IT Shares: పతనమౌతున్న దిగ్గజ ఐటీ స్టాక్స్.. బ్రోకరేజీలు ఏ షేర్లను సూచిస్తున్నాయంటే..?
IT Shares: ఇటీవల ఐటీ మెజర్లు టీసీఎస్, ఇన్ఫోసిస్ తమ నాలుగో త్రైమాసిక ఆర్థిక ఫలితాలను విడుదల చేశాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆర్థిక మందగమనం ప్రభావం, సవాళ్లను ఈ ఫలితాలు చూపాయి. పైగా ఈ కంపెనీలకు అమెరికా, యూరప్ మార్కెట్ల నుంచే దాదాపు 95 నుంచి 97 శాతం ఆదాయం వస్తోంది.
ఈ నెల 18 వరకు స్టాక్ ధరలను పరిశీలిస్తే గత ఏడాదిలో ఇన్ఫోసిస్ స్టాక్ 22 శాతం పతనం కాగా.. టీసీఎస్ స్టాక్ దాదాపు 11 శాతానికి పైగానే పతనమైంది. ఈ క్రమంలో ఇతర ఐటీ దిగ్గజాలను గమనిస్తే విప్రో 32 శాతం, హెచ్సీఎల్ టెక్నాలజీస్ షేర్లు 4 శాతం, టెక్ మహీంద్రా కంపెనీ షేర్లు 24 శాతం మేర క్షీణించాయి. ఇలా టెక్ రంగంలోని పెద్ద కంపెనీల షేర్లు భారీ నష్టాలను ఇన్వెస్టర్లకు అందిస్తున్నాయి.

ఈ క్రమంలో మిడ్ క్యాప్ ఐటీ కంపెనీలు మాత్రం మతిపోగొట్టే రాబడులను అందించాయి. ప్రధానంగా ఈ విభాగంలోని సిగ్నిటీ టెక్నాలజీస్ గడచిన 12 నెలల కాలంలో దాదాపు 68 శాతానికి పైగా రాబడిని అందించి టాప్ గెయినర్గా నిలిచింది. గత సంవత్సరం ఏదే రోజున రూ.452.25 గా ఉన్న ఈ కంపెనీ షేర్లు ఏప్రిల్ 18న రూ.761.85వద్ద కొనసాగుతున్నాయి. ఇదే క్రమంలో.. డి-లింక్ 64.50 శాతం, కెపీఐటీ టెక్నాలజీస్ 57.90 శాతం, యాక్సెల్య సొల్యూషన్స్ ఇండియా 51.60 శాతం, న్యూక్లియస్ సాఫ్ట్వేర్ ఎగుమతులు 35.20 శాతం, సొనాటా సాఫ్ట్వేర్ 35.20 శాతం లాభపడ్డాయి.
ప్రస్తుత పరిస్థితుల్లో పెద్ద ఐటి సంస్థల నుంచి వచ్చే ఆదాయాల్లో మృదుత్వం కారణంగా.. దీర్ఘకాలిక పెట్టుబడి వ్యూహంలో భాగంగా ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను నిఫ్టీ ఐటి, ఐటి ఈటీఎఫ్లతో సహా ఐటి రంగంలోని ఇతర ఎంపికల్లోకి మార్చడాన్ని పరిగణించవచ్చని ట్రేడ్ప్లస్ సీఈవో ఎస్కె హోజెఫా తెలిపారు. ప్రస్తుతం మార్కెట్లో గందరగోళాలు ఉన్నప్పటికీ రానున్న కాలంలో కంపెనీ షేర్లు మెరుగైన పనితీరును కనబరుస్తాయని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.
ఇలాంటి తరుణంలో దేశీయ మార్కెట్పై దృష్టి సారించే మిడ్క్యాప్ ఐటి సంస్థల్లో పెట్టుబడి భవిష్యత్తులో మంచి ప్రయోజనాలను అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లలో బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ సంస్థలు కుదుటపడేంత వరకు పెద్ద ఐటీ కంపెనీలకు సవాళ్లు తప్పవని అంటున్నారు. ఈ క్రమంలో అధిక రాబడులు ఆశిస్తున్నవారు మిడ్ క్యాప్ ఐటీ షేర్లను తమ ఎంపికగా మార్చుకోవచ్చని సూచిస్తున్నారు.


Click it and Unblock the Notifications