వెండి వెలుగులు జిలుగులతో హోయలు పోతోంది. సామాన్యుడికి అందనంత దూరానికి వెండి ధరలు చేరుకున్నాయి. రోజు రోజుకు దాని ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. దేశీయ మార్కెట్లో కిలో వెండి దాదాపు రూ.20 వేల వరకు పెరిగి రూ.2.52 లక్షలు దాటింది. చరిత్రలో ఈ మైలురాయికి వెండి చేరుకోవడం ఇదే తొలిసారి అని చెప్పవచ్చు. ఈవారంలోనే వెండి ఏకంగా రూ.35 వేల వరకు పెరిగింది. అయితే దీనికి ప్రధాన కారణం పొరుగుదేశం చైనా తీసుకున్న నిర్ణయాలేనని చెప్పకతప్పదు.
చైనా కొత్తగా ప్రకటించిన ఎగుమతి నియంత్రణలతో.. ప్రపంచవ్యాప్తంగా Silver నిల్వలు వేగంగా క్షీణించడం మొదలు అయ్యాయి. అలాగే వరుసగా కొనసాగుతున్న నిర్మాణాత్మక లోటులు దీనికి కలిసి వెండి కొరతను మరింత తీవ్రమయ్యేలా చేశాయి. ఈ పరిస్థితుల కారణంగా వెండి ధరలు అంతర్జాతీయ మార్కెట్లలో భారీగాపెరుగుతున్నాయి.

