Flipkart: ఇ-కామర్స్ కంపెనీలో చైనా పెట్టుబడుల ప్రవాహం: రూ. వేలకోట్లు ఇన్వెస్ట్
బెంగళూరు: బెంగళూరు ప్రధాన కేంద్రంగా దేశవ్యాప్తంగా తన వ్యాపార కార్యకలాపాలను కొనసాగిస్తోన్న ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్ఫామ్ ఫ్లిప్కార్ట్లో చైనాకు చెందిన ప్రముఖ మల్టీనేషనల్ టెక్నాలజీ అండ్ ఎంటర్టైన్మెంట్ కంగ్లోమెరేట్ కంపెనీ.. టెన్సెంట్ హోల్డింగ్స్ లిమిటెడ్ భారీ ఎత్తున పెట్టుబడులను పెట్టింది. ఫ్లిప్కార్ట్ సహ వ్యవస్థాపకుడు బిన్ని బన్సల్కు చెందిన స్టేక్స్ను కొనుగోలు చేసింది.
దీని విలువ 264 మిలియన్ డాలర్లు. భారత కరెన్సీతో పోల్చుకుంటే 2,060 కోట్ల రూపాయలు. బిన్ని బన్సల్కు చెందిన వాటాలను టెన్సెంట్ హోల్డింగ్స్ కొనుగోలు చేసింది. తన యూరోపియన్ సబ్సిడియరీ ద్వారా ఈ మేరకు లావాదేవీలను నిర్వహించింది. యూరోపియన్ దేశాల్లో తన వ్యాపార కార్యకలాపాలను నిర్వహించుకోవడానికి టెన్సెంట్ కంపెనీ ప్రత్యేకంగా క్లౌడ్ యూరోప్ బీవీ పేరుతో ఓ సబ్సిడియరీ కంపెనీని నెలకొల్పింది.
దీని ద్వారా ఫ్లిప్కార్ట్లో ఇన్వెస్ట్ చేసింది. బిన్ని బన్సల్కు చెందిన వాటాలను 2,060 కోట్ల రూపాయలతో కొనుగోలు చేసింది. ఈ లావాదేవీల తరువాత ఫ్లిప్కార్ట్లో బిన్ని బన్సల్ వాటా 1.84 శాతానికి చేరింది. 2021 అక్టోబర్లోనే దీనికి సంబంధించిన ప్రాథమిక ప్రక్రియ మొత్తం పూర్తయింది. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే ఫ్లిప్కార్ట్ యాజమాన్యం.. ఈ వాటాల అమ్మకం విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేసింది.
ఇంతకుముందు కూడా ఫ్లిప్కార్ట్లో టెన్సెంట్ వాటాలు ఉండేవి. దాని విలువ 0.72 శాతం. 2021 జులైలో ఫ్లిప్కార్ట్ వాల్యుయేషన్ 37.6 బిలియన్ డాలర్లుగా చేరడంతో ఆ వాటాల విలువ పెరిగింది. 264 మిలియన్ డాలర్లుగా నమోదైంది. ఇదివరకు 3.6 బిలియన్ డాలర్లుగా ఉన్న ఫ్లిప్కార్ట్.. ఆ తరువాత ఏకంగా 37.6 బిలియన్ డాలర్లకు పెరిగింది.
దీనికి ప్రధాన కారణం- సింగపూర్కు చెందిన హెల్త్ ఫండ్ జీఐసీ, సీపీపీ ఇన్వెస్టిమెంట్స్, సాఫ్ట్బ్యాంక్ విజన్ ఫండ్ 2, వాల్మార్ట్ పెట్టుబడులు పెట్టడంతో ఫ్లిప్కార్ట్ వేల్యూ పెరిగింది. టెన్సెంట్లోనూ పలు మల్టీనేషనల్ కంపెనీలకు వాటాలు ఉన్నాయి. డిస్రప్ట్ ఏడీ, ఖతార్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ, ఖజానా నేషనల్ బెర్హాద్, విల్లోగ్ కేపిటల్, అంటారా కేపిటల్, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, టైగర్ గ్లోబల్.. ఇవన్నీ ఇన్వెస్ట్ చేశాయి.