పెట్రోల్, డీజిల్ పెరుగుదలపై నిర్మల ఏమన్నారంటే? తాప్సీ ఇంటిపై ఐటీ దాడులపై...
పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మరోసారి స్పందించారు. ఇంధన ధరలపై కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాల పన్నులు, వ్యాట్ కూడా ఉందని వెల్లడించారు. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరగడంతో ఇక్కడ కూడా పెరుగుతోందని, ఈ భారం ప్రజలపై పడుతోందన్నారు. ఈ భారం తగ్గించాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నిర్ణయం తీసుకోవాలన్నారు. ఢిల్లీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు. పెట్రోల్, డీజిల్ వినియోగదారులపై భారం పడుతోన్న మాట వాస్తవమే అన్నారు. అయితే కేంద్రం మాత్రమే పన్నులు వేయడం లేదని, రాష్ట్రాలు కూడా ప్రత్యేకంగా వసూలు చేస్తున్నాయన్నారు.
కేంద్రం పన్నులోను రాష్ట్రాలకు వాటా
పెట్రోల్, డీజిల్ను జీఎస్టీ పరిధిలోకి తీసుకు వచ్చే అంశంపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆమె స్పందించారు. కేంద్రం వసూలు చేసే పన్నుల వాటాలో 41 శాతం రాష్ట్రాలకు వెళ్తోందని నిర్మలా సీతారామన్ అన్నారు. ఈ వ్యవహారం కేంద్ర, రాష్ట్రాల మధ్య ముడివడి ఉన్న అంశమని, ఇరు ప్రభుత్వాలు కలిసి తీసుకోవాల్సిన నిర్ణయం అన్నారు. జీఎస్టీ మండలి సమావేశంలో కేంద్రం దీనిపై ప్రతిపాదన అని అడగగా, సమావేశం దగ్గరకి వచ్చినప్పుడు ఆలోచన చేస్తామన్నారు.
తాప్సీ, అనురాగ్ కార్యాలయాలపై ఐటీ దాడుల మీద
తాప్సీ, అనురాగ్ కశ్యప్ ఇళ్లు, కార్యాలయాలపై ఆదాయ పన్ను దాడులపై కూడా మీడియా అడగడంతో నిర్మలమ్మ స్పందించారు. వారి పేర్లు నేరుగా ప్రస్తావించలేదు. అయితే 2013లో కూడా వారి ఇళ్లపై దాడులు జరిగాయని గుర్తు చేశారు. నాడు లేని సమస్య ఇప్పుడు ఎందుకో చెప్పాలన్నారు. తాప్సీ, అనురాగ్ కశ్యప్ ఉద్యమానికి మద్దతు పలకడం వల్ల కేం్రం దాడులు చేయించిందనే విమర్శలను పైవిధంగా తిప్పికొట్టారు.
కెయిర్న్ ఆర్బిట్రేషన్
కెయిర్ని ఆర్బిట్రేషన్ 1.4 బిలియన్ డాలర్ల అంశంపై నిర్మల మాట్లాడుతూ.. ప్రభుత్వం దీనిపై అప్పీల్కు వెళ్తుందన్నారు. భారత సార్వభౌమ అథారిటీ, ఈ పన్నులను ప్రశ్నించినప్పుడు దీనిపై అప్పీల్కు వెళ్లడం తన బాధ్యత అన్నారు. బ్రిటిష్ కంపెనీలపై వేసిన పన్నులకు గాను గతంలో రెండు హైప్రొఫైల్ ఆర్బిట్రేషన్స్ను ప్రభుత్వం కోల్పోయింది.