అంబేడ్కర్ జయంతి సందర్భంగా నేడు మార్కెట్లు క్లోజ్
రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ జయంతి సందర్భంగా నేడు (ఏప్రిల్ 14) భారతీయ స్టాక్ మార్కెట్లకు సెలవు రోజు. ఎన్ఎస్ఈ, బీఎస్ఈ రెండు కూడా ఈ రోజు క్లోజ్ అవుతాయి. ఈక్విటీ సెగ్మెంట్, ఈక్విటీ డెరివేటివ్స్, ఎస్ఎల్బీ సెగ్మెంట్ ఏప్రిల్ 14వ తేదీన వర్క్ చేయవు. ఏప్రిల్ 15 గురువారం రోజు యథావిధిగా పని చేస్తాయి. స్టాక్ మార్కెట్ హాలీడే లిస్ట్ ప్రకారం 21 ఏప్రిల్ శ్రీరామనవమి సందర్భంగా మార్కెట్లకు సెలవు ఉంది. ఏప్రిల్ నెలలో ఇదే చివరి సెలవు రోజు.
దేశీయ స్టాక్ మార్కెట్లు నిన్న లాభాల్లో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు మధ్యాహ్నం వరకు ఊగిసలాటలో కనిపించాయి. కరోనా, లాక్డౌన్ భయాలతో సోమవారం భారీ నష్టాలను చూసిన మార్కెట్లు మంగళవారం ఊపిరి పీల్చుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల వైఖరితో ఉదయం లాభాల్లో ఉన్న మార్కెట్లు, ఆ తర్వాత కరోనా వ్యాక్సిన్ కొరతను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మార్కెట్ను మరింత జంప్ చేసేలా చేశాయి.
ఇప్పటికే వివిధ దేశాల్లో ఆమోదం పొందిన టీకాలకు మన దేశంలో కూడా అనుమతులు ఇచ్చే ప్రక్రియ వేగవంతం చేయాలనే నిర్ణయంతో సూచీలు లాభాల బాట పట్టాయి. చివరకు సెన్సెక్స్ 660 పాయింట్లు లాభపడి 48,544 పాయింట్ల వద్ద, నిఫ్టీ 194 పాయింట్ల లాభపడి 14,504 వద్ద స్థిరపడింది.