Bullet train: అమరావతి నుంచి హైదరాబాద్కు కేవలం 70 నిమిషాల్లోనే! రైల్వే మంత్రి అదిరిపోయే గుడ్ న్యూస్!
మన ప్రయాణాల వేగాన్ని పూర్తిగా మార్చేసే అద్భుతమైన వార్త ఒకటి వచ్చేసింది. మనం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బుల్లెట్ ట్రైన్ (Bullet train) ప్రాజెక్టుల గురించి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఒక భారీ రోడ్మ్యాప్ను ప్రకటించారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఇదొక పెద్ద సర్ప్రైజ్ అని చెప్పాలి. విశాఖపట్నంలో జరిగిన గూగుల్ క్లౌడ్ ఇండియా ఏఐ హబ్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, రాబోయే రోజుల్లో సౌత్ ఇండియాలో ప్రయాణాలు ఎలా ఉండబోతున్నాయో కళ్ళకు కట్టినట్లు వివరించారు.

అమరావతి నుంచి హైదరాబాద్కు కేవలం 70 నిమిషాలే!
సాధారణంగా అమరావతి నుంచి హైదరాబాద్ వెళ్లాలంటే ఇప్పుడున్న రైళ్లలో గానీ, బస్సుల్లో గానీ గంటల తరబడి సమయం పడుతుంది. కానీ ఈ బుల్లెట్ ట్రైన్ వస్తే కేవలం 70 నిమిషాల్లోనే మీరు గమ్యాన్ని చేరుకోవచ్చు. అంటే సినిమా మొదలుపెడితే, ఇంటర్వెల్ లోపే మీరు ఇంకో సిటీలో ఉంటారన్నమాట! ఒక్క తెలుగు రాష్ట్రాలే కాదు, సౌత్ ఇండియాలోని ప్రముఖ నగరాలైన చెన్నై, బెంగళూరు, పుణే , ముంబైలను కూడా ఈ హై-స్పీడ్ నెట్వర్క్ కలపబోతోంది. దీనిని మంత్రి 'హై-స్పీడ్ డైమండ్' అని పిలిచారు.
ఎక్కడ నుంచి ఎక్కడికి.. ఎంత టైమ్ పడుతుంది?
మంత్రి గారు వివరించిన దాని ప్రకారం, ప్రతిపాదిత రూట్లలో ప్రయాణ సమయాలు ఇలా ఉండబోతున్నాయి..
- అమరావతి - హైదరాబాద్: 70 నిమిషాలు
- పుణే - ముంబై: కేవలం 48 నిమిషాలు
- చెన్నై - బెంగళూరు: 73 నిమిషాలు
- హైదరాబాద్ - బెంగళూరు: 2 గంటల 8 నిమిషాలు
- అమరావతి - చెన్నై: 112 నిమిషాలు
ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ ఎంత వేగంగా జరుగుతుందో మనం చూస్తూనే ఉన్నాం. అదే తరహాలో ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లో కూడా ఎకనామిక్ గ్రోత్ పెంచడానికి ఈ రైళ్లను తీసుకురాబోతున్నారు.
రైల్వే జోన్ కల నెరవేరుతోంది..
ఆంధ్రప్రదేశ్ ప్రజల దశాబ్దాల కల అయిన సౌత్ కోస్ట్ రైల్వే జోన్ (South Coast Railway Zone) పై కూడా మంత్రి క్లారిటీ ఇచ్చారు. వచ్చే ఏడాది జూన్ 1, 2026 నుంచి ఈ జోన్ అధికారికంగా కార్యరూపం దాల్చబోతోంది. దీనివల్ల రాష్ట్రానికి రైల్వే కేటాయింపులు, ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయి. అంతేకాకుండా, కోల్కతా నుంచి చెన్నై వరకు ఉన్న డబుల్ లైన్ రైల్వే నెట్వర్క్ను నాలుగు లైన్లుగా మార్చబోతున్నారు. దీనివల్ల ప్రయాణికుల రైళ్లే కాకుండా సరుకు రవాణా కూడా వేగవంతం అవుతుంది.
భారీగా పెరిగిన రైల్వే బడ్జెట్
గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాలకు కలిపి కేవలం రూ. 886 కోట్లు మాత్రమే రైల్వే బడ్జెట్ వచ్చేదని, కానీ ఇప్పుడు కేవలం ఆంధ్రప్రదేశ్కే రూ. 10,134 కోట్లు కేటాయించామని మంత్రి చెప్పారు. ప్రస్తుతం ఏపీలో రూ. 1.06 లక్షల కోట్ల విలువైన పనులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సుమారు 74 రైల్వే స్టేషన్లను అత్యాధునిక హంగులతో తీర్చిదిద్దుతున్నారు.
మొత్తంగా చూస్తే.. భారత్.. కేవలం రైళ్లలోనే కాదు, టెక్నాలజీ పరంగా కూడా దూసుకుపోవాలని అశ్వినీ వైష్ణవ్ గారు ఆకాంక్షించారు. మన దేశంలోనే డేటా సెంటర్లను, సర్వర్లను తయారు చేయాలని ఐటీ కంపెనీలకు పిలుపునిచ్చారు. మొత్తానికి బుల్లెట్ ట్రైన్ , కొత్త రైల్వే లైన్లతో మన ప్రయాణాలు స్పీడ్ అందుకోవడమే కాదు, ఆర్థికంగా కూడా మన ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications