Tech Layoffs: ఉద్యోగులను తగ్గించే పనిలో Qualcomm.. ఎంతమందిపై వేటేస్తోందంటే..
Tech Layoffs: రోజులు గడిచే కొద్ది ఉద్యోగులకు భరోసా రావాల్సింది పోగా భయాలు మరింతగా పెరిగిపోతున్నాయి. రోజు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడో ఒకచోట ఉద్యోగుల తొలగింపుల గురించి వార్తలు వస్తుండటం అనేక మందికి నిద్రలేకుండా చేస్తోంది. తాజాగా ఈ జాబితాలో Qualcomm కంపెనీ కూడా చేరిపోయింది.
ప్రఖ్యాత చిప్ తయారీ సంస్థ Qualcomm రానున్న త్రైమాసిక ఫలితాలతో పాటు భారీగా ఉద్యోగులను తొలగించాలని చూస్తోందని సమచారం. మే 3న ఫలితాల వెల్లడితో పాటు 5 శాతం ఉద్యోగుల కోతకు సంబంధించిన ప్రకటన ఉండనున్నట్లు విషయం తెలిసిన వ్యక్తుల ద్వారా వెల్లడైంది. అమ్మకాల్లో తగ్గుదలతో పాటు కొనసాగుతున్న సాంకేతిక మందగమనం కారణంగా కంపెనీ ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడైంది.

ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఈ రంగంలోని కంపెనీలు తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గించాయి. చాలా వరకు మెుబైల్ విభాగంలోని ఉద్యోగులపై తొలగింపుల ప్రభావం ఉండనున్నట్లు సమాచారం. ఈ విభాగంలో ఏకంగా 20 శాతం మందిని తగ్గించే అవకాశం ఉన్నట్లు మూలాల ప్రకారం వెల్లడైంది. అయితే దీనికి సంబంధించి కంపెనీ అధికారికంగా ఇప్పటి వరకు స్పందించలేదు.
ప్రస్తుతం మార్కెట్లో ఉన్న డిమాండ్ దృష్టిలో ఉంచుకుని కార్యకలాపాలను క్రమబద్ధీకరిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే కంపెనీ నిర్వహణ ఖర్చులను సుమారు 5 శాతం వరకు తగ్గించాలని నిర్ణయించినట్లు గతంలో సీఈవో వెల్లడించారు. స్మార్ట్ఫోన్ అమ్మకాలు మందగించడం వల్ల క్వాల్కామ్ ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు అంతర్గత వర్గాలు చెబుతున్నాయి.

గత త్రైమాసికంలో కూడా అమ్మకాలు తగ్గడం కంపెనీని ఇబ్బందికి గురిచేస్తున్న అంశాల్లో ఒకటిగా ఉంది. దీని వల్ల డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో నికర ఆదాయం ఏడాది ప్రాతిపదికన 34 శాతం మేర క్షీణించాయి. అలాగే ఏడాది కిందటి కంటే ఆదాయం 12 శాతం పడిపోయింది. చిప్ తయారీ ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న Qualcomm.. స్మార్ట్ఫోన్ విక్రయాలలో తిరోగమనంతో ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటోందని తెలుస్తోంది. తాజా నివేదిక ప్రకారం గ్లోబల్ స్మార్ట్ఫోన్ షిప్మెంట్లు 2023లో 1.1 శాతం తగ్గుతాయని ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ అంచనా వేసింది.


Click it and Unblock the Notifications