ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా ప్రయోజనాల కోసమా: రిలయన్స్ జియో ఆగ్రహం
న్యూఢిల్లీ: సెల్యూలార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (COAI) ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో భగ్గుమంది. ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా ప్రయోజనాల కోసమే ఇది పని చేస్తోందని తాజా లేఖలో ధ్వజమెత్తింది. ఈ మేరకు కేంద్రమంత్రి రవిశంకర ప్రసాద్కు లేఖ రాసింది. అంతకుముందు కూడా ఓసారి లేఖ రాసిన రిలయన్స్ జియా తాజాగా మరో లేఖలో ఆగ్రహం వ్యక్తం చేసింది. COAI పక్షపాతంతో వ్యవహరిస్తోందని, తద్వారా సుప్రీం కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా వెళ్తోందని పేర్కొంది.
టెలికం సంస్థలు భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా సంస్థలకు ఉద్దీపన ప్రకటించవద్దని ఇదివరకు లేఖలో పేర్కొంది. ఇప్పుడు మరో లేఖ ద్వారా ఆగ్రహం వ్యక్తం చేసింది. సర్దుబాటు చేసిన స్థూల రాబడి (AGR) ఆధారంగా చట్టబద్ధమైన బకాయిల చెల్లింపు అంశంలో ఆ రెండు సంస్థలకు ఊరట కల్పించేందుకు చట్టపరమైన ఎలాంటి అధికారం ప్రభుత్వం దగ్గర లేదని తెలిపింది. ఈ అంశంపై ఇప్పటికే కోర్టు తీర్పు చెప్పిందని, అందుకు అనుగుణంగా వెళ్లాలని సూచించింది.

బకాయిలు మాఫీ చెయ్యడమో లేదా వడ్డీని, జరిమానాని తగ్గించడమో చేయాలని ఎయిర్టెల్, వొడాఫోన్ అభ్యర్థించాయి. అయితే వీటిని ఇటీవల సుప్రీం కోర్టు కొట్టివేసిందని రిలయన్స్ జియో తన లేఖలో గుర్తు చేసింది. సుప్రీం కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా వెళ్లే అవకాశం ప్రభుత్వానికి లేదని తన తాజా లేఖలో స్పష్టం చేసింది. కాబట్టి COAI కోరినట్టు ఆ రెండు సంస్థలకు ఉద్దీపన ప్రకటించే ఆలోచనలు సరికాదని తెలిపింది.
టెలికం రంగం చాలా ఒడిదొడుకుల్లో ఉన్న నేపథ్యంలో ప్రభుత్వానికి చెల్లించాల్సిన రూ.1.3 లక్షల కోట్లను మాఫీ చేయాల్సిందిగా కోరుతూ అక్టోబర్ 31 COAI కేంద్రానికి లేఖ రాసింది. లేదంటే రెండేళ్ల మారటోరియంతో పదేళ్లలో చెల్లించే వెసులుబాటు కల్పించాలని కోరింది. ఈ చర్యలు తీసుకోకుంటే ఎయిర్టెల్, వొడాఫోన్ పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోతాయని, అప్పుడు ఈ రంగంలో గుత్తాధిపత్యం రాజ్యమేలుతుందని హెచ్చరికలు జారీ చేసింది.


Click it and Unblock the Notifications