భారతదేశ సరిహద్దు వాణిజ్యం, ఆర్థిక లావాదేవీలు, పర్యాటకానికి సంబంధించిన చెల్లింపులను మరింత వేగంగా, తక్కువ ఖర్చుతో నిర్వహించేందుకు BRICS దేశాల అధికారిక డిజిటల్ కరెన్సీలను (CBDCs) పరస్పరం అనుసంధానించాలనే కీలక ప్రతిపాదనను భారత కేంద్ర బ్యాంక్ - రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ముందుకు తెచ్చింది. ఈ విషయం గురించి తెలిసిన రెండు అధికారిక వర్గాలు ఈ సమాచారాన్ని వెల్లడించాయని రాయిటర్స్ నివేదిక పేర్కొంది.
ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, వాణిజ్య సంక్షోభాల నేపథ్యంలో ఈ చర్య క్రమంగా అమెరికా డాలర్పై ఆధారపడటాన్ని తగ్గించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ప్రతిపాదనను 2026 BRICS శిఖరాగ్ర సమావేశం ఎజెండాలో చేర్చాలని RBI సూచించింది. ఈ సమావేశానికి ఈ ఏడాది చివర్లో భారతదేశం ఆతిథ్యం ఇవ్వనుంది.

ఈ ప్రతిపాదన ఆమోదం పొందితే BRICS దేశాల మధ్య వారి సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీలను నేరుగా అనుసంధానించేందుకు చేసే తొలి అధికారిక ప్రయత్నం ఇదే అవుతుంది. ఈ విషయంపై బహిరంగంగా మాట్లాడే అధికారం లేకపోవడంతో సంబంధిత వర్గాలు పేరు చెప్పడానికి ఇష్టపడలేదని రాయిటర్స్ తెలిపింది.
ప్రస్తుతం BRICS కూటమిలో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికాతో పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇరాన్, ఇండోనేషియా వంటి కొత్త సభ్యదేశాలు కూడా ఉన్నాయి. ఈ కూటమి చర్యలు అమెరికా దృష్టిని ఆకర్షించే అవకాశం ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్పటికే BRICSను అమెరికా వ్యతిరేక కూటమిగా విమర్శిస్తున్నారు. డాలర్ ఆధిపత్యాన్ని బలహీనపరిచే చర్యలు చేపడితే సుంకాలు విధిస్తామని హెచ్చరికలు చేస్తున్నారు.
అయితే ఈ వ్యాఖ్యలపై రాయిటర్స్.. RBI, భారత ఆర్థిక మంత్రిత్వ శాఖను సంప్రదించగా వారు స్పందించలేదు. అలాగే బ్రెజిల్, రష్యా కేంద్ర బ్యాంకులు కూడా స్పందించలేదు. చైనా కేంద్ర బ్యాంకు తమ వద్ద పంచుకునే సమాచారం లేదని తెలిపింది, దక్షిణాఫ్రికా వ్యాఖ్యానించడానికి నిరాకరించింది. ముఖ్యంగా వాణిజ్యం, పర్యాటక చెల్లింపుల కోసం BRICS CBDCల అనుసంధానం ప్రతిపాదన గతంలో ఎక్కడా వెల్లడికాలేదు.
2025లో రియో డి జనీరోలో జరిగిన BRICS శిఖరాగ్ర సమావేశంలో.. సభ్య దేశాలు సరిహద్దు లావాదేవీలను వేగవంతం చేయడానికి, ఖర్చులు తగ్గించడానికి చెల్లింపు వ్యవస్థల మధ్య పరస్పర అనుసంధానం అవసరం అని ప్రకటించాయి. దీనినే ఆధారంగా తీసుకొని ఈ ప్రతిపాదన ముందుకు వచ్చినట్లుగా తెలుస్తోంది.
భారత డిజిటల్ రూపాయిని ఇతర దేశాల CBDCలతో అనుసంధానించడం ద్వారా సరిహద్దు సెటిల్మెంట్ సామర్థ్యం మెరుగవుతుందని, అలాగే రూపాయి అంతర్జాతీయ వినియోగం పెరుగుతుందని RBI భావిస్తోంది. అయితే, ఈ ప్రయత్నాలు డీ-డాలరైజేషన్ను లక్ష్యంగా చేసుకున్నవి కావని RBI స్పష్టం చేసింది.
ప్రస్తుతం BRICS దేశాల్లో ఏదీ పూర్తిగా రిటైల్ CBDCని ప్రవేశపెట్టలేదు. అయితే ఐదు దేశాలు పైలట్ ప్రాజెక్టులను అమలు చేస్తున్నాయి. భారత్ 2022 డిసెంబరులో ప్రారంభించిన ఇ-రూపాయి ఇప్పటికే సుమారు 70 లక్షల వినియోగదారులను ఆకర్షించింది. చైనా కూడా తన డిజిటల్ యువాన్ను అంతర్జాతీయంగా విస్తరించేందుకు ఆసక్తి చూపుతోంది.
అయితే BRICS CBDC అనుసంధానం విజయవంతం కావాలంటే సాంకేతిక ప్రమాణాలు, పాలనా వ్యవస్థలు, వాణిజ్య అసమతుల్యతల నిర్వహణ వంటి అంశాలపై సభ్య దేశాల మధ్య విస్తృత ఏకాభిప్రాయం అవసరం. ఇతర దేశాలు అభివృద్ధి చేసిన సాంకేతిక వేదికలను స్వీకరించడంపై కొంత అయిష్టత ఉండటం పురోగతిని మందగించవచ్చని కొన్ని వర్గాలు చెబుతున్నాయి.
గతంలో భారత్-రష్యా మధ్య స్థానిక కరెన్సీ వాణిజ్య ప్రయత్నాలు కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే, BRICS డిజిటల్ కరెన్సీ అనుసంధానం ఒక దీర్ఘకాల ప్రయాణమే అయినప్పటికీ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒక కీలక మలుపుగా మారే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్సైట్లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్సైట్లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications