tax: దేశ తలరాతను మార్చి రాయగల సత్తా ఉన్న అధికారులు IAS, IPS, IFSలు. వారి కోసం కేంద్ర ప్రభుత్వం తాజాగా ఓ ఉత్తర్వును విడుదల చేసింది. సిబ్బంది మంత్రిత్వశాఖ ఆదేశాల ప్రకారం.. ఒక క్యాలెండర్ సంవత్సరంలో స్టాక్స్, షేర్స్ లేదా ఇతర మార్గాల్లో వారు పెట్టిన ఇన్వెస్ట్ మెంట్ వివరాలను సర్కారుకు సమర్పించాల్సి ఉంటుంది. ఈ పెట్టుబడుల మొత్తం 6 నెలల ప్రాథమిక వేతనాన్ని మించితేనే ఇది వర్తిస్తుందని చెప్పింది.
AISలోని రూల్ 16 (4) లేదా ఆల్ ఇండియా సర్వీసెస్ (కండక్ట్) రూల్స్, 1968 కింద ఆయా అధికారులు ప్రస్తుతం పంచుకుంటున్న సమాచారానికి ఇది అదనమని ప్రభుత్వం తెలిపింది. దీని ద్వారా మరింత సమర్థవంతంగా సిబ్బంది పెట్టుబడులు, లావాదేవీలను నిర్వహించవచ్చని భావిస్తోంది.
అయితే ఈ కేటగిరీలో ఉన్న వారు ప్రతి సంవత్సరం నిర్దేశిత ప్రొఫార్మాలో వివరాలు పంపించాల్సి ఉంటుంది.

రూల్ 14(1)లోని ప్రవర్తనా నియమావళి ప్రకారం.. ఆల్ ఇండియా సర్వీసెస్ లోని సిబ్బంది ఎవరూ స్టాక్, షేర్ లేదా ఇతర సాధనాల్లో పెట్టుబడులు పెట్టకూడదు. స్టాక్-బ్రోకర్లు లేదా సక్రమంగా లైసెన్స్ పొందిన వ్యక్తుల ద్వారా అప్పుడప్పుడు చేసే ఇన్వెస్ట్ మెంట్ కు ఈ నిబంధన వర్తించదు. కానీ తరచుగా చేస్తే మాత్రం తప్పనిసరిగా ప్రభుత్వానికి నివేదించాల్సిందే.
షేర్లు, సెక్యూరిటీలు, డిబెంచర్లు మూవబుల్ ఆస్తులుగా పరిణగణించబడతాయి. కాబట్టి 2 నెలల బేసిక్ జీతానికి మించి వీటిలో పెట్టుబడి పెడితే నిర్దేశిత అధికారికి సమాచారం అందించడం అవసరం. ఈ ప్రక్రియ గురించి రూల్ 16(4) పూర్తిగా వివరిస్తోంది. ఈ మేరకు మార్చి 20 నాటి తన ఆదేశాల్లో మంత్రిత్వశాఖ పేర్కొంది.


Click it and Unblock the Notifications