Budget 2026: మధ్యతరగతికి మరిన్ని ఊరటలు ఉంటాయా? ట్యాక్స్ నిపుణులు ఏం కోరుతున్నారు?
ఫిబ్రవరి 1వ తేదీ దగ్గర పడుతుండటంతో అందరి కళ్లు కేంద్ర బడ్జెట్ 2026 పైనే ఉన్నాయి. సాధారణంగా బడ్జెట్ అంటే చాలు.. సామాన్యుడి నుంచి కోటీశ్వరుడి వరకు అందరూ చూసేది 'పన్నులు తగ్గుతాయా? పెరుగతాయా?' అనే! అయితే ఈసారి పన్ను రేట్ల తగ్గింపు కంటే పన్ను విధానంలో ఉన్న చిక్కుముడులను విప్పడంపైనే ప్రభుత్వం ఫోకస్ చేసేలా కనిపిస్తోంది.

మధ్యతరగతికి పన్ను ఊరట లభిస్తుందా?
గత కొన్ని బడ్జెట్లలో ఇప్పటికే మిడిల్ క్లాస్ కి ప్రభుత్వం మంచి ఊరటనిచ్చింది. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం.. స్టాండర్డ్ డిడక్షన్, రిబేట్లతో కలిపి దాదాపు రూ. 12.75 లక్షల ఆదాయం వరకు పన్ను కట్టాల్సిన అవసరం లేదు. అయితే పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకుని.. Budget 2026 లో 30% ట్యాక్స్ స్లాబ్ పరిమితిని రూ. 25 లక్షల నుండి రూ. 35 లక్షలకు పెంచాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే సెక్షన్ 80C, 80D కింద ఇచ్చే మినహాయింపులను కూడా పెంచే అవకాశం ఉంది.
స్టార్టప్స్, ఉద్యోగుల కోసం ESOP క్లారిటీ
చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు జీతంతో పాటు ESOP (Employee Stock Options) ఇస్తుంటాయి. కంపెనీలు విలీనమైనప్పుడు (Mergers) షేర్ల మార్పిడిపై పన్ను మినహాయింపు ఉంటుంది. కానీ ఈ ESOP ల విషయంలో క్లారిటీ లేదు. దీనివల్ల ఉద్యోగులు నష్టపోతున్నారు. ఈ బడ్జెట్ లో దీనిపై స్పష్టత వస్తే ఐటీ, స్టార్టప్ ఉద్యోగులకు పెద్ద ఊరట లభిస్తుంది.
బిజినెస్ రీస్ట్రక్చరింగ్ సులభం కావాలి!
కంపెనీలు తమ వ్యాపారాలను విడదీయాలన్నా (Demergers), విలీనం చేయాలన్నా ప్రస్తుతం ఉన్న చట్టాల్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ముఖ్యంగా 'ఫాస్ట్ ట్రాక్ డీమెర్జర్స్' విషయంలో పన్ను మినహాయింపులపై స్పష్టత లేదని నిపుణులు అంటున్నారు. వీటిని క్రమబద్ధీకరిస్తే విదేశీ పెట్టుబడులు (FDI) ఇండియాకు మరింత ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది.
లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ (LLP) సంస్థలు కంపెనీలుగా మారేటప్పుడు పన్ను భారం పడుతోంది. దీన్ని కూడా కంపెనీ మెర్జర్స్ లాగే ట్యాక్స్ ఫ్రీ చేయాలని డిమాండ్ ఉంది.
అంచనాలు ఇవే..
మొత్తానికి చూస్తే.. Budget 2026 అనేది కేవలం పన్నులు తగ్గించడం మాత్రమే కాకుండా, వ్యాపారాలను సులభతరం చేయడం (Ease of Doing Business) అలాగే పన్ను చెల్లింపుదారులకు గందరగోళం లేకుండా చేయడంపైనే దృష్టి పెట్టనుంది. ఏప్రిల్ 2026 నుండి కొత్త ఆదాయపు పన్ను చట్టం అమల్లోకి వచ్చే అవకాశం ఉన్నందున ఈసారి ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడం మరింత సులభం కావచ్చు.
పాత పన్ను విధానంలో 80C, 80D వంటి సెక్షన్ల కింద పరిమితులను పెంచడం ద్వారా పొదుపును ప్రోత్సహించడం, అలాగే కొత్త పన్ను విధానంలో మరిన్ని రాయితీలు కల్పించడం ద్వారా సామాన్యుడి చేతిలో ఖర్చు పెట్టడానికి ఎక్కువ డబ్బు (Disposable Income) ఉండేలా చూడటం ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. మధ్యతరగతి ప్రజల ఆశలు, పారిశ్రామికవేత్తల కోరికలు , దేశాభివృద్ధిని సమతూకం చేస్తూ నిర్మలమ్మ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో వేచి చూడాలి. ఈ బడ్జెట్ సామాన్యుడి జేబుకు ఉపశమనం కలిగిస్తుందని, దేశ ఆర్థిక రథాన్ని పరుగులు పెట్టిస్తుందని ఆశిద్దాం.


Click it and Unblock the Notifications


