బంగారంపై చైనా షాకింగ్ నిర్ణయం.. పేపర్ గోల్డ్ బ్యాన్ చేసిన డ్రాగన్ కంట్రీ.. ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ఆందోళన..
అంతర్జాతీయ పసిడి మార్కెట్లో పెన్నడూ లేని విధంగా సంచలనం చోటుచేసుకుంది. ప్రపంచంలోనే అతిపెద్ద బంగారం వినియోగ దేశాలలో ఒకటైన చైనా, కాగితపు బంగారం (పేపర్ గోల్డ్) వ్యాపారంపై ఊహించని విధంగా కఠిన ఆంక్షలు విధించింది.
డ్రాగన్ కంట్రీకి చెందిన ప్రముఖ బ్యాంకింగ్ దిగ్గజం ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా (ICBC)తో పాటు ఆ దేశంలోని దాదాపు 90 శాతం బ్యాంకులు షాంఘై గోల్డ్ ఎక్స్ఛేంజ్తో ముడిపడి ఉన్న పలు ఫైనాన్షియల్ డెరివేటివ్స్ ట్రేడింగ్ను తక్షణమే నిలిపివేశాయి. ముఖ్యంగా లీవరేజ్ ఆధారిత స్పాట్ కాంట్రాక్టులు.. డిఫర్డ్ కాంట్రాక్టుల సేవల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడమే కాకుండా, తమ ఖాతాదారులను వెంటనే పొజిషన్లను క్లోజ్ చేయాలని లేదా భౌతిక బంగారాన్ని డెలివరీ తీసుకోవాలని స్పష్టం చేశాయి.

చైనా తీసుకున్న ఈ అనూహ్య నిర్ణయం వెనుక బలమైన ఆర్థిక వ్యూహాలు, రిస్క్ మేనేజ్మెంట్ దాగి ఉన్నాయి. సాధారణంగా పేపర్ గోల్డ్ వ్యాపారంలో 'లీవరేజ్' విధానాన్ని విరివిగా ఉపయోగిస్తుంటారు. అంటే ఇన్వెస్టర్లు స్వల్ప మొత్తంలో మార్జిన్ మనీని చెల్లించి.. మార్కెట్లో చాలా పెద్ద పరిమాణంలో Gold పొజిషన్లను కొనుగోలు చేస్తుంటారు.
ప్రతికూల పరిస్థితుల్లో బంగారం ధరలు హఠాత్తుగా పడిపోతే.. ఈ లీవరేజ్ ట్రేడింగ్ వల్ల ఇన్వెస్టర్లతో పాటు బ్యాంకులు కూడా భారీగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఈ రకమైన ఊహాజనిత (స్పెక్యులేటివ్) ట్రేడింగ్ను అరికట్టడం ద్వారా తన ఆర్థిక వ్యవస్థను సురక్షితంగా ఉంచడమే చైనా ప్రాథమిక లక్ష్యం. దీనితో పాటు మార్కెట్లో కేవలం కాగితాలపై జరిగే వ్యాపారాన్ని పక్కన పెట్టి.. వాస్తవమైన భౌతిక (ఫిజికల్) బంగారానికి ప్రాధాన్యత ఇవ్వాలని చైనా భావిస్తోంది.
ఈ వ్యూహంలో భాగంగా చైనా ఇప్పటికే హాంకాంగ్, సింగపూర్, రియాద్ వంటి అంతర్జాతీయ నగరాల్లో భారీ వ్యూహాత్మక నెట్వర్క్ను నిర్మిస్తోంది. హాంకాంగ్లో సెంట్రల్ గోల్డ్ క్లియరింగ్, సెటిల్మెంట్ వ్యవస్థలను బలోపేతం చేయడమే కాకుండా.. అక్కడ ఉన్న Gold నిల్వ సామర్థ్యాన్ని ఏకంగా 2 వేల టన్నులకు పైగా విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అమెరికన్ డాలర్పై ఉన్న ఆధారపడటాన్ని తగ్గించుకోవడానికి బంగారాన్ని ఒక బలమైన వ్యూహాత్మక ఆస్తిగా నిలపడమే చైనా ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. అందుకే జూన్ నెలలో చైనా భౌతిక బంగారం దిగుమతులు ఏకంగా 172 శాతం మేర పెరిగి 173 టన్నుల రికార్డు స్థాయికి చేరుకున్నాయి.
చైనా తీసుకున్న ఈ కీలక నిర్ణయం అంతర్జాతీయ మార్కెట్లతో పాటు భారతదేశంపై కూడా స్పష్టమైన ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. ఆసియా ఖండంలో చైనా నుంచి భౌతిక బంగారానికి రికార్డు స్థాయిలో డిమాండ్ పెరిగితే.. గ్లోబల్ మార్కెట్లో పసిడి సరఫరా తగ్గి ధరలకు భారీగా మద్దతు లభిస్తుంది. భారతదేశం తన పసిడి అవసరాల కోసం ఎక్కువగా అంతర్జాతీయ దిగుమతులపైనే ఆధారపడుతోంది. కాబట్టి గ్లోబల్ డిమాండ్ కారణంగా గ్లోబల్ మార్కెట్లో ధరలు పెరిగితే.. లేదా రూపాయి విలువ క్షీణిస్తే ఆ ప్రభావం నేరుగా భారతీయ వినియోగదారులపై పడుతుంది. ముఖ్యంగా దేశీయంగా పెళ్లిళ్ల సీజన్లు, ధన్తేరస్ వంటి పండుగల సమయంలో భౌతిక బంగారానికి డిమాండ్ పెరిగి, స్థానిక మార్కెట్లలో అదనపు ప్రీమియం ధరలు చెల్లించాల్సి రావచ్చు.
అయితే భారత ప్రభుత్వం లేదా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుతానికి పేపర్ గోల్డ్పై ఎలాంటి ఆంక్షలు విధించలేదు. దేశంలో గోల్డ్ ఈటీఎఫ్లు, సావరిన్ గోల్డ్ బాండ్లు, కమోడిటీ ఎక్స్ఛేంజ్లు యథావిధిగా చట్టబద్ధ నిబంధనల ప్రకారం పనిచేస్తున్నాయి. చైనాలోని పరిణామాలు కేవలం ఆ దేశపు ద్రవ్య విధానంలో భాగమే తప్ప.. భారతీయులు ఆందోళన చెందాల్సిన పనిలేదు. అయితే ప్రతి ఇన్వెస్టర్ ఈ పరిణామాల నుంచి నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే.. అప్పులు చేసి లేదా లీవరేజ్ ఉపయోగించి ఆశాజనిత వ్యాపారాలు చేయకూడదు. పెట్టుబడిదారులు తమ ఆర్థిక లక్ష్యాలు, రిస్క్ సామర్థ్యాన్ని బట్టి ఆభరణాలు, హాల్మార్క్ నాణేలు లేదా గోల్డ్ ఈటీఎఫ్లలో క్రమశిక్షణతో పెట్టుబడులు పెట్టుకోవడమే సురక్షితమైన మార్గం.


Click it and Unblock the Notifications
