హైదరాబాద్ వద్దు విశాఖపట్నం ముద్దు.. మధురవాడలో సెజ్ ఏర్పాటు చేయబోతున్న కాగ్నిజెంట్..
ప్రముఖ అంతర్జాతీయ ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (Cognizant) ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో కొత్తగా ఒక ఇన్ఫర్మేషన్ టెక్నికల్, ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ (IT/ITeS) ప్రత్యేక ఆర్థిక మండలిని (SEZ) ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం నుండి అధికారిక ఆమోదం పొందింది. విశాఖపట్నం గ్రామీణ మండలంలోని ఐటీ-మధురవాడ-2 ప్రాంతంలో 8.98 హెక్టార్ల విస్తీర్ణంలో ఈ సరికొత్త ఎస్ఈజెడ్ను అభివృద్ధి చేయనున్నారు.
ప్రత్యేక ఆర్థిక మండలాలు చట్టం, 2005లోని నిబంధనల ప్రకారం కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఈ ప్రాజెక్టును జూన్ 25న అధికారికంగా నోటిఫై చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రతిపాదన ఎస్ఈజెడ్ చట్టం కింద ఉన్న అన్ని చట్టబద్ధమైన అవసరాలను విజయవంతంగా తీర్చిందని సంతృప్తి చెందిన తర్వాత.. కేంద్ర ప్రభుత్వం 2026 జూన్ 11నే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ఆమోద పత్రాన్ని (Letter of Approval) మంజూరు చేసింది.

ఈ ప్రాజెక్టు ఆమోదంతో పాటుగా చట్టంలోని సెక్షన్ 13 నిబంధనల ప్రకారం ఈ SEZ పర్యవేక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక ఆమోద కమిటీని (Approval Committee) కూడా ఏర్పాటు చేసింది. ఎస్ఈజెడ్ అభివృద్ధి కమిషనర్ (Development Commissioner) నేతృత్వం వహించే ఈ ఉన్నత స్థాయి కమిటీలో కేంద్ర వాణిజ్య శాఖ, విదేశీ వాణిజ్య డైరెక్టరేట్ జనరల్ (DGFT), కస్టమ్స్, ఆదాయపు పన్ను శాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖలతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, డెవలపర్ సంస్థకు చెందిన కీలక ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు.
దీనికి అదనంగా కస్టమ్స్ చట్టం 1962 ప్రకారం ఈ నోటిఫైడ్ ఎస్ఈజెడ్ను 2026 జూన్ 25 నుండి అమలులోకి వచ్చేలా ఇన్ల్యాండ్ కంటైనర్ డిపోగా (Inland Container Depot) కూడా కేంద్రం ప్రకటించింది, దీనివల్ల సదరు జోన్ పరిధిలోనే అన్ని రకాల కస్టమ్స్ సంబంధిత దౌత్య కార్యకలాపాలను సులభంగా నిర్వహించడానికి వీలు కలుగుతుంది.
ఈ తాజా పరిణామం టెక్నాలజీ రంగంలో ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎందుకంటే దీనికి సరిగ్గా నాలుగు నెలల క్రితం అంటే ఫిబ్రవరి 2026లో తెలంగాణలోని నానక్రామ్గూడ, ఆదిబట్ల ప్రాంతాలలో రెండు భారీ ఐటీ/ఐటీఈఎస్ ఎస్ఈజెడ్లను అభివృద్ధి చేసేందుకు గతంలో సమర్పించిన ప్రతిపాదనలను కాగ్నిజెంట్ సంస్థ అధికారికంగా ఉపసంహరించుకుంది. ఆ ప్రాజెక్టులకు కేటాయించిన భూమిని డీ-నోటిఫై చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరిన తరుణంలో.. ఇప్పుడు ఏపీలోని విశాఖపట్నం వైపు మొగ్గు చూపడం గమనార్హం.
కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఈ తాజా నోటిఫికేషన్ ఎస్ఈజెడ్ ఏర్పాటును అధికారికంగా ధృవీకరించినప్పటికీ.. ఈ ప్రాజెక్ట్ ద్వారా రాబోయే పెట్టుబడుల వివరాలు, ఉపాధి కల్పన సామర్థ్యం లేదా దీని అమలుకు పట్టే కాలపరిమితిని ప్రస్తుతానికి వెల్లడించలేదు. ఏదేమైనప్పటికీ, ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ భవిష్యత్తులో విశాఖపట్నం నగరంలోని ఐటీ మౌలిక సదుపాయాలను సరికొత్త ఎత్తుకు తీసుకెళ్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
డిస్క్లైమర్: ఈ వెబ్సైట్లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్సైట్లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
