ప్రభుత్వ చర్యల వల్ల దేశంలో ఆహార ద్రవ్యోల్బణం క్రమంగా తగ్గుతోంది. ముఖ్యంగా ఆకాశాన్నంటిన వంట నూనె ధరలు తగ్గుముఖం పట్టాయి. భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద వంట నూనెల కొనుగోలుదారుగా ఉంది. మన అవసరాలలో 60% దిగుమతులు చేసుకుంటున్నాం. ఉక్రెయిన్, రష్యా యుద్దం తర్వాత వంట నూనె ధరలు అమంతం పెరిగిపోయాయి. ఇండోనేషియా ఎగుమతులను తాత్కాలికంగా నిషేధించడంతో పామాయిల్ ఏప్రిల్లో రికార్డు స్థాయిలో పెరిగింది. అయితే ప్రభుత్వ చర్యల వల్ల జూన్ లో వంట నూనెల ధరలు తగ్గాయి.
గోధుమ, చక్కెర ఎగుమతులపై నియంత్రణ
ద్రవ్యోల్బణం నియంత్రణలో భాగంగా గోధుమలు, చక్కెరపై ఎగుమతి నియంత్రణ విధించారు. తినదగిన నూనెలపై పన్ను తగ్గించారు. దీంతో గోధుమ, మొక్కజొన్న ధరలు తగ్గాయి. ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో మాంద్యం భయాల కారణంగా కమోడిటీస్ మార్కెట్లో సెంటిమెంట్ దెబ్బతింది. మార్చిలో గరిష్ట స్థాయి నుండి ముడి చమురు సుమారు 20% పడిపోయింది. అటు అంతర్జాతీయంగా ధరలు తగ్గుముఖం పట్టడంతో దేశీయంగా కూడా ధరలు తగ్గుముఖం పడుతున్నాయి.

8 శాతం తగ్గాయి..
ప్రభుత్వ గణాంకాల ప్రకారం గత నెలలో భారతదేశంలో తినదగిన నూనెల సగటు రిటైల్ ధరలు 8% వరకు తగ్గాయి. "గ్లోబల్ మార్కెట్లు బాగా పడిపోయినందున దేశీయ పరిశ్రమ ధరలను మరింత తగ్గించడానికి సిద్ధంగా ఉంది." అని సాల్వెంట్ ఎక్స్ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ B.V. మెహతా చెప్పారు.
పామాయిల్, గోధుమలు, పంచదార, బియ్యంలో భారీగా క్షీణించడం ద్రవ్యోల్బణానికి శుభవార్త అని ఐఎన్జి గ్రూప్ ఒక నోట్లో తెలిపింది.


Click it and Unblock the Notifications