Jack Ma: చైనీస్ బిలియనీర్, అలీబాబా గ్రూప్ సహ వ్యవస్థాపకుడు జాక్ మా పాకిస్థాన్కు అనూహ్య పర్యటన చేశారు. మీడియా, చైనా ప్రభుత్వ అధికారులకు దూరంగా ఉంటున్న కుభేరుడి పర్యటనపై విశ్లేషకులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
చైనా బిలియనీర్ జూన్ 29న లాహోర్లో దిగి 23 గంటలపాటు అక్కడే
ఉండటం ఊహాగానాలకు దారితీస్తోంది. జాక్ మా పర్యటన గోప్యంగా ఉందని బోర్డ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్(BOI) మాజీ ఛైర్మన్ మీడియాకు తెలిపారు. అప్పుల ఊబిలో కూరుకుపోయి కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్కి.. జాక్ మా పర్యటన త్వరలోనే "సానుకూల ఫలితాలను" ఇస్తుందని ఆశిస్తున్నట్లు వెల్లడించారు.

ఈ పర్యటనలో జాక్ మాతో పాటు ఐదుగురు చైనా జాతీయులు, ఒక డానిష్, ఒక అమెరికా పౌరుడితో కూడిన ఏడుగురు వ్యాపారవేత్తల ప్రతినిధి బృందం కూడా ఉంది. అయితే దయనీయ ఆర్థిక పరిస్థితుల్లో ఉన్న పాకిస్థాన్లో జాక్ మా, అతని బృందం వ్యాపార అవకాశాలను అన్వేషించడం గురించి ఊహాగానాలు కొనసాగుతున్నాయి. పర్యటన ఉద్ధేశ్యం ఏమిటనేదానిపై ఇప్పటి వరకు సంబంధిత వర్గాల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

ప్రత్యేక విమానంలో బయలుదేరి వెళ్లిన జాక్ మా బృందం పాక్ లోని వాణిజ్య కేంద్రాలను సందర్శించింది. ఇదే క్రమంలో ప్రముఖ వ్యాపారవేత్తలు, వివిధ వాణిజ్య ఛాంబర్ల అధికారులతో సమావేశమయ్యారు. అయితే ఎలాంటి ఒప్పందాలు జరిగాయనే విషయాలు బయటకు రాలేదు. అయితే ఇది పూర్తిగా బిలియనీర్ ప్రైవేటు పర్యటన అని దీని గురించి చైనా రాయబార కార్యాలయానికి సమాచారం లేదని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications