Land reforms: కేంద్రం కొత్త ప్రాజెక్ట్.. భూ తగాదాలకు చెక్.. రాష్ట్రాలకు దండిగా నిధులు
Bhu Aadhar: ప్రభుత్వం మరియు ప్రభుత్వేతర పథకాలు సులువుగా పొందేందుకు ఆధార్ కార్డ్ను ప్రజలు విరివిగా వినియోగిస్తున్నారు. దేశంలోని ప్రతి వ్యక్తికీ ఓ ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఉండాలనే ఉద్దేశంతో దీన్ని కేంద్రం ప్రవేశపెట్టింది. ఎక్కడ చూసినా భూవివాదాలు పెరుగుతున్న నేపథ్యంలో ఇదే తరహా విధానాన్ని భూములకు కూడా వర్తింపచేయాలని భావిస్తున్నారు.
పార్లమెంట్ వేదికగా కేంద్రమంత్రి నిర్మలా సీతారామనా్ బడ్జెట్లో కీలక ప్రకటన చేశారు. ఇందులో గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలు రెండింటిలో భూ సంస్కరణలకు కేంద్రం ప్లాన్ చేసింది. గ్రామాల్లో భూములకు భూ-ఆధార్ అనే కొత్త ID నంబర్ కేటాయింపును ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోంది. వచ్చే మూడేళ్లలో దీన్ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్థిక సహాయం కూడా చేయనుంది.

అంటే సాధారణ పౌరులకు ప్రత్యేకమైన ఆధార్ కార్డు ఉన్నట్లే, త్వరలో భూమికి కూడా సొంత ఆధార్ కార్డు ఉండనుంది. ఆధార్ ద్వారా ప్రభుత్వం అందించే ప్రయోజనాలు ప్రస్తుతం నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయబడుతున్నాయి. ఇదే విధంగా భూ ఆధార్ విషయంలోనూ రైతులకు లేదా భూ యజమానులకు లభించే బెనిఫిట్స్ ఇక నేరుగా వారికే అందే విధంగా కేంద్రం ఈ ఫ్రేమ్వర్క్ను రూపొందిస్తోంది.
ఈ కొత్త ID భూ యాజమాన్య వివాదాలను పరిష్కరించడంలో మరియు భూమి హక్కులను స్పష్టం చేయడంలో సహాయపడనుంది. గ్రామాల్లోని ప్రతి భూమికి యాజమాన్యం, కొలతలు మరియు రైతు వంటి వివరాలు నమోదు చేసుకుని 14-అంకెలతో కూడిన నంబర్ ఇవ్వబడుతుంది. దీనిద్వారా రానున్న రోజుల్లో రైతులకు రుణాలు మరియు ప్రభుత్వం అందించే ప్రయోజనాలు పొందడం సులభతరం అవుతుంది. ఇక భూమిలేని పట్టణవాసుల కోసం GIS మ్యాపింగ్ ఉపయోగించి భూ రికార్డులను డిజిటల్గా మార్చడం దీని లక్ష్యంగా ప్రభుత్వం చెబుతోంది.


Click it and Unblock the Notifications