బ్యాంకింగ్ తరహా ఫార్ములా: రైల్వేలో భారీ సంస్కరణలు: స్కూళ్లు కూడా
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం మరో కీలకమైన సెక్టార్లో భారీ సంస్కరణల పర్వానికి తెర తీసింది. ఇప్పటికే బ్యాంకింగ్ సెక్టార్లో నష్టాలను చవి చూస్తోన్న కొన్ని బ్యాంకులను విలీనం చేసింది. ఆంధ్రా బ్యాంక్ను యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో, సిండికేట్ బ్యాంక్ను కెనరా బ్యాంక్లో విలీనం చేసింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ను భారతీయ స్టేట్ బ్యాంక్లో మెర్జ్ చేసింది. అదే తరహా ఫార్ములాను మరో సెక్టార్కు విస్తరింపజేయడానికి కసరత్తు ప్రారంభించింది.
దీనికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని అందజేయాల్సిందిగా అధికారులను ఆదేశించింది. ఆ సెక్టార్- రైల్వేస్. రైల్వేల్లో బ్యాంకింగ్ తరహా విలీనాల ప్రక్రియను ప్రారంభించనుంది కేంద్ర ప్రభుత్వం. రైల్వే మంత్రిత్వ శాఖ ఆధీనంలో వేర్వేరుగా కార్యకలాపాలను కొనసాగిస్తోన్న కొన్ని లిమిటెడ్ కంపెనీలను సంబంధిత కార్పొరేషన్లలో విలీనం చేయాలని ప్రతిపాదించింది. ఇటీవలే దేశ రాజధానిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన ఏర్పాటైన మంత్రివర్గ సమావేశంలో దీనికి సంబంధించిన అంశాలను చర్చించింది.
విలీన ప్రక్రియను చేపట్టడానికి అవసరమైన సమగ్ర సమాచారాన్ని అందజేయాల్సిందిగా మంత్రివర్గ కార్యదర్శి- రైల్వే మంత్రిత్వ శాఖకు సూచించారు. రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (ఆర్వీఎన్ఎల్)ను ఇండియన్ రైల్వేస్ కన్స్ట్రక్షన్స్ లిమిటెడ్ (ఐర్కాన్)లోకి విలీనం చేయాలని కేంద్ర కేబినెట్ భావిస్తోంది. అలాగే- రైల్ టెల్ కార్పొరేషన్ను ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ)లోకి మెర్జ్ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
బ్రేత్వైట్ అండ్ కంపెనీ లిమిటెడ్ను రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనమిక్ సర్వీసెస్ టేకోవర్ చేసేలా ప్రతిపాదనలను రూపొందించాలని, వెంటనే దాన్ని కేబినెట్కు పంపించాలని కార్యదర్శి సూచించారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ ముఖ్య సలహాదారు సంజీవ్ సన్యాల్ చేసిన సూచనల మేరకు రైల్వేల్లో ఈ విలీనాలు, టేకోవర్ ప్రక్రియ మొదలు కానున్నట్లు చెబుతున్నారు. రైల్వే మంత్రిత్వ శాఖ ఆధీనంలో నడుస్తోన్న 94 పాఠశాలలను కూడా విలీనం చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించినట్లు సమాచారం.
ఈ 94 రైల్వే స్కూళ్లను కేంద్రీయ విద్యాలయ సంఘటన్లో మెర్జ్ చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. 125 రైల్వే ఆసుపత్రులను కూడా ఆధునికీకరించాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు. పబ్లిక్-ప్రైవేట్ పార్ట్నర్షిప్ ప్రాతిపదికన ఈ రైల్వే ఆసుపత్రులను అభివృద్ధి చేయడానికి కేంద్రం కసరత్తు చేపట్టినట్లు సమాచారం. ఈ తరహా సంస్కరణలను చేపట్టడం వల్ల రైల్వేపై అదనపు భారాన్ని తొలగించినట్టవుతుందని అంటున్నారు.
దీనికి సంబంధించిన ఓ సమగ్ర నోట్ను కేబినెట్ కార్యదర్శి.. రైల్వే మంత్రిత్వ శాఖ, రైల్వే బోర్డు ఛైర్మన్ అండ్ ముఖ్య కార్యనిర్వహణాధికారి సునీత్ శర్మకు పంపించినట్లు తెలుస్తోంది. ఈ సంస్కరణలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలియజేయాలని, ప్రతి నెలా మొదటి వారంలోనే ఓ సమగ్ర నివేదికను పంపించాల్సి ఉంటుందని కేంద్ర కేబినెట్ కార్యదర్శి సూచించినట్లు చెబుతున్నారు. ఈ సంస్కరణలకు సంబంధించిన ఓ పూర్తి నివేదికను తాము ఇదివరకే కేంద్రానికి పంపించినట్లు రైల్వే అధికారి ఒకరు స్పష్టం చేశారు కూడా.
దీనితోపాటు చెన్నై, కపుర్తలా, రాయ్బరేలీల్లో ఉన్న మూడు కోచ్ ఫ్యాక్టరీలు, చిత్తరంజన్, వారణాసి, పటియాల్లో ఉన్న లోకోమోటివ్ యూనిట్లు, బెంగళూరు శివార్లలోని యలహంక, బిహార్లోని బేలాల్లో ఉన్న రైల్ వీల్ యూనిట్లను పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా ఓ కార్పొరేషన్ను ఏర్పాటు చేయాలనే ఆలోచన కూడా కేంద్ర ప్రభుత్వానికి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ తరహా సంస్కరణలు ఎలాంటి ఫలితాలను ఇస్తాయనేది ఆసక్తికరంగా మారింది.