కన్ఫ్యూజన్: FASTag ఉంది కానీ.. టోల్ గేట్ల వద్ద బారులుతీరిన వాహనాలు
డిసెంబర్ 15, 2019 (ఆదివారం) నుంచి జాతీయ రహదారులలోని టోల్ గేట్ల వద్ద దేశవ్యాప్తంగా FASTag విధానం అమలులోకి వచ్చింది. ఈ విధానానికి సిద్ధంకాని వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. టోల్ గేట్ల వద్ద FASTag లేని వాహనదారులు నగదు చెల్లించేందుకు బారులు తీరారు. నగదు చెల్లించి వెళ్లే మార్గంలో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. వివిధ టోల్ గేట్ల వద్ద 25 శాతం నగదు చెల్లింపులు అని చెప్పినప్పటికీ, ఎక్కువ లైన్ల వద్దనే తీసుకుంటున్నారు. అలాగే కొన్ని చోట్ల FASTag పని చేయలేదు. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. నగదు కౌంటర్ల్ ద్వారా టోల్ సిబ్బంది వారిని పంపించారు.
FASTag, 25% క్యాష్ లైన్లతో పెద్ద రిలీఫ్: అదే లైన్లో వెళ్తే అధిక ఛార్జ్
మొదటి రోజు కన్ఫ్యూజన్
ఆదివారం ముంబై, పుణే, హైదరాబాద్, విజయవాడ సహా పలు టోల్ గేట్ల వద్ద లైన్లలో కన్ఫ్యూజన్ ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వం పొడిగిస్తూ అవగాహన కల్పిస్తున్నప్పటికీ ఎక్కువమంది వాహనాదారులకు తెలియకపోవడంతో చాలా వాహనాలు క్యాష్ లైన్ల వైపునే రావాల్సి వచ్చింది. దీంతో వాహనాలు బారులుతీరాయి. FASTag అంటేనే ఎలాంటి ఇబ్బందులు లేకుండా టోల్ గేట్ నుంచి నేరుగా వెళ్లిపోవడం. అక్కడ వేచి చూడాల్సిన అవసరం, డబ్బులు చెల్లించే పని లేదు. కానీ FASTag అమలుపరిచిన రోజు కొత్త కావడంతో అందుకు రివర్స్ కనిపించింది. వాహనాలు బారులు తీరాయి. కొన్ని వాహనాలు FASTag లైన్ నుంచి వెళ్లినప్పటికీ ఎక్కువ వాహనాలు క్యాష్ లైన్లలో నిలిచాయి.
FASTag ఉంది.. రీఛార్జ్ చేయలేదు
టోల్ గేట్ల వద్ద క్యాష్ లైన్లలో వరుస కట్టిన వాహనాల్లో కొన్ని FASTag కొనుగోలు చేశాయి. కానీ యజమానులు వాటిని రీఛార్జ్ చేసుకోవడంలో ఫెయిలయ్యారని, అందుకే ఇబ్బందులు తలెత్తాయని అధికారులు చెబుతున్నారు. ముంబై నుంచి పుణే ప్రయాణిస్తున్న యష్ జలాన్ మాట్లాడుతూ.. చాలామంది FASTag ఇన్స్టాల్ చేశారని, కానీ వాటిని రీఛార్జ్ చేయలేదని అర్థమవుతోందని అన్నారు.
క్యాష్ లైన్లలో ఎక్కువ
FASTag అమలవుతున్నప్పటికీ మొదటి రోజు చాలా తక్కువ వాహనాలు మాత్రమే ఈ లైన్ల నుంచి వెళ్లినట్లుగా కనిపిస్తోంది. కొన్నింటికి FASTag లేవు, మరికొన్నింటికి FASTag ఉన్నప్పటికీ రీఛార్జ్ చేసుకోలేదని, మరికొన్ని FASTagలు డ్యామేజ్ అయ్యాయని, అప్పుడే పాతబడిపోయాయని ఖాలాపూర్ టోల్ ప్లాజా అటెండెంట్ ఒకరు అన్నారు. దీంతో తాము క్యాష్ లైన్లలో వసూలు చేసిన వాహనాలే ఎక్కువగా ఉన్నాయన్నారు. FASTagకు సిద్ధం కాని వారి కోసం కేంద్రం వెసులుబాటు కల్పించిన విషయం తెలిసిందే. టోల్ గేట్ల వద్ద 25 శాతం హైబ్రిడ్ లైన్లు ఏర్పాటు చేసింది. అంతకుముందు 1 లైన్ మాత్రమే కేటాయించారు. కానీ వాహనదారులు సిద్ధం కాలేరని తెలుసుకున్న కేంద్రం వెసులుబాటు కల్పించింది.