లక్ష్మీ విలాస్ బ్యాంకుపై తాత్కాలిక మారటోరియం, విత్డ్రా పరిమితి రూ.25,000
ముంబై: లక్ష్మీ విలాస్ బ్యాంకుపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) కీలక ప్రకటన చేసింది. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఈ ప్రయివేటు రంగ బ్యాంకు కస్టమర్లకు అలర్ట్. ఈ బ్యాంకుపై ఒక నెల తాత్కాలిక మారటోరియం విధించింది. లక్ష్మి విలాస్ బ్యాంకులో అన్ని రకాల సేవింగ్స్, కరెంట్, డీమాంట్ ఖాతాల నుంచి నగదు ఉపసంహరణపై కేంద్ర ఆర్థిక శాఖ ఆంక్షలు విధించింది.
బ్యాంకుపై మారటోరియం ప్రకటించిన కేంద్ర ఆర్థిక శాఖ.. ఆయా ఖాతాదారులు కేవలం రూ.25వేలు మాత్రమే విత్డ్రా చేసుకోవడానికి వెసులుబాటు కల్పించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రాతపూర్వక అనుమతి లేకుండా ఈ బ్యాంకు నుండి కస్టమర్లు కూడా పాతికవేల రూపాయలకు మించి తీసుకోలేరు. ఇది డిసెంబర్ 16వ తేదీ వరకు అమలులో ఉంటుంది. సమీక్ష అనంతరం తదుపరి నిర్ణయం తీసుకోనుంది.
వైద్య చికిత్స, ఉన్నత విద్య కోసం చెల్లింపులు, వివాహ ఖర్చు వంటి వాటి కోసం రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా అనుమతితో రూ.25వేలకు పైగా ఉపసంహరించుకునే వెసులుబాటు ఉంది. బ్యాంకు ఫైనాన్షియల్ పరిస్థితుల నేపథ్యంలో ఆర్బీఐ సూచనల మేరకు కేంద్ర ఆర్థిక శాఖ ఈ నిర్ణయం తీసుకున్నది. లక్ష్మీ విలాస్ బ్యాంకు స్టాక్ నేడు 0.36 శాతం క్షీణించి రూ.15.60 వద్ద క్లోజ్ అయింది.