ఆర్ధిక నేరగాళ్ళపై నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలు :వారిని వదిలేదే లేదు, రికవరీ చేసి తీరుతాం !!
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ దేశాన్ని మోసం చేసి విదేశాల్లో తలదాచుకుంటున్న ఆర్థిక నేరగాళ్ల విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. బ్యాంకులను మోసం చేసిన ఆర్థిక నేరగాళ్ల నుండి డబ్బును తిరిగి తీసుకురావడానికి ప్రభుత్వం చురుకుగా కేసులను కొనసాగిస్తుందని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ స్పష్టం చేశారు.డెట్స్ రికవరీ ట్రిబ్యునల్ (డిఆర్టి) యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ (యుబిఎల్) యొక్క 5,800 కోట్ల రూపాయల విలువైన షేర్లను విక్రయించినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) చెప్పిన వెంటనే ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
పారిపోయిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాపై , డైమండ్స్ వ్యాపారి నీరవ్ మోదీ , ఆయన బంధువు మెహుల్ చోక్సీ లపై బ్యాంక్ మోసం కేసు దర్యాప్తు జరుగుతోందని, పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని, త్వరితగతిన భారత్ కు తీసుకొస్తామని, వారి ఆస్తులు జప్తు చేసి, వారి చెల్లించాల్సిన బకాయిలను తిరిగి పొందుతామని ఫైనాన్స్ మంత్రి నిర్మల సీతారామన్ స్పష్టంచేశారు. దేశంలోనే అతిపెద్ద వైట్ కాలర్ నేరగాళ్ల గా ముద్రపడిన ఆర్థిక నేరస్తులు విజయ్ మాల్యా , నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీ తమ సంస్థల ద్వారా బ్యాంకుల నుండి అప్పులు తీసుకుని తిరిగి చెల్లించకుండా ప్రభుత్వ రంగ బ్యాంకులను మోసం చేశారని పేర్కొన్నారు.
దీనివల్ల రుణదాతలైన బ్యాంకులకు మొత్తం రూ .22,585.83 కోట్ల నష్టం వాటిల్లిందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తెలిపింది. ఇక మొత్తాన్ని అణా పైసలతో సహా వసూలు చేస్తామని నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలు బ్యాంకులకు కొంత బూస్ట్ ఇచ్చినట్లయింది. ఇలాంటి ఆర్ధిక నేరగాళ్లకు ఈడీ తాజా చర్యలు, వీరి విషయంలో కేంద్రం వ్యవహరిస్తున్న తీరు వారిలో భయాన్ని కలిగిస్తుంది.