మార్కెట్ విశ్లేషకుల ప్రకారం.. వెండి మార్కెట్ ఇప్పటికే ఐదేళ్లుగా నిర్మాణాత్మక లోటులోనే కొనసాగుతోంది. సరఫరా కంటే డిమాండ్ స్థిరంగా ఎక్కువగా ఉండటం ఈ సమస్యకు ప్రధాన కారణం అని చెబుతున్నారు. కీలక మార్కెట్లలో భౌతిక వెండికి చెల్లించే ప్రీమియంలు, అధికారిక ధరల కంటే భారీగా పెరిగిపోయాయి. అంటే కాగితం మీద ధరలు ఒకలా ఉంటే, వాస్తవంగా వెండి మెటల్ను పొందాలంటే కొనుగోలుదారులు ఎక్కువ ధర చెల్లించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.
జనవరి 1, 2026 నుంచి అమల్లోకి వచ్చేలా చైనా Silver ఎగుమతి నియంత్రణలను కొత్తగా ప్రకటించింది. ఈ నిబంధనల ప్రకారం.. వెండి ఎగుమతి లైసెన్స్ పొందాలంటే కంపెనీలు కనీసం సంవత్సరానికి 80 టన్నుల ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉండాలి. అదనంగా, దాదాపు 30 మిలియన్ డాలర్ల క్రెడిట్ లైన్ను చూపించాల్సి ఉంటుంది. ఈ కఠినమైన అర్హతలు చిన్న, మధ్య తరహా ఎగుమతిదారులను అంతర్జాతీయ మార్కెట్ల నుంచి దాదాపుగా బయటకు నెట్టేస్తాయని చెప్పవచ్చు.
ప్రపంచ వెండి సరఫరాలో సుమారు 60 నుంచి 70 శాతం వరకు చైనా ఆధిపత్యం ఉంది. అలాంటి దేశం ఎగుమతులను నియంత్రిస్తే.. అంతర్జాతీయ మార్కెట్లో వెండి లభ్యత వెంటనే తగ్గిపోతుంది. గతంలో చైనా అరుదైన భూమి లోహాలపై అమలు చేసిన పరిమితులు కూడా ఇదే తరహాలో ప్రపంచ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపాయి. ఇప్పుడు వెండిపై కూడా అదే వ్యూహాన్ని అనుసరిస్తున్నట్లు మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఈ విధాన మార్పులు ఇప్పటికే ఉన్న సరఫరా లోటును మరింత పెంచుతాయని ట్రేడర్లు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా చైనా వనరులపై ఎక్కువగా ఆధారపడే దిగుమతిదారులకు తక్షణ ప్రత్యామ్నాయాలు దాదాపుగా లేవనే చెప్పాలి. ప్రపంచ వెండి మార్కెట్ 2025లో ఐదో వరుస సంవత్సరం లోటును ఎదుర్కొంటోంది. ఈ ఏడాది వెండి డిమాండ్ సుమారు 1.24 బిలియన్ ఔన్సులకు చేరుకోగ.., సరఫరా మాత్రం 1.01 బిలియన్ ఔన్సులకే పరిమితమైంది. ఫలితంగా 100 నుంచి 250 మిలియన్ ఔన్సుల మధ్య కొరత ఏర్పడుతోంది. పారిశ్రామిక వినియోగం వేగంగా పెరుగుతున్న కొద్దీ ఈ లోటు ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి.
వెండి ఉత్పత్తి ప్రధానంగా రాగి, జింక్ గనుల ఉప ఉత్పత్తిగా జరుగుతుంది. కొత్త గనులను అభివృద్ధి చేసి ఉత్పత్తిలోకి తీసుకురావాలంటే కనీసం పదేళ్లకు పైగా సమయం పడుతుంది. ఇక ప్రస్తుత గనుల్లో ఖనిజ నాణ్యత కూడా తగ్గుతోంది. రీసైక్లింగ్ ద్వారా కొంత మేర సరఫరా పెంచేందుకు ప్రయత్నిస్తున్నా.. అది మొత్తం లోటును పూడ్చే స్థాయిలో లేదు. 2020తో పోలిస్తే COMEX వెండి ఇన్వెంటరీలు సుమారు 70 శాతం తగ్గాయి. లండన్ వాల్ట్లలో 40 శాతం తగ్గుదల నమోదైంది. షాంఘై ఇన్వెంటరీలు పదేళ్ల కనిష్ట స్థాయికి చేరాయి. కొన్ని ప్రాంతాల్లో ప్రస్తుత వినియోగ రేటుతో చూస్తే కేవలం 30 నుంచి 45 రోజుల సరిపడా వెండి నిల్వలే మిగిలి ఉన్నాయి.
ప్రపంచ వెండి వినియోగంలో సుమారు 50 నుంచి 60 శాతం వరకు పారిశ్రామిక రంగమే ఉంటుంది. సౌర విద్యుత్ ప్యానెల్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, ఎలక్ట్రానిక్స్, వైద్య పరికరాల తయారీలో వెండి కీలక పాత్ర పోషిస్తుంది. ఈ రంగాల్లో వెండికి సరైన ప్రత్యామ్నాయాలు లేకపోవడం వల్ల, సరఫరా పరిమితులు పరిశ్రమల ఖర్చులను పెంచే ప్రమాదం ఉంది. క్లుప్తంగా చెప్పాలంటే.. చైనా ఎగుమతి ఆంక్షలు, తగ్గుతున్న నిల్వలు, పెరుగుతున్న పారిశ్రామిక డిమాండ్ కలిసి ప్రపంచ వెండి మార్కెట్ను మరింత సంక్షోభ దిశగా నెడుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే, రాబోయే కాలంలో వెండి ధరలు మరింత ఎగబాకే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
More From GoodReturns

బంగారం ధరలు తగ్గాయి.. ఎంత తగ్గాయో తెలిస్తే ఎగిరి గంతేస్తారు.. మార్చి 2, సోమవారం పసిడి ధరలు ఇవే..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

Silver: వార్ ఎఫెక్ట్.. సోమవారం మార్కెట్లు తెరిచేసరికి వెండి ధర ఎక్కడ ఉంటుందో తెలుసా?

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారం ధర పెరగడంతో వినియోగదారులు కొత్త స్కెచ్.. రూ.4 లక్షల కోట్లు దాటిన పసిడి రుణాలు..

Bengaluru: కర్ణాటకలో మరో సిలికాన్ వ్యాలీ? ఆ సిటీ బెంగళూరుకి ప్రత్యామ్నాయం అవుతుందా?

బెంగళూరు-హైదరాబాద్ మధ్య ప్రయాణం గంటలే.. 110 కి.మీ.వేగంతో కొత్త రైలు వచ్చేస్తోంది.. ఎప్పుడంటే..

బెంగళూరు ట్రాఫిక్ కష్టాలు తీరినట్లే.. 11 ఇంటర్ఛేంజెస్ కనెక్టివిటితో బిజినెస్ కారిడార్ రెడీ..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications