RBI Monetary Policy: ఆర్బీఐ కీలక నిర్ణయం, ఏటీఎంలలో కార్డ్లెస్ ఉపసంహరణ!
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం (ఏప్రిల్ 8) నగదు ఉపసంహరణ గురించి కీలక ప్రకటన చేశారు. దేశంలోని అన్ని బ్యాంకుల్లోని ఏటీఎంలు కార్డ్లెస్ నగదు ఉపసంహరణ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకు రావాలని ఆర్బీఐ ప్రతిపాదించినట్లు తెలిపారు. 6 నుండి 8 వరకు ఎంపీసీ సమావేశం జరిగింది. ఈ సమావేశం నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ శుక్రవారం ఉదయం వెల్లడించారు.
అన్ని బ్యాంకుల ఏటీఎంలలో కార్డ్ లెస్ నగదు ఉపసంహరణను అందుబాటులోకి తీసుకు రావాలని ప్రతిపాదించినట్లు తెలిపారు. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ లేదా UPI ద్వారా ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకు రావాలని ప్రతిపాదించినట్లు తెలిపారు.
'ప్రస్తుతం ఏటీఎంల ద్వారా కార్డ్ లెస్ నగదు ఉపసంహరణ సౌకర్యం కొన్ని బ్యాంకులకు మాత్రమే పరిమితమైంది. యూపీఐని ఉపయోగించి అన్ని బ్యాంకులు, ఏటీఎం నెట్ వర్క్స్లో కార్డ్ లెస్ నగదు ఉపసంహరణ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకు రావాలని ఇప్పుడు ప్రతిపాదించబడింది' అని ఆర్బీఐ గవర్నర్ తెలిపారు.