Markets closing bell: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను కేంద్ర ప్రభుత్వం ఇవాళ పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఎప్పటి మాదిరిగానే స్టాక్ మార్కెట్పై దీని ప్రభావం తీవ్రంగా ఉంది. ప్రారంభం నుంచి అస్థిరంగా కొనసాగిన సూచీలు ఎట్టకేలకు కొంతమేర కోలుకుని ఇన్వెస్టర్ల నష్టానికి బ్రేకులు వేశాయి. అయినా మెజారిటీ సెక్టార్లు భారీ స్థాయిలో క్షీణించడం గమనించవచ్చు.
బడ్జెట్ ప్రకటనకు ముందు కొన్ని రోజుల నుంచి మార్కెట్లలో అస్థిరత ఉన్నప్పటికీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొన్ని ఉద్దీపన చర్యలను ప్రకటించడంతో కొంతమేర తిరిగి కోలుకుంది. మానవ వనరులకు నైపుణ్యాభివృద్ధి నుంచి MSMEలకు క్రెడిట్ గ్యారెంటీ, వ్యవసాయ రంగానికి DPI సాధనాలు వంటి కార్యక్రమాలు మార్కెట్ క్రాష్ కాకుండా సత్ఫలితాలను ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఆర్థిక మంత్రి ప్రసంగం ముగిసిన తర్వాత సెన్సెక్స్ దాదాపు వెయ్యి పాయింట్లు పడిపోయింది. అయితే తిరిగి చాలా వరకు కోలుకుని స్వల్ప నష్టాలతో రోజు ముగించింది. 80 వేల 724 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ గరిష్ఠంగా 80 వేల 766 మరియు కనిష్ట స్థాయి 79 వేల 224ను ఒకానొక దశలో టచ్ చేసింది. ఎట్టకేలకు సెన్సెక్స్ 0.09 శాతంతో 73.04 పాయింట్లు క్షీణించి 80 వేల 461 వద్ద క్లోజ్ అయింది.
ఇక మరో సూచీ నిఫ్టీ కూడా 24 వేల 568 వద్ద ప్రారంభమైన 24 వేల 74 మరియు 24 వేల 582 మధ్య ట్రేడయింది. ముగింపులో 30 పాయింట్ల మేర కోల్పోయి 0.12 శాతం క్షీణించింది. చివరకు 24 వేల 479 వద్ద ముగింపు నమోదు చేసింది. సెన్సెక్స్లోని 30 స్టాక్స్లో 18 నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ 50 లో 29 అదే బాటలో నష్టాలను మూటగట్టుకున్నాయి.
విస్తృత మార్కెట్ క్షీణతలో BSE మిడ్క్యాప్ 0.74 శాతం మరియు స్మాల్క్యాప్ 0.18 శాతం మేర నష్టపోయింది. LTCG, STCG పెంపుదల సెన్సెక్స్, నిఫ్టీలను ముంచేసిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఆటో, FMCG, హెల్త్ కేర్ మరియు IT సూచీలు 0.5 నుంచి 2 శాతం ఎగబాకాయి. కాగా బ్యాంకింగ్, క్యాపిటల్ గూడ్స్, మెటల్, ఆయిల్ & గ్యాస్ మరియు రియాలిటీలు అదే స్థాయిలో క్షీణించాయి.


Click it and Unblock the Notifications