ఐటీ రంగంలో ఉద్యోగుల పనితీరును పర్యవేక్షించడం కొత్త విషయం కాదు. అయితే ఇటీవల కాగ్నిజెంట్ తీసుకున్న నిర్ణయం మాత్రం పెద్ద చర్చకు దారితీసింది. ఉద్యోగులు కంపెనీ ఇచ్చిన ల్యాప్టాప్ లేదా డెస్క్టాప్పై ఎలా పనిచేస్తున్నారు? ఎంతసేపు పని చేస్తున్నారు? మధ్యలో ఎంతసేపు బ్రేక్ తీసుకుంటున్నారు? అన్న అంశాలన్నీ కంపెనీ నేరుగా ట్రాక్ చేయడం ప్రారంభించింది. దీనికోసం కంపెనీ ప్రత్యేకమైన మానిటరింగ్ సాఫ్ట్వేర్లను అమలు చేసింది.దీనిపై విమర్శలు వెలువెత్తుతున్నాయి.
కొత్తగా అమలు చేసిన ఈ వ్యవస్థ ప్రకారం.. ఉద్యోగి తన కీబోర్డు లేదా మౌస్ను ఐదు నిమిషాల పాటు ఉపయోగించకపోతే, ఆ వ్యక్తి ఖాళీగా ఉన్నట్లు సిస్టమ్ గుర్తిస్తుంది. అదే 15 నిమిషాలకు పైగా ఎలాంటి కార్యకలాపం లేకపోతే, ఆ ఉద్యోగి కంప్యూటర్ ముందు లేడా లేదా వేరే పనుల్లో నిమగ్నమై ఉన్నాడా అని పరిగణిస్తుంది. కంపెనీ ఈ డేటాను సేకరించడానికి ProHance వంటి టూల్స్ను ఉపయోగిస్తోంది. ఈ టూల్ ఉద్యోగి ఏ అప్లికేషన్ను ఎంతసేపు ఉపయోగిస్తున్నాడు? ఏ పనిపై ఎంత సమయం ఖర్చు చేస్తున్నాడు? అనే వివరాలను కూడా క్షుణ్నంగా రికార్డ్ చేస్తుంది.

