టన్నుల కొద్దీ బంగారాన్ని రహస్య ప్రదేశానికి తరలిస్తున్న చైనా.. ప్రపంచ దేశాలను వణికిస్తున్న సీక్రెట్ రిపోర్ట్..
ప్రపంచ ఆర్థిక మార్కెట్లకు చైనా ఊహించని షాకిచ్చింది. గ్లోబల్ ఆర్థిక వ్యవస్థను వణికిస్తూ డ్రాగన్ కంట్రీ మరో సంచలన నిర్ణయానికి తెరలేపింది. ప్రపంచ దేశాలన్నీ తమ విలువైన Gold నిల్వలను సురక్షితంగా భావించి.. బ్రిటన్లోని లండన్ వాల్ట్స్లో దాచుకోవడం దశాబ్దాలుగా వస్తోంది. అయితే అంతర్జాతీయ వాణిజ్యానికి హార్ట్ లాంటి లండన్ నుండి తన బంగారాన్ని పెద్ద ఎత్తున వెనక్కి తీసుకుంటున్న చైనా సెంట్రల్ బ్యాంక్ (PBOC).. ఆ నిల్వలను నేరుగా హాంకాంగ్కు తరలిస్తోంది.
బ్లూమ్బెర్గ్ నివేదిక వెల్లడించిన ఈ సంచలన నిజాలు.. ఇప్పుడు గ్లోబల్ మార్కెట్లలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదగడమే కాకుండా.. పసిడి ట్రేడింగ్లో అమెరికా, యూరప్ల గుత్తాధిపత్యానికి గండికొట్టేలా చైనా చేస్తున్న ఈ రహస్య కదలికలు ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.

చాలా కాలంగా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వ Gold కొనుగోలుదారుగా కొనసాగుతున్న పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా.. వరుసగా ఇరవై నెలలుగా భారీగా బంగారాన్ని పోగుచేస్తూనే ఉంది. కేవలం కొనుగోళ్లతో సరిపెట్టకుండా.. ఇప్పటికే లండన్లో భద్రపరిచిన తన నిల్వల్లో సింహభాగాన్ని హాంకాంగ్కు షిఫ్ట్ చేస్తుండటం గ్లోబల్ సెంట్రల్ బ్యాంకింగ్ వర్గాలను షాకింగ్ కు గురిచేస్తోంది. ఇటీవలి కాలంలో భద్రతా, రాజకీయ కారణాల రీత్యా భారతదేశం, సెర్బియా వంటి దేశాలు తమ బంగారాన్ని విదేశాల నుండి స్వదేశానికి రప్పించుకున్నప్పటికీ.. చైనా మాత్రం తన వ్యూహాన్ని పూర్తిగా హాంకాంగ్ కేంద్రంగా మార్చుకోవడం విశేషం.
ఈ సంచలన పరిణామానికి అసలు కారణం హాంకాంగ్ను ప్రపంచ స్థాయికి చెందిన ప్రధాన బంగారు వాణిజ్య కేంద్రంగా (Global Gold Trading Hub) మార్చడమేనని చెప్పవచ్చు. గత జూలైలో హాంకాంగ్లో సరికొత్త గోల్డ్ క్లియరింగ్ సిస్టమ్ ను ప్రారంభించిన చైనా.. దానికి పూర్తి మద్దతుగా లండన్ నుండి బంగారాన్ని తరలిస్తోంది.
ప్రపంచ బంగారం ధరల నిర్ధారణలో ఇన్నాళ్లూ లండన్, న్యూయార్క్ మార్కెట్లకు మాత్రమే ఉన్న సర్వాధికారాన్ని దెబ్బతీసి.. ఆ శక్తిని ఆసియా వైపునకు మళ్లించడమే డ్రాగన్ దేశం అసలు లక్ష్యంగా తెలుస్తోంది. సింగపూర్ వంటి ఇప్పటికే సుస్థిరమైన మార్కెట్లకు ఇది ఒక పెద్ద సవాలుగా పరిణమించింది. ఆసియా ఖండంలో పసిడి ట్రేడింగ్పై తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయించేందుకు చైనా వేస్తున్న ఈ పావులు పశ్చిమ దేశాల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి.
కేవలం తన నిల్వలను తరలించడంతో చైనా ఆగిపోలేదు. హాంకాంగ్కు తన విదేశీ మారక నిల్వల కేటాయింపులను నిరంతరం పెంచుకుంటూ పోతామని పీబీఓసీ గవర్నర్ పాన్ గోంగ్షెంగ్ ఇప్పటికే స్పష్టం చేశారు. అంతేకాకుండా చైనా అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ (BRI) తో సంబంధం ఉన్న దేశాల కేంద్ర బ్యాంకులను కూడా ఈ కొత్త గోల్డ్ క్లియరింగ్ వ్యవస్థలో భాగస్వాములు కావాలని చైనా అధికారికంగా ఆహ్వానించింది. ఇందులో భాగంగానే కంబోడియా లాంటి దేశాలు ఇప్పటికే తమ బంగారు నిల్వలను చైనా వద్దే భద్రపరుచుకోవడానికి ముందుకు రావడం గమనించదగ్గ పరిణామంగా చెప్పుకోవచ్చు.
మొత్తానికి లండన్ బంగారు ఆర్థిక సామ్రాజ్యానికి చెక్ పెడుతూ.. అంతర్జాతీయ పసిడి మార్కెట్ నియంత్రణను తన చేతుల్లోకి తీసుకోవడానికి చైనా ఆడుతున్న ఈ భౌగోళిక ఆర్థిక క్రీడ ప్రపంచ ఆర్థిక రంగంలో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. రాబోయే రోజుల్లో ఈ పరిణామాలు గ్లోబల్ కరెన్సీలు, బంగారం ధరలు, ప్రపంచ శక్తి సమీకరణాలపై ఎలాంటి తీవ్ర ప్రభావం చూపుతాయోనని ఆర్థిక నిపుణులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు.


Click it and Unblock the Notifications
