బంగారం, వెండికి కాలం చెల్లింది.. ఇప్పుడంతా రాగిమయం.. ధరలు పెరిగినా వదలని ఇన్వెస్టర్లు.. కారణం ఏంటంటే..
ప్రపంచవ్యాప్తంగా సాగుతున్న స్వచ్ఛమైన భవిష్యత్తు, హరిత ఇంధన పరివర్తన పరుగులో 'రాగి' (కాపర్) అత్యంత కీలకమైన లోహంగా అవతరించింది. కొత్త ఇంధన ఆర్థిక వ్యవస్థలోని పవర్ గ్రిడ్లు, ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక శక్తి ప్రాజెక్టులు, ఏఐ (AI) డేటా సెంటర్లలో రాగి ప్రాధాన్యత ఈ మధ్య కాలంలో విపరీతంగా పెరిగింది. ఈ నేపథ్యంలో భారతదేశంలో రాగి ఫ్యూచర్స్ ధరలు కనివిని ఎరుగని రీతిలో ఆగస్టులో కిలోకు రికార్డు స్థాయిలో రూ. 1,400 మార్కును తాకగా.. లండన్ మెటల్ ఎక్స్ఛేంజ్ (LME)లో ప్రపంచ ధరలు కూడా గరిష్ట స్థాయికి సమీపంలో ట్రేడ్ అవుతున్నాయి.
కొత్త రాగి గనుల అన్వేషణకు ప్రభుత్వ, పర్యావరణ అనుమతులు పొందడం, మౌలిక సదుపాయాలు కల్పించడానికి సంవత్సరాల సమయం పట్టడమే కాకుండా భారీ వ్యయంతో కూడుకున్న పని. ఉన్న గనుల్లో ఖనిజ నాణ్యత తగ్గడం, ఉత్పత్తి వ్యయం పెరగడం వల్ల సరఫరా పరిమితంగా ఉంది. మరోవైపు ఎస్&పి గ్లోబల్ (S&P Global) అంచనా ప్రకారం.. ప్రపంచ రాగి డిమాండ్ 2025లోని 28 మిలియన్ టన్నుల నుంచి 2040 నాటికి ఏకంగా 50 శాతం పెరిగి 42 మిలియన్ టన్నులకు చేరనుంది. కాపర్ కాన్సంట్రేట్ కొరత వల్ల స్మెల్టర్ల ఉత్పత్తి వ్యయం పెరిగి సప్లై చైన్ తీవ్ర ఒత్తిడికి గురవుతోంది.

ధరలు ఆకాశాన్ని తాకుతున్నప్పటికీ తయారీదారులు వేచి చూడకుండా అధిక ప్రీమియం చెల్లించి మరీ రాగిని తక్షణమే పొందేందుకు ఆసక్తి చూపుతున్నారు. కేబుళ్లు, ట్రాన్స్ఫార్మర్లు తయారు చేసే పారిశ్రామిక కొనుగోలుదారులకు రాగి సరఫరా ఆగితే ఉత్పత్తి నిలిచిపోవడం, ఆర్డర్లు రద్దవడం లేదా కస్టమర్లను కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అందువల్ల, సరఫరా లేకపోవడం కంటే ఎక్కువ ధర చెల్లించడమే వ్యాపార పరంగా సురక్షితమని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. LME నిర్ణయించే ప్రపంచ ప్రామాణిక ధరతో పాటు కొనుగోలుదారులు చెల్లిస్తున్న ఈ అదనపు ప్రీమియం, భౌతిక లోహానికి ఉన్న తీవ్రమైన కొరతను స్పష్టం చేస్తోంది.
స్వదేశీ అవసరాలకు సరిపడా శుద్ధి చేసిన రాగిని భారత్ ఉత్పత్తి చేయలేకపోవడంతో దిగుమతులపై తీవ్రంగా ఆధారపడుతోంది. ఇంటర్నేషనల్ కాపర్ అసోసియేషన్ ఇండియా (ICAI) ప్రకారం.. 2025 ఆర్థిక సంవత్సరంలో దేశీయ రాగి డిమాండ్ 9.3 శాతం పెరిగి 1.878 మిలియన్ టన్నులకు చేరింది. భవన నిర్మాణం (25%), పారిశ్రామిక అవసరాలు (19%), మౌలిక సదుపాయాల (17%) రంగాలు ప్రధాన వినియోగదారులుగా ఉన్నాయి. అదే సమయంలో సౌర, పవన విద్యుత్, ఈవీ, బ్యాటరీ రంగాలు 32 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసినప్పటికీ, మొత్తం డిమాండ్లో ఇవి ఇంకా 4.6 శాతం పరిధిలోనే ఉన్నాయి.
దేశవ్యాప్తంగా విద్యుత్ వినియోగం మే 2026 నాటికి 270.8 గిగావాట్ల రికార్డు స్థాయికి చేరడం, విద్యుత్ గ్రిడ్ల విస్తరణ వేగవంతం కావడం రాగి అవసరాన్ని పెంచుతోంది. కొత్త చమురుగా అభివర్ణిస్తున్న రాగికి సాంప్రదాయ రంగాలు, భవిష్యత్ హరిత సాంకేతికతల నుంచి డిమాండ్ విస్తరిస్తుండటంతో రాబోయే రోజుల్లో భారతీయ కొనుగోలుదారులకు అంతర్జాతీయ ధరల హెచ్చుతగ్గులు, రవాణా ఆటంకాల భారం తప్పకపోవచ్చని నిపుణులు భావిస్తున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్సైట్లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్సైట్లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