అయితే ఈ స్థాయి ట్రాకింగ్ ఉద్యోగుల్లో ఆందోళనకు కారణమవుతోంది. ఇప్పటికే ఏఐ కారణంగా ఉద్యోగ భద్రతపై సందేహాలు నెలకొన్న సమయంలో.. ఇలాంటి కఠినమైన పర్యవేక్షణ మరింత ఒత్తిడిని పెంచుతోందని పలువురు ఉద్యోగులు చెబుతున్నారు. కొన్ని జట్లు ఈ మానిటరింగ్ రూల్స్ను కొంచెం సడలింపుతో అమలు చేస్తుండగా.. మరికొన్ని జట్లు చాలా కఠినంగా పాటిస్తున్నాయని సమాచారం.
అయితే Cognizant మాత్రం ఉద్యోగుల భయాలను తగ్గించే ప్రయత్నం చేస్తోంది. ఈ డేటాను ప్రమోషన్లు, పనితీరు అంచనాలు లేదా బోనస్ వంటి అంశాలకు ఎలాంటి సంబంధం పెట్టబోమని కంపెనీ స్పష్టం చేసింది. ఉద్యోగి అనుమతితోనే ఈ టూల్స్ను ఉపయోగిస్తున్నామని కూడా చెబుతోంది. కానీ ఉద్యోగులు మాత్రం ఇది "సమ్మతి" కంటే "తప్పనిసరి నిబంధన"గా అమలవుతోందనే అభిప్రాయంలో ఉన్నారు.
ఇలాంటి మానిటరింగ్ కేవలం కాగ్నిజెంట్కే పరిమితం కాదని, విప్రో వంటి పెద్ద ఐటీ సంస్థలు కూడా ఇదే తరహా టూల్స్ను ఉపయోగిస్తున్నాయని నివేదికలు చెబుతున్నాయి. ఉత్పాదకత పెంచడమే లక్ష్యమని కంపెనీలు చెబుతున్నా, ఉద్యోగులు మాత్రం దీనివల్ల నిత్యం కంప్యూటర్ ముందు కదలకుండా కూర్చోవాల్సి వస్తోందని, సహజమైన పని శైలిపై ఒత్తిడి పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఏదేమైనా డిజిటల్ యుగంలో ఉద్యోగి-కంపెనీ మధ్య నమ్మకం, పారదర్శకత, గౌరవం ఎలా కొనసాగాలి అనే కొత్త చర్చకు కాగ్నిజెంట్ మానిటరింగ్ వ్యవస్థ కారణమైంది. టెక్నాలజీతో పనిని మెరుగుపరచడం సంగతి ఏమో కాని..దీనివల్ల మానవీయ ఒత్తిడి పెరగకుండా చూడటం కూడా సంస్థల బాధ్యతే అని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఈ ట్రాకింగ్ వ్యవస్థపై కాగ్నిజెంట్ క్లారిటీ
ఈ ఆరోపణలను సంస్థ బలంగా ఖండించింది. TOIకు చేసిన ప్రకటనలో ఉద్యోగులపై గట్టి ట్రాకింగ్ జరుగుతోందనే ఆరోపణలు పూర్వాపరాలు తెలియని వ్యాఖ్యలేనని స్పష్టం చేసింది. కంపెనీ వివరణ ప్రకారం కొన్ని ప్రత్యేక బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ (BPM) లేదా ఇంట్యూటివ్ ఆపరేషన్స్ & ఆటోమేషన్ ప్రాజెక్టులలో మాత్రమే, అది కూడా క్లయింట్ అభ్యర్థన మేరకు, వివిధ ఉత్పాదకత కొలత సాధనాలు వాడుతున్నట్లు పేర్కొంది. ఇవి పరిశ్రమలో చాలా కాలంగా ఉన్న సాధారణ పద్ధతులేనని స్పష్టం చేసింది.
కాగ్నిజెంట్ చెబుతున్నదేమిటంటే.. ఈ టూల్స్ పనితీరు కొలిచేందుకు కాదు,క్లయింట్ వర్క్ఫ్లోలో ఉన్న అసమర్థతలు, అడ్డంకులను గుర్తించడానికి మాత్రమే ఉపయోగిస్తారు. ప్రాసెస్ ట్రాన్స్ఫర్మేషన్ లక్ష్యాలతో, ఏ దశ ఎక్కువ సమయం తీసుకుంటోంది? ఏ వర్క్ఫ్లోలో ఆలస్యం జరుగుతోంది? వంటి అంశాలను అర్థం చేసుకోవడంలో ఇవి సహాయపడతాయి. ఉద్యోగుల వ్యక్తిగత పనితీరును అంచనా వేయడం, ప్రొమోషన్లు, బోనస్లకు ఈ డేటాను అనుసంధానం చేయడం వంటి ఉద్దేశాలు లేవని కంపెనీ స్పష్టంచేసింది.
కాగా, ProHance వంటి టూల్స్ సాధారణంగా లాగిన్ సమయాలు, యాక్టివ్ అప్లికేషన్లు, పని వ్యవధి, విరామాలు వంటి డేటాను చూపుతాయి. ఇది ఉద్యోగి దినచర్యను నిమిషానికి నిమిషం మ్యాప్ చేసినప్పటికీ, దీని వెనుక ఉద్దేశం ఉద్యోగిని పర్యవేక్షించడం కాదని, పని ప్రాసెస్ మెరుగుదలకే పరిమితమని సంస్థ చెబుతోంది. అదనంగా ఉద్యోగుల స్పష్టమైన సమ్మతి తీసుకున్న తర్వాతే ఈ టూల్స్ అమల్లోకి వస్తాయని, ఏ బృందం కూర్పుపై లేదా ఉద్యోగ భద్రతపై వీటి ప్రభావం ఉండదని కాగ్నిజెంట్ పేర్కొంది.
More From GoodReturns

30 వేల మంది ఉద్యోగుల తొలగింపు అంతా ఫేక్.. లేఆప్స్పై క్లారిటీ ఇచ్చిన టెక్ మహీంద్రా..

రూ. 6 వేల కోట్లకు చేరిన సుందర్ పిచాయ్ జీతం..గూగుల్ తాజాగా వేతన ప్యాకేజీ ఎంత పెంచిందంటే..

ఇరాన్ వార్ దెబ్బకు వణుకుతున్న భారత ఐటీ సెక్టార్.. తీవ్ర ప్రమాదంలో కీలక ప్రాజెక్టులు..

IT Jobs: ఐటీ కొలువుల్లో AI కలకలం.. ఇక ఫ్రెషర్లకు ఉద్యోగాలు దొరకడం కష్టమేనా?

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

Bengaluru: ఒకప్పుడు డబ్బు లేక నేలపై నిద్ర.. నేడు రూ. 800 కోట్ల టర్నోవర్! 23 ఏళ్ల అంజలి ఇన్స్పైరింగ్ జర్నీ!

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు తగ్గాయి.. ఎంత తగ్గాయో తెలిస్తే ఎగిరి గంతేస్తారు.. మార్చి 2, సోమవారం పసిడి ధరలు ఇవే..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!



Click it and Unblock the Notifications