Sensex: చరిత్ర సృష్టించిన స్టాక్ మార్కెట్లు.. కొత్త శిఖరాలకు సెన్సెక్స్, నిఫ్టీ అప్..
Sensex Highs: దాదాపు ఏడు నెలల తర్వాత దేశీయ స్టాక్ మార్కెట్ బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ నేడు కొత్త జీవితకాల గరిష్ఠాన్ని తాకింది. ఇదే క్రమంలో నిఫ్టీ సూచీ సైతం లాభాల్లో కొనసాగుతోంది.
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గత కొన్ని రోజులుగా కొత్త జీవితకాల గరిష్ఠాలకు చేరుకునే క్రమంలో బుల్ జోరుకు కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మెుగ్గుచూపటంతో కొంత క్షీణించినప్పటికీ తిరిగి పుంజుకుని నేడు చరిత్ర సృష్టించాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్లోని ప్రముఖ సెన్సిటివ్ ఇండెక్స్ సెన్సెక్స్ సరికొత్త ఆల్టైమ్ గరిష్ఠాన్ని తాకింది. తన పాత రికార్డులను అధిగమనించేందుకు సెన్సెక్స్ సూచీ 203 రోజులు సమయం తీసుకుంది.

డిసెంబర్ 1, 2022లో 63,583.07 స్థాయిని తాకి అప్పట్లో సెన్సెక్స్ సూచీ రికార్డు సృష్టించింది. ఆ తర్వాత నేడు 63,588.31 స్థాయిని తాకిన సూచీ తన గత రికార్డులను అధిగమించింది. ఉదయం 10 గంటలకు ఇంట్రాడే ట్రేడింగ్ సమయంలో బెంచ్ మార్క్ సూచీ ఈ ఆల్ టైమ్ హై రికార్డును నమోదు చేసింది. ఈ బుల్ జోరుతో మరో కీలక సూచీ అయిన నిఫ్టీ సైతం పుంజుకుంది. ఈ క్రమంలో నిఫ్టీ 18,875.90కి తిరిగి పుంజుకున్నప్పటికీ ఇంకా ఆల్ టైమ్ హైని దాటలేదు.

సెన్సెక్స్ సూచీలోని పవర్ గ్రిడ్, అల్ట్రాటెక్ సిమెంట్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, విప్రో, హెచ్డీఎఫ్సీ, హిందుస్థాన్ యూనిలీవర్, ఎల్ & టి, టెక్ మహీంద్రా, బజాజ్ ఫిన్సర్వ్, టైటాన్, టీసీఎస్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లాభపడ్డాయి. మరోవైపు టాటా స్టీల్, ఎన్టీపీసీ, టాటా మోటార్స్, ఐసీఐసీఐ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్ షేర్లు క్షీణించాయి.


Click it and Unblock the Notifications