చైనా రహస్య ‘మ్యాన్హట్టన్ ప్రాజెక్ట్’: చిప్స్ యుద్ధంలో అగ్రరాజ్యాలకు చమటలు పట్టిస్తున్న డ్రాగన్!
ప్రస్తుతం ప్రపంచాన్ని శాసిస్తున్నది సాఫ్ట్వేర్ టెక్నాలజీలు కాదు, ఆ సాఫ్ట్వేర్ నడవడానికి అవసరమైన 'సెమీ కండక్టర్ చిప్స్' (Semiconductors). ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో ఆధిపత్యం చెలాయించాలంటే అత్యాధునిక చిప్స్ కు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా భారీ డిమాండ్ ఉంది. ఇప్పటిదాకా ఈ చిప్స్ తయారీకి అవసరమైన అత్యంత క్లిష్టమైన EUV (Extreme Ultraviolet) లిథోగ్రఫీ మెషీన్లను కేవలం నెదర్లాండ్స్కు చెందిన ASML సంస్థ మాత్రమే తయారు చేస్తోంది. అమెరికా ఆంక్షల వల్ల చైనాకు ఈ మెషీన్లు అందడం లేదు. అయితే చైనా (China) దీనిని ఒక సవాల్గా తీసుకుని, తన సొంత 'మ్యాన్హట్టన్ ప్రాజెక్ట్' ను ప్రారంభించింది. ఇప్పుడీ ప్రాజెక్ట్ సంచలన విజయం సాధించినట్లు తెలుస్తోంది.
ఏమిటీ రహస్య ప్రాజెక్ట్?
రెండో ప్రపంచ యుద్ధ కాలంలో అమెరికా అణుబాంబును తయారు చేయడానికి ఎంత రహస్యంగా 'మ్యాన్హట్టన్ ప్రాజెక్ట్' ను నడిపిందో.. చైనా కూడా ఇప్పుడు చిప్స్ తయారీ కోసం షెన్జెన్ (Shenzhen) లోని ఒక హై-సెక్యూరిటీ ల్యాబ్లో అదే స్థాయి ప్రాజెక్టును చేపట్టింది. సుమారు 3,000 మందికి పైగా పరిశోధకులు, వేలాది మంది ఇంజనీర్లు రేయింబవళ్లు శ్రమిస్తూ, ఎట్టకేలకు ఒక EUV ప్రోటోటైప్ మెషీన్ ను తయారు చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి.

హువాయి (Huawei) కీలక పాత్ర!
ఈ ప్రాజెక్టు లో చైనా టెక్ దిగ్గజం Huawei (హువాయి) వెన్నెముకగా నిలిచింది. పలు ప్రభుత్వ పరిశోధనా సంస్థలు, ప్రైవేట్ కంపెనీలను ఏకం చేసి, చిప్ తయారీలో ఉన్న అతిపెద్ద అడ్డంకిని చైనా అధిగమించింది. 2025 ప్రారంభంలోనే ఈ ప్రోటోటైప్ మెషీన్ సిద్ధమైందని, ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉందని సమాచారం. 2028 లేదా 2030 నాటికి ఈ మెషీన్ల ద్వారా పూర్తిస్థాయిలో చిప్స్ ఉత్పత్తి చేయాలని చైనా (China) లక్ష్యంగా పెట్టుకుంది.
ASML మాజీ ఇంజనీర్ల సహకారం కూడా..
విశేషం ఏమిటంటే ఈ ప్రాజెక్టులో ASML సంస్థలో పనిచేసిన మాజీ ఇంజనీర్లు కూడా కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. లిన్ నాన్ అనే ప్రొఫెసర్ నేతృత్వంలోని బృందం, కాంతి వనరులను (EUV Light sources) సృష్టించడంలో అద్భుతమైన ఫలితాలను సాధించింది. వీరి టెక్నాలజీ ASML వాడుతున్న పద్ధతి కంటే భిన్నంగా, చైనాలో అందుబాటులో ఉన్న 'సాలిడ్-స్టేట్ లేజర్' (Solid-state lasers) ఆధారంగా పనిచేస్తుంది. దీనివల్ల పేటెంట్ సమస్యలు కూడా తలెత్తకుండా చైనా జాగ్రత్త పడుతోంది.
పశ్చిమ దేశాల్లో ఆందోళన!
ఇప్పటిదాకా చిప్ మేకింగ్ అనేది అమెరికా, యూరప్ దేశాల గుత్తాధిపత్యంగా ఉండేది. కానీ, చైనా సొంతంగా ఈ టెక్నాలజీని డెవలప్ చేయడం వల్ల గ్లోబల్ సప్లై చైన్ లో మార్పులు రానున్నాయి. అమెరికా విధిస్తున్న ఎగుమతి ఆంక్షలు చైనాను ఆపలేకపోగా మరింత వేగంగా ఆవిష్కరణలు చేసేలా పురికొల్పాయని టెక్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఒకప్పుడు కేవలం కాపీ క్యాట్ ఉత్పత్తులకే పరిమితమైన చైనా.. ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత సంక్లిష్టమైన యంత్రాన్ని తయారు చేయడం ద్వారా టెక్ వార్ను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఇది ప్రపంచ AI మార్కెట్ ను ఎలా ప్రభావితం చేస్తుందో వేచి చూడాలి!


Click it and Unblock the Notifications


