BYJU’s News: ఆఫీసులు ఖాళీ చేస్తున్న బైజూస్.. డెట్ రీస్ట్రక్చరింగ్ చర్చలు..
BYJU's: ఎడ్టెక్ స్టార్టప్ బైజూస్ రోజులు గడిచే కొద్ది సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. నిధుల లభ్యత తగ్గటంతో కంపెనీ ఇప్పుడు ఖర్చులను తగ్గించే పనిలో పడింది.
కంపెనీలో లిక్విడిటీని పెంచే ప్రయత్నంలో బెంగళూరులోని అతిపెద్ద కార్యాలయ స్థలాన్ని ఖాళీ చేసినట్లు వార్తలు వచ్చాయి. కంపెనీకి బెంగళూరులో మెుత్తం మూడు ఆఫీసులు ఉన్నాయి. ఈ క్రమంలో 5.58 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న కళ్యాణి టెక్ పార్క్ను ఖాళీ చేస్తోంది. ప్రెస్టీజ్ టెక్ పార్క్లోని మరో ఆఫీస్ స్పేస్లో కొంత భాగాన్ని కూడా వదులుకున్నట్లు తెలుస్తోంది. సంస్థ భవనంలో ఉన్న తొమ్మిది అంతస్తుల్లో రెండింటిని ఖాళీ చేసింది.

దీంతో జూలై 23 నుంచి అక్కడి ఉద్యోగులను ఇతర ఆఫీసులకు వెళ్లాలని లేదా ఇంటి వద్ద నుంచే పనిచేయాలని సూచించింది. దేశవ్యాప్తంగా కంపెనీ మెుత్తం 3 మిలియన్ చదరపు అడుగుల అద్దె స్థలాన్ని కలిగి ఉన్నట్లు కంపెనీ తెలిపింది. అవసరాలకు అనుగుణంగా వీటిలో మార్పులు ఉంటాయన్నారు. ఈ ఏడాది ఏప్రిల్లో విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం నిబంధనల ప్రకారం బెంగళూరులోని బైజూస్ కార్యాలయాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహించింది.
జూలై 22న 5,000 మంది బైజూస్ ట్యూషన్ సెంటర్(BTC) ఉద్యోగులతో అత్యవసర టౌన్ హాల్ మీటింగ్ నిర్వహించింది. ఈ క్రమంలో సిబ్బందికి వేరియబుల్ పే, ఇతర ప్రోత్సాహకాలను చెల్లించడానికి అంగీకరించింది. అలాగే ట్యూషన్ సెంటర్ల నుంచి ఏ ఉద్యోగినీ తొలగించకుండా ఉండటానికి కట్టుబడి ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి ముందు చాలా మంది ఉద్యోగులు నిరసనకు దిగారు.
ఇదే క్రమంలో తాజాగా స్టార్టప్ కంపెనీ తాత్కాలికంగా దాని 1.2 బిలియన్ డాలర్ల టర్మ్-బీ లోన్లో 85 శాతం కంటే ఎక్కువ వాటా కలిగిన రుణదాతలతో చర్చలు జరిపింది. రుణ ఒప్పందాన్ని రీస్ట్రక్చర్ చేసేందుకు వారు అంగీకరించినట్లు వెల్లడైంది. రుణ నిబంధనలను విజయవంతంగా తిరిగి చర్చలు జరిపినట్లయితే, రుణదాతలు వేగవంతమైన తిరిగి చెల్లింపును డిమాండ్ చేయడాన్ని నిలిపివేస్తారని, అలాగే కోర్టులో ఉన్న వ్యాజ్యాలు పరిష్కరింపబడతాయని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications