నకిలీకి చెక్, జీఎస్టీలో 1 శాతమైనా నగదుగా చెల్లించాలి
నెలవారీ టర్నోవర్ రూ.50 లక్షలకు పైగా ఉన్న వ్యాపారులు, జీఎస్టీలో కనీసం ఒక శాతాన్ని నగదు రూపంలో చెల్లించాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. నకిలీ రసీదులు ఉపయోగించి పన్ను ఎగవేతలకు పాల్పడటాన్ని నియంత్రించే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నది. జీఎస్టీ బకాయిల్లో 99 శాతం ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ద్వారా చెల్లించేందుకు వీలు కల్పిస్తూ జీఎస్టీ నియామవళిలో 86బీ నియామాన్ని కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు చేర్చింది.
వచ్చే ఏడాది ప్రారంభంలో కొత్త మార్పులు అమలులోకి వస్తాయి. ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్లోని ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ నుండి 99 శాతానికి మించి జీఎస్టీ బకాయిలు చెల్లించేందుకు ఉపయోగించకూడదని సీబీఐసీ తెలిపింది.
జీఎస్టీ దేశంలో అనేక విడివిడి పన్నులను ఒకే పన్నులో విలీనం చేసేలా వచ్చిన పన్నుల వ్యవస్థ. దాన్ని 122వ రాజ్యాంగ సవరణ బిల్లు కింద ప్రవేశపెట్టారు. జీఎస్టీ దేశవ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పన్నుల బదులు వస్తువులు, సేవల తయారీ, అమ్మకం, వినియోగాలపై విధించనున్న సమగ్రమైన పరోక్ష పన్ను.