కరోనా ఎఫెక్ట్: ఏం చేద్దాం... పోదామా వద్దా? కో-వర్కింగ్ స్పేస్లో కార్యకలాపాలపై స్టార్టప్స్
స్టార్టప్ కంపెనీలు అంటేనే అరకొర నిధులతో, సరికొత్త ఆలోచనలతో పురుడు పోసుకునే నయా బిజినెస్ సంస్థలు. అందుకే, తమ కార్యకలాపాల కోసం అవి తక్కువ ఖర్చులో దొరికే కో-వర్కింగ్ స్పేస్ ఆఫీస్ ల వైపు మొగ్గు చూపుతాయి. అక్కడ కంపెనీ కి ఒక అడ్రస్ దొరుకుతుంది. కూర్చోవటానికి ఒక సీట్ ఉంటుంది. ఎవరైనా వస్తే ఇవ్వటానికి ఒక కాఫీ, సమావేశాలు ఏర్పాటు చేసుకోవటానికి ఒక కాన్ఫరెన్స్ హాల్ వంటి సదుపాయాలు దొరుకుతాయి. ఇవన్నీ కూడా ఒక్కో సీటుకు కేవలం రూ 5,000 ధరలో దొరుకుతున్నాయి. అందుకే కంపెనీ ప్రారంభంలోనే సొంత ఆఫీస్ పెట్టుకొని, రూ లక్షలు ఖర్చు పెట్టి మరీ ఫర్నిచర్ కొనుగోలు చేయటం, తర్వాత కరెంటు బిల్లులు, ఇంటర్నెట్ బిల్లులు కట్టడం చాలా కష్టం. అందుకే నెలకు సుమారు రూ 30,000 నుంచి రూ 50,000 వరకు ఆఫీస్ ఖర్చులకే వెచ్చించటం ఎందుకని, రూ 10,000 నుంచి రూ 15,000 లో కో- వర్కింగ్ స్పేస్ లో అద్దెకు దిగి కంపెనీలను నడిపిస్తున్నారు. అయితే, కరోనా వైరస్ పుణ్యమా అని ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోతున్నాయి. సామజిక దూరం పాటించాలనే నిబంధన కేవలం లాక్ డౌన్ కు మాత్రమే పరిమితం అయ్యేలా లేదు. దీంతో కో-వర్కింగ్ స్పేస్ ఆఫీస్ ల పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు.
పెద్ద పెద్ద సంస్థలు...
కో- వర్కింగ్ స్పేస్ రంగంలో కి అగ్రగామి సంస్థలు ఎన్నో ఎంటరయ్యాయి. ఈ కాన్సెప్ట్ మనకు పూర్తిగా కొత్తదే అయినప్పటికీ... ఇండియా లో కూడా పెద్ద సంఖ్యలో స్టార్టుప్ లు పురుడు పోసుకుంటున్న సందర్భంలో ఇక్కడ కూడా కో-వర్కింగ్ స్పేస్ లకు డిమాండ్ పెరుగుతోంది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, పూణే నగరాల్లో ఈ తరహా కార్యాలయాలు పెద్ద సంఖ్యలో ఏర్పాటయ్యాయి. వి వర్క్, రీగస్, ఐ కీవా, ఆఫీస్ వంటి కంపెనీలు దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. ఒక్కో నగరంలో కూడా నాలుగైదు ప్రధాన ప్రాంతాల్లో కార్యాలయాలను కలిగి ఉండి పెద్ద సంఖ్యలో స్టార్టుప్ కంపెనీలను ఆకర్షించాయి. వీటిలో వందల సంఖ్యలో స్టార్టప్ కంపెనీలు తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి.
13 మిలియన్ ఎస్ఎఫ్ టీ...
హైదరాబాద్ మహా నగరంలో కమర్షియల్ స్పేస్ పెద్ద మొత్తంలో అందుబాటులోకి వస్తోంది. ఇక్కడ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగం విస్తరిస్తుండటం తో పాటు పెద్ద సంఖ్యలో స్టార్టుప్ కంపెనీలు ఏర్పాటవుతుండటంతో ఈ డిమాండ్ ఏర్పడుతోంది. స్థూలంగా హైదరాబాద్ లో 2019 లో 13 లక్షల చదరపు అడుగుల కమర్షియల్ స్థలం అందుబాటులోకి వచ్చింది. ఇందులో ఒక్క వి వర్క్ ఒక్కటే 2,50,000 చదరపు అడుగుల స్థలం లీజుకు తీసుకుంది. దీన్ని బట్టే కో-వర్కింగ్ స్పేస్ కు ఎంత డిమాండ్ ఉందో అర్థమవుతోంది. అయితే, ఈ ఏడాది కరోనా వైరస్ రాకతో వీటి కార్యకలాపాలు భారీగా ప్రభావితం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇప్పటికే దాదాపు రెండు నెలలుగా వీటి కార్యకలాపాలు దెబ్బతిన్నాయి. మరో రెండు నెలలు కూడా సిట్యుయేషన్ ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు లేవని అంటున్నారు.
దూరం... దూరం...
కరోనా వైరస్ వల్ల అందరూ సామాజిక దూరం పాటిస్తున్నారు. అయితే ఇది లాక్ డౌన్ ముగిసిన తర్వాత కూడా కొనసాగే అవకాశాలే అధికంగా కనిపిస్తున్నాయి. కో-వర్కింగ్ ఆఫీస్ ల్లో పక్క పక్కనే తెలియని వ్యక్తులతో కలిసి కూర్చొని పనిచేసే అవకాశం ఎంత వరకు ఉంటుందో అర్థం కాని పరిస్థితి. ఇలాంటి సమయంలో స్టార్టప్ కంపెనీలు ఎంత వరకు ముందుకు వస్తాయో చూడాలని విశ్లేషకులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం లాక్ డౌన్ నేపథ్యంలో అందరూ వర్క్ ఫ్రొం హోమ్ చేస్తున్నారు. ఇంట్లోనే లాప్ టాప్ లో పనులన్నీ చక్కబెట్టేస్తున్నారు. ఒక సారి ఎలాగూ ఇంటి నుంచి కూడా ఎలా పనిచేయవచ్చొ తెలిసిన తర్వాత .. మళ్ళీ అద్దెలు చెల్లించి మరీ కో-వర్కింగ్ స్పేస్లకు క్యూ కడతారా అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న గా ఉంది. ఇండియా సహా ప్రపంచం మొతం కరోనా కు ముందు, కరోనా తర్వాత అనే విధానంలోనే పనిచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి, కో-వర్కింగ్ స్పేస్ రంగంలో ఎలాంటి మార్పులు వస్తాయో చూడాలి మరి.