భారీ నష్టాల్లోనే స్టాక్ మార్కెట్లు, సెన్సెక్స్ 2,000 పాయింట్లు డౌన్, ఎస్బీఐ కార్డ్స్కు ఝలక్
ముంబై: స్టాక్ మార్కెట్ల నష్టాల పరంపర కొనసాగుతోంది. గత వారం నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు.. ఈ వారం కూడా భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. సోమవారం (మార్చి 16) ఉదయం గం.9.18 సమయానికి సెన్సెక్స్ 1,520.53 పాయింట్లు (4.46 శాతం) నష్టపోయి 32582.95 పాయింట్ల వద్ద, నిఫ్టీ 440.60 (4.43 శాతం) నష్టపోయి 9514.60 వద్ద ట్రేడ్ అయింది. ఓ సమయంలో 2,000 పాయింట్లు పడిపోయింది. ఆ తర్వాత 1500 వద్ద కనిపించింది. 190 షేర్లు లాభాల్లో, 730 షేర్లు నష్టాల్లో ఉండగా, 62 షేర్లలో ఎలాంటి మార్పులేదు.
కరోనా వైరస్ దెబ్బకు మార్కెట్లు అతలాకుతలం
యస్ బ్యాంకు 40 శాతం జూమ్
యస్ బ్యాంకు భారీగా పుంజుకుంది. ఏకంగా దాదాపు 40 శాతం ఎగిసింది. HDFC, ICICI బ్యాంకు, SBI, సన్ ఫార్మా, JSPL, మ్యాక్స్ ఫైనాన్షియల్, DLF నష్టాల్లో ట్రేడింగ్ ప్రారంభించాయి. టాప్ గెయినర్స్ జాబితాలో ఒక యస్ బ్యాంకు మాత్రమే ఉంది. టాప్ లూజర్స్ జాబితాలో అదానీ పోర్ట్స్, ఇండస్ ఇండ్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ, యాక్సిస్ బ్యాంకు ఉన్నాయి.
ఎస్బీఐ కార్డ్స్
ఎస్బీఐ కార్డ్స్ ప్రీ ఓపెన్ రూ.661 వద్ద ప్రారంభమైంది. ఎస్బీఐ కార్డ్స్ లిస్టింగ్ సమయంలో ఎస్బీఐ షేర్లు కూడా 8 శాతం మేర నష్టపోయాయి. కరోనా వైరస్ ప్రభావం ఎస్బీఐ కార్డ్స్ లిస్టింగ్ పైన కూడా పడుతోంది.
మార్కెట్లకు కరోనా దెబ్బ
కరోనా వైరస్ దెబ్బతో గతవారం స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. గత సోమవారం 3వేల పాయింట్లు, గురువారం అంతే మొత్తంలో నష్టపోయిన సెన్సెక్స్ శుక్రవారం కూడా 3వేల పాయింట్ల నష్టంతో ప్రారంభమైంది. కానీ సాయంత్రానికి కాస్త కోలుకొని లాభాల్లో ముగిసింది. వారాంతంలో లాభాల్లో ముగిసినప్పటికీ.. మొత్తంగా గత వారం మాత్రం భారీ నష్టాలను చవి చూశాయి.
కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా 6 వేల మందికి పైగా మృత్యువాత పడగా, లక్షన్నర మందికి పైగా సోకింది. భారత్లో కరోనా సోకిన వారి సంఖ్య 110కి చేరుకుంది. ఇద్దరు మృతి చెందారు. ప్రపంచ మార్కెట్లు కుప్పకూలుతుండటంతో ఈ ప్రభావం భారత మార్కెట్లపై కూడా పడుతోంది.