10 బిలియన్ డాలర్ కంపెనీగా బైజూస్... ఇండియాలో మూడో సంస్థ!
ప్రముఖ ఎడ్యుకేషన్ టెక్నాలజీ సేవల కంపెనీ బైజూస్... త్వరలోనే మరో ఘనతను సాధించబోతోంది. ఇప్పటికే ఈ రంగంలో దూసుకుపోతున్న బైజూస్... ప్రత్యర్థులెవరికీ అందనంత ఎత్తుకు ఎదగబోతోంది. ఎందుకంటే... త్వరలోనే ఈ బెంగళూరు కేంద్రంగా పనిచేసే కంపెనీ పెద్ద ఎత్తున నిధుల సమీకరణ చేప్పట్టబోతోంది. ఇప్పటికే ఈ మేరకు పలువురు బడా ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్లతో చర్చలు జరుపుతోంది.
ఈ చర్చలు ఫలప్రదం అయితే, బైజూస్ సమీకరించే నిధులతో దాని ప్రస్థానం ఒక కీలక మైలురాయిని తాకనుంది. తొలుత కేవలం ఒక పోటీ పరీక్షల కోచింగ్ సేవల సంస్థగా ప్రారంభమైన బైజూస్... క్రమంగా విద్యను ప్రయోగాత్మకంగా నేర్చుకోవటం కోసం సులభమైన సూత్రాలు, వీడియో పాఠాలను అభివృద్ధి చేసింది.
దీంతో కంపెనీ మొబైల్ ఆప్ ను వినియోగించి ఎవరైనా సులభంగా పాఠాలను నేర్చుకోవచ్చు. దీనికి మార్కెట్లో మంచి స్పందన లభించటంతో క్రమంగా బైజూస్ ఎడ్యుకేషన్ రంగంలో టెక్నాలజీ ని మేళవించి తన సేవలను విస్తరిస్తూ వస్తోంది. ఇదే ఆ కంపెనీకి పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించి పెడుతోంది.
ముఖ్యమంత్రి గారూ! జోక్యం చేసుకోండి: తొలగింపు, వేతనాల కోతపై ఐటీ ఉద్యోగుల ఫిర్యాదు
400 మిలియన్ డాలర్లు...
ప్రస్తుతం బైజూస్ సుమారు 400 మిలియన్ డాలర్ల (దాదాపు రూ 2,800 కోట్లు) పెట్టుబడులను సమీకరించేందుకు పలు ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్లతో చర్చలు జరుపుతోంది. ఈ నిధులను సమీకరించేందుకు బైజూస్ విలువను 10 బిలియన్ డాలర్లు (సుమారు రూ 75,000 కోట్లు) గా లెక్కిస్తున్నారు. ఈ స్థాయి విలువను కలిగిన ఇండియన్ స్టార్టుప్ కంపెనీల్లో ఒకటిగా నిలిచిపోనుంది. ఈ మేరకు మీడియా లో పలు కథనాలు వస్తున్నాయి. ఫ్లిప్ కార్ట్ ను వాల్ మార్ట్ కొనుగోలు చేసిన అనంతరం... ప్రస్తుతం దేశంలో కేవలం పేటీఎం, ఓయో కంపెనీలు మాత్రమే ఈ ఘనతను సాధించాయి. ఇలా 10 బిలియన్ డాలర్ల వాల్యుయేషన్ సాధించిన కంపెనీలను డెకాకాన్ అని పేర్కొంటారు. దీంతో డెకాకాన్ క్లబ్ లో చేరబోయే మూడో ఇండియన్ స్టార్టుప్ కంపెనీగా బైజూస్ నిలవబోతోంది.
రూ 2,800 కోట్ల ఆదాయం...
దేశంలో విజయవంతమైన స్టార్టుప్ కంపెనీల్లో బైజూస్ కూడా ఒకటి. ఎడ్యుకేషన్ రంగంలో చాలా త్వరగా యునికార్న్ (1 బిలియన్ డాలర్ వాల్యుయేషన్) సాధించిన ఈ కంపెనీ... ఆదాయాల్లోనూ రికార్డులు సృష్టిస్తోంది. 2020 మార్చి తో ముగిసిన గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆదాయం రూ 2,800 కోట్లకు చేరుకున్నట్లు బైజూస్ కో-ఫౌండర్ దివ్య గోకుల్నాథ్ బిజినెస్ ఇన్సైడర్ కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో పేర్కొన్నట్లు ప్రముఖ మీడియా సంస్థ ఎంట్రాకర్ వెల్లడించింది. ఈ ఆదాయం తమ అంచనాలకు తగినట్లుగానే ఉందని దివ్య పేర్కొన్నారు. కాగా, 218-19 ఆర్థిక సంవత్సరంలో బైజూస్ ఆదాయం రూ 1,376 కోట్లుగా ఉంది. దానిపై కంపెనీ రూ 20 కోట్ల లాభాన్ని కూడా ఆర్జించింది. అయితే, ప్రస్తుతం కంపెనీ నికర లాభం గురించిన సమాచారం మాత్రం వెల్లడి కాలేదు.
5 కోట్ల మంది యూజర్లు...
దేశంలో బైజూస్ కు మంచి ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా విద్యార్థులు, పేరెంట్స్ నుంచి దీనికి డిమాండ్ అధికంగా ఉంది. ప్రాక్టికల్ రూపంలో అతి సులభంగా ఒక అంశం గురించి పాఠాలు నేర్చుకునే అవకాశం ఉండటంతో వారు దీనిపై ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా గణితం, సైన్స్ వంటి కఠినమైన సబ్జెక్టులను అతి సులభంగా నేర్చుకునే మార్గంగా దీనిని చూస్తున్నారు. దీంతో ఇప్పటి వరకు బైజూస్ కు 5 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. అయితే, ఇందులో పేడ్ కస్టమర్ల వాటా మాత్రం తక్కువగానే ఉంది. కేవలం 35 లక్షల మంది యూజర్లు బైజూస్ కు పేడ్ కస్టమర్లుగా ఉంటున్నారు. బైజూస్ కు ఆదరణ అధికంగా లభిస్తున్నా... దాని వార్షిక చందా చాలా ఖరీదు కావటంతో ఆప్ ను డౌన్ లోడ్ చేసుకున్న ప్రతి వారు చందాదారులు కాలేకపోతున్నారు.