అక్షయ తృతీయపై కరోనా లాక్ డౌన్ ఎఫెక్ట్ ... బంగారం కొనుగోళ్ళు డౌటే !!
అక్షయ తృతీయ వచ్చిందంటే చాలు బంగారం కొనుగోళ్లతో షాపులన్నీ రద్దీగా మారుతాయి . జ్యూవెలరీ షాపులు ఆఫర్లతో ముఖ్యంగా మహిళాలోకాన్ని ఆకట్టుకుంటాయి. అక్షయ తృతీయ రోజు బంగారం కొనుగోలు చేస్తే అదృష్టం అనే ప్రచారం జోరుగా సాగటంతో అక్షయతృతీయకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. అయితే తాజాగా కరోనా ప్రభావం అక్షయ తృతీయ మీద బాగా పడుతుంది అన్న భావన వ్యక్తం అవుతుంది. కరోనా లాక్ డౌన్ తో జ్యూవెలరీ షాపులు మూతపడ్డాయి . విపరీతమైన నష్టాలను చవి చూస్తున్నాయి .
కరోనా కష్టకాలంలో సపోర్ట్ ... మహిళా పారిశ్రామికవేత్తలకు అండగా 'వియ్ హబ్'
కరోనా లాక్ డౌన్ ప్రభావంతో ఈ సారి అక్షయ తృతీయకు గట్టి దెబ్బ
కరోనా లాక్ డౌన్ ప్రభావంతో ఈ సారి అక్షయ తృతీయ రోజున బంగారం షాపుల ముందు జనాల క్యూ కనిపించే పరిస్థితి లేదు . ప్రజలంతా తీవ్రమైన ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న సమయం కావటంతో పెద్దగా జనాలకు అక్షయ తృతీయ మీద ఆసక్తి కూడా లేదనే చెప్పాలి. దాదాపు నెల రోజులకు పైగా ఏ పని పాట లేకుండా జనాలు ఇళ్లకే పరిమితం కావటంతో ప్రజలు ఆర్ధికంగా ఇబ్బంది పడుతున్నారు. కొద్దో గొప్పో దాచుకున్న డబ్బు ఈ లాక్ డౌన్ సమయంలో ఖర్చవుతుంది. ఎవరో బాగా గొప్ప ధనవంతులు మినహాయించి సామాన్య , మధ్యతరగతి ప్రజలు ఇప్పట్లో బంగారం జోలికి వెళ్ళే అవకాశమే లేదు .
అత్యవసరం మినహాయించి ఆలోచించే స్థితిలో లేని మెజార్టీ ప్రజలు
ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అత్యవసరం మినహాయించి ఆలోచించే స్థితిలో మధ్యతరగతి ప్రజలు లేరు . నిజంగా చెప్పాలంటే మహిళాలోకానికి అక్షయ తృతీయ అంటే ఒక పండుగ రోజు . ఎంతో కొంత బంగారం భర్త చేత కొనిపించి జేబులకు చిల్లులు పెట్టే రోజు. కానీ ఇప్పుడు ఉన్న ఆర్ధిక పరిస్థితుల్లో మగాళ్ళు అక్షయ తృతీయ కోసం భార్యలకు బంగారం కొనివ్వటానికి ఆసక్తి చూపించరు. అటు భార్యలు కూడా భర్తలను ఇబ్బంది పెట్టే చర్యలకు దిగరు. ఇక ఒకవేళ అలా కొనాలనే వాళ్ళు ఉన్నా షాపులు అన్నీ బంద్ ఉండటంతో సైలెంట్ గా ఉండాల్సిన పరిస్థితి .
జ్యూవెలరీ షాపులకు తీవ్ర నష్టం.. అక్షయ తృతీయ కొనుగోళ్ళు కష్టమే
కొన్ని జ్యూవెలరీ షాపులు ఆన్లైన్ లో అమ్మకాలు జరిపినా ఆన్ లైన్ అమ్మకాలపై అవగాహన లేని వాళ్ళు దాని జోలికి వెళ్ళరు. ఈ సారి అక్షయ తృతీయ బంగారం కొనుగోళ్లపై కరోనా ఎఫెక్ట్ ఉంటుంది అన్నది నిర్వివాదాంశం . అక్షయతృతీయకు గోల్డ్ షాపులు పెట్టే ఆఫర్ల మాయలో జేబులు గుల్ల చేసుకునే వాళ్ళు ఈసారి దాని బారి నుండి బయట పడినట్టే . అయితే కరోనా లాక్ డౌన్ ప్రభావంతో షాపులు నెల రోజులకు పైగా బంద్ చేసిన నేపధ్యంలో జ్యూవెలరీ షాపుల వాళ్ళు విపరీతమైన నష్టాలను చవిచూశారు . ఇక అక్షయ తృతీయ సమయంలో కూడా ఈ సారి షాప్స్ తెరవలేని పరిస్థితి వారికి మరింత ఇబ్బందికరంగా మారింది .