జూలై 18వ తేదీ నుండి కొత్త జీఎస్టీ పన్నులు: నిర్మలా సీతారామన్
లో-కాస్ట్ హోటల్ అకామిడేషన్, ఖరీదైన హాస్పిటల్ రూమ్ రెంట్, సోలార్ వాటర్ హీటర్స్, కోల్ బెడ్ మీథేన్, చెక్కులు, ఎంపిక చేసిన ఫామ్ ఎక్విప్మెంట్స్ పైన జూలై 1వ తేదీ నుండి జీఎస్టీ ఖరీదు కానుందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే నిన్న జీఎస్టీ మండలి సమావేశం అనంతరం ఈ పెంపు తేదీని ప్రకటించారు. జూలై 18వ తేదీ నుండి కొత్త పన్నులు అమలులోకి వస్తాయని తెలిపారు. ఈ మేరకు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. జీఎస్టీ మండలి పలు పన్ను మార్పు నిర్ణయాలను ప్రకటించింది. కొన్ని ఉత్పత్తులపై ప్రస్తుతం వర్తిస్తున్న మినహాయింపులను ఎత్తివేయగా, మరికొన్నింటిపై మరింత పన్ను పడింది.
ఆర్బీఐ, ఐఆర్డీఏ, సెబి అందించే సేవలను పన్ను పరిధిలోకి తీసుకు వచ్చింది. కార్పోరేట్ కంపెనీలకు గృహ నివాసాల అద్దె పైన జీఎస్టీ చెల్లించాలి. ప్రీ-ప్యాక్డ్ అండ్ లేబుల్డ్ ఉత్పత్తులు, చేపలు, పన్నీరు, లస్సీ, తేనె, ఎండబెట్టిన చిక్కుళ్లు, గోధుమ, ఇతర ధాన్యాలు, పేలాలు, ఐసీయూ మినహాయించి రూ.5 వేలకు పైగా రోజువారి హాస్పిటల్ రూమ్ రెంట్ తదితరాలపై జీఎస్టీ భారం కానుంది. వీటిపై 5 శాతం జీఎస్టీ ఉండనుంది.
మ్యాప్స్, అట్లాస్ సహా చార్టులు, రోజుకు రూ.1000 లోపు హోటల్ రూమ్ అద్దె, సోలార్ వాటర్ హీటర్, ట్రక్కులు, వస్తు రవాణా వాహనాలపై ఇంధన ఛార్జీతో కూడిన అద్దె 12 శాతం, టెట్రా ప్యాక్స్, చెక్కు బుక్కు జారీకి వసూలు చేసే ఛార్జీ, ప్రింటింగ్, డ్రాయింక్ ఇంక్, కటింగ్ బ్లేడ్స్తో కూడిన కత్తులు, పేపర్ కత్తులు, పెన్సిల్, షార్పనర్లు, ఎల్ఈడీ బల్బులు, డ్రాయింగ్ అండ్ మార్కింగ్ సాధనాలు, రోడ్లు, బ్రిడ్జిలు, రైల్వే, మెట్రో కాంట్రాక్టులపై 18 శాతం జీఎస్టీ విధించనున్నారు. ఇక క్యాసినోలు, ఆన్ లైన్ గేమింగ్, గుర్రపు పందేలు, లాటరీలపై పన్ను నిర్ణయాన్ని జీఎస్టీ కౌన్సిల్ తాజా భేటీలో వాయిదా వేసింది. వీటిపై గరిష్టంగా 28 శాతం జీఎస్టీని విధించాలని భావిస్తున్నారు.