Nirmala Sitharaman: రూపాయి పతనంపై నిర్మలమ్మ వివరణ.. చిదంబరం చివాట్లు..!
గత కొన్ని నెలలుగా డాలర్ తో పోల్చితే రూపాయి విలువ క్షీణించటం చాలా ఆందోళనకు గురిచేస్తోంది. ఈ క్రమంలో భారత కరెన్సీ విలువ 8 శాతం పడిపోవటంపై.. వ్యాపార వర్గాలు, సామాన్యులు, నిపుణులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దీనిపై చేసిన వ్యాఖ్యలు కొంత కాంట్రవర్షియల్ గా మారాయి.
నిర్మలమ్మ ఏమన్నారంటే..
IMF, వరల్డ్ బ్యాంక్ సమావేశానికి హాజరైన నిర్మలా సీతారామన్ విలేకరులతో మాట్లాడుతూ భారత ఆర్థిక వ్యవస్థ పటిష్ఠంగా ఉందని అన్నారు. ప్రపంచంలోని ఇతర దేశాలతో పోల్చితే ద్రవ్యోల్బణం తక్కువగానే ఉందని చెప్పారు. ఈ క్రమంలో రూపాయి బలహీనపడటంపై అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. రూపాయి విలువ పడిపోలేదని.. డాలర్ బలపడిందని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో సోమవారం రూపాయి ధర కనిష్ఠమైన 82.68 స్థాయిని తాకింది.
రిజర్వు బ్యాంక్ చర్యలు..
అనేక నెలలుగా భారత్ వద్ద విదేశీ మారక నిల్వలు దారుణంగా పడిపోయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ముగిసిన వారంలో తొలిసారిగా ఈ నిల్వలు పెరిగినట్లు రిజర్వు బ్యాంక్ నివేధించింది. పైగా రూపాయి పతనాన్ని అడ్డుకునేందుకు గత సంవత్సరంలో దాదాపు 100 బిలియన్ డాలర్లు ఖర్చు చేసి ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు.
|
ఆర్థిక మంత్రం..
భారత ఆర్థిక వ్యవస్థ ప్రాథమిక అంశాలు, స్థూల ఆర్థిక మూలాధారాలు మంచివని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. భారత్ వద్ద విదేశీ మారక నిల్వలు బాగానే ఉన్నాయని, ద్రవ్యోల్బణం సైతం నిర్వహించదగిన స్థాయిలోనే ఉందని స్పష్టం చేశారు. మెుత్తాన్ని పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని చెప్పుకొచ్చారు.
చిదంబరం చివాట్లు..
ఎప్పటిలాగే కాంగ్రెస్ సీనియన్ నేత, మాజీ కేంద్ర మంత్రి చిదంబరం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు చురకలు అంటించారు. రూపాయి విలువ కోల్పోవటంపై నిర్మలమ్మ వివరణపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అవును నిజమే.. ఎన్నికల్లో ఓడిపోయిన వ్యక్తి తాము ఓటమిపాలు కాలేదని, అవతలివారు గెలిచారంటూ చెప్పినట్లుగా ఆర్థిక మంత్రి వివరణ ఉందని అన్నారు. నిర్మలా సీతారామన్ ఆలోచించకుండా వ్యాఖ్యానించారని చిదంబరం ఎన్డీటీవీతో అన్నారు. అయితే ఈ కామెంట్లపై అనేక మంది ట్విట్టర్ లో భిన్నంగా స్పందిస్తున్నారు.