిసేపటికే హై-వీ ఇండియాకు సంబంధించిన అధికారిక లింక్డ్ఇన్ పేజీ, పాత పోస్టులన్నింటినీ కంపెనీ సోషల్ మీడియా నుండి తొలగించడం గమనార్హం.
ఈ వ్యవహారంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగులను ఓనర్లుగా చూస్తామని చెప్పుకునే 'ఎంప్లాయ్-ఓన్డ్' కంపెనీలు ఇలాంటి సంక్షోభ సమయాల్లో ఇలాగేనా ప్రవర్తించేది?" అని కొందరు ప్రశ్నిస్తుండగా, "సాధారణంగా ఉద్యోగి ఐటి కంపెనీ వీడాలంటే 90 రోజుల నోటీస్ పీరియడ్ అడుగుతారు, కానీ తీసేసేటప్పుడు మాత్రం నోటీస్ కూడా ఇవ్వరా?" అని మరికొందరు మండిపడుతున్నారు. ప్రస్తుతం ఈ 150 మంది భారతీయ టెక్ నిపుణులు తక్షణమే చేరడానికి (Immediate Joiners) కొత్త ఉద్యోగాల వేటలో పడ్డారు.


Click it and Unblock the Notifications
