1 లక్ష కోట్ల డాలర్లు దాటిన బిట్కాయిన్ మార్కెట్ వ్యాల్యూ
న్యూయార్క్: బిట్ కాయిన్ మార్కెట్ వ్యాల్యూ శనివారం ఏకంగా లక్షకోట్ల డాలర్లు దాటింది. ఒక కాయిన్ ధర గతంలో ఎన్నడూలేని విధంగా 56,620 డాలర్లను క్రాస్ చేసింది. దీంతో క్రిప్టోకరెన్సీ మార్కెట్ వ్యాల్యూ ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకింది. ఎలాన్ మస్క్ నేతృత్వంలోని టెస్లా ఇంక్ 1.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టింది. అలాగే మాస్టర్ కార్డ్ వంటి సంస్థలు క్రిప్టోకరెన్సీని అమోదించాలని నిర్ణయించాయి. ఈ నేపథ్యంలోనే క్రిప్టోకరెన్సీ వ్యాల్యూ భారీగా పెరిగింది. రెండు నెలలుగా బిట్ కాయిన్ వ్యాల్యూ అంతకంతకూ పెరుగుతోంది. ఈ వారమే 18 శాతం లాభపడింది. ఈ సంవత్సరం 92 శాతం ఎగిసింది.
శనివారం క్రిప్టోకరెన్సీ బిట్ కాయిన్ ట్రేడింగ్ వ్యాల్యూ లక్ష కోట్లు లేదా రూ.72.73 లక్షల కోట్లు దాటింది. శుక్రవారం ఆల్ టైమ్ గరిష్టం 55,000 డాలర్లకు చేరుకున్న బిట్ కాయిన్, మరుసటి రోజే 56వేల డాలర్లు దాటింది. 18.6 మిలియన్ డాలర్ల బిట్ కాయిన్స్ సర్క్యులేషన్లో ఉన్నాయి. బిట్ కాయిన్ డిజిటల్ కరెన్సీని లేదా క్రిప్టో కరెన్సీని 2009 జనవరిలో తీసుకు వచ్చారు.
ప్రభుత్వ కరెన్సీల మాదిరిగా దీనికి నియంతృత్వ వ్యవస్థలేదు. ఇన్వెస్టర్ల ఖాతాల్లో మాత్రమే కనిపించే దీని వ్యాల్యూ ప్రస్తుతం భారతీయ కరెన్సీలో రూ.37 లక్షలకు పైగా ఉంది. కరోనాకు ముందు 10000 డాలర్ల లోపు ఉన్న బిట్ కాయిన్ ఇప్పుడు 55వేