ఈ ఏడు బ్యాంకుల చెక్కు బుక్కులు ఏప్రిల్ 1 నుండి పని చేయవు
బ్యాంకుల విలీనం నేపథ్యంలో ఏప్రిల్ 1వ తేదీ నుండి పలు బ్యాంకుల చెక్కులు చెల్లవు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో వివిధ బ్యాంకుల ట్రాన్సాక్షన్స్ తీరు మారిపోతోంది. బ్యాంకుల విలీనం వల్ల కస్టమర్లు IFSC కోడ్స్ మారటం, చెక్కు బుక్కులు చెల్లకపోవడం వంటి వివిధ సమస్యలు ఎదుర్కొంటున్నారు. అలాగే, అంతకుముందు నష్టాల్లో ఉన్న కొన్ని బ్యాంకులను ఇతర ప్రభుత్వరంగ బ్యాంకుల్లో విలీనం చేసింది కేంద్ర ప్రభుత్వం.
2019 ఏప్రిల్ 1వ తేదీన ప్రారంభమైనప్పటికీ, విలీన ప్రక్రియ 2020 ఏప్రిల్ 1న ముగిసింది. ఈ ఏడాది మార్చి నెల చివరి వరకు ఈ బ్యాంకుల చెక్కులు చెల్లుబాటు అయ్యాయి. అయితే వచ్చే నెల అంటే కొత్త ఆర్థిక సంవత్సరం నుండి ఇవి చెల్లుబాటు కావు.
అలా విలీనమైన బ్యాంకుల్లో దేనా బ్యాంకు, విజయా బ్యాంకు, కార్పోరేషన్ బ్యాంకు, ఆంధ్రా బ్యాంకు, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంకు, అలహాబాద్ బ్యాంకులు ఉన్నాయి. ఈ బ్యాంకులకు సంబంధించిన చెక్కులు, ఐఎఫ్ఎస్సీ కోడ్స్, ఎంఐసీఆర్ కోట్స్, శాఖలు తదితర వివరాలు మారుతున్నాయి. కొన్ని బ్యాంకుల విలీన ప్రక్రియ పూర్తి కాగా, ఈ బ్యాంకుల కస్టమర్లు ఏప్రిల్ 1వ తేదీ నుండి తమ శాఖలను సంప్రదించి మారిన చెక్కు బుక్స్, ఫామ్స్ తీసుకోవాలి.
బ్యాంకుల మార్పులకు సంబంధించి ఇప్పటికే కస్టమర్లకు ఆయా బ్యాంకులు ఎస్సెమ్మెస్, మెయిల్ రూపంలో పంపిస్తున్నాయి. కస్టమర్లు ఏప్రిల్ 1వ తేదీ నుండి కొత్త పాస్ బుక్కు, కొత్త చెక్ బుక్కును తీసుకోవాలి. అలాగే అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సీ కోడ్, ఎంఐసీఆర్ కోడ్, బ్రాంచీ అడ్రస్ వంటి వివరాలు తెలుసుకోవాలి. ఈ అకౌంట్ నెంబర్ తీసుకున్న అనంతరం మొబైల్ నెంబర్, అడ్రస్, నామినీ వంటి వివరాలు అప్ డేట్ చేయాలి.