IT News: పదేళ్లుగా ఐటీ కంపెనీలు అదే మోసం..! టాప్ టెక్ సంస్థల్లోనూ రాని మార్పు.. ఎందుకిలా..?
IT News: ఐటీ రంగాన్ని తీవ్రంగా వేదిస్తున్న సమస్యల్లో ముఖ్యమైనది ఉద్యోగుల జీతాలు. జీతాలు పెంచటం లేదా అంటే.. పెంచుతున్నారు. కానీ.. అందులో చూపుతున్న భారీ వివక్ష గురించే ప్రధానంగా చర్చ జరుగుతోంది. దిగ్గజ ఐటీ కంపెనీలు సైతం గడచిన 10 ఏళ్లుగా ఈ విషయంలో తీరు మార్చుకోలేదని తెలుస్తోంది.
జీతాల పెంపు..
ఐటీ రంగం వృద్ధికి అనుగుణంగా సదరు కంపెనీలు తమ సీఈవోలకు జీతాలను భారీగానే పెంచుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న డేటా ప్రకారం ఈ రంగంలోకి వస్తున్న సీఈవోలు, ఫ్రెషర్ల సగటు జీతాల ప్యాకేజీల మధ్య భారీగా వ్యత్యాసం ఉంది. గడచిన 10 ఏళ్ల డేటా విశ్లేషణ ఇదే వెల్లడిస్తోంది. కాల క్రమేణా ఫ్రెషర్ల జీతాలు 46 శాతానికి పైగా పెరగగా.. సీఈవోల జీతాలు మాత్రం ఏకంగా 1,500 శాతం జంప్ అయ్యింది. ఈ విశ్లేషణ పబ్లిక్గా అందుబాటులో ఉన్న సమాచారం నుంచి సేకరించబడింది.
మధ్యస్థ జీతం..
అంతేకాక సీఈవోలకు మధ్యస్థ జీతం పెంపు 1,449.02 శాతంగా ఉండగా.. ఫ్రెషర్లకు మధ్యస్థ జీతం 40 శాతం మాత్రమే ఉందని ఇందులో తేలింది. కంపెనీల్లో హైరార్కీ ప్రకారం సీఈవోల నుంచి పిరమిడ్ దిగువన ఉన్న వారి మధ్య జీతాల విషయంలో వ్యత్యాసం ఎక్కువగానే ఉంది.
ఇన్ఫోసిస్ మాజీ CFO..
ఈ జీతాల విషయంపై ఇన్ఫోసిస్లో మాజీ CFO, బోర్డు సభ్యుడు TV మోహన్దాస్ పాయ్ ప్రముఖ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఫ్రెషర్లకు చెల్లిస్తున్న పరిహారంలో పెరుగుదల లేదని ఆయన అభిప్రాయపడ్డారు. 10-12 ఏళ్ల కిందట కంపెనీలు చెల్లిస్తున్న రూ.3.5-4 లక్షల ప్యాకేజీలనే ఇప్పుడూ ఇస్తున్నాయని అన్నారు. ఈ సమయంలో మేనేజర్లు, సీనియర్లకు చెల్లించే జీతాలు మాత్రం 4, 5, 7 రెట్లు పెరిగాయని పేర్కొన్నారు.
HCL Tech మాజీ సీఈవో..
హెచ్సీఎల్ టెక్ మాజీ సీఈవో వినీత్ నాయర్ కూడా ఫ్రెషర్ల జీతాల విషయంలో ఇలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేశారు. ఇది దురదృష్టకరమైనదని, సంస్థ వృద్ధిలో ఉద్యోగుల పాత్రను అర్థం చేసుకోవటం అని అన్నారు. కంపెనీలు తమ మార్కెటింగ్ బడ్జెట్లో కొంత భాగాన్ని ఉద్యోగులను ఉత్సాహపరచడం, ప్రోత్సహించడంపై ఖర్చు చేస్తే లాభదాయకత 10 రెట్లు పెరుగుతుందని అన్నారు. కంపెనీలు మ్యానేజ్ మెంట్ ప్రాథమిక అంశాలను అర్థం చేసుకోవటం లేదని అన్నారు.
జీతాల్లో వ్యత్యాసం..
కంపెనీ సీఈవోలు, ఫ్రెషర్ల మధ్య ఉన్న జీతాల వ్యత్యాసం ఇన్ఫోసిస్ విషయంలో 1,973, విప్రో 2,111, HCL టెక్నాలజీస్ 1,020, టెక్ మహీంద్రాలో 644, TCS వద్ద 619 గా ఉందని వెల్లడైంది. ప్రస్తుత గ్రాడ్యుయేట్లు, ఫ్రెషర్లకు పరిశ్రమ వెతుకుతున్న సరైన నైపుణ్యాలు లేకపోవడమే ఈ అసమానతలకు కారణమని నాస్కామ్ మాజీ ప్రెసిడెంట్ కిరణ్ కార్నిక్ పేర్కొన్నారు. తరచుగా వారికి డొమైన్ నైపుణ్యాలు ఉండవు, వారు అందులో శిక్షణ పొందవలసి ఉంటుందని అన్నారు. మెుత్తానికి దశాబ్ధ కాలం గడుస్తున్నా.. ఈ అంతరాతం తగ్గలేదని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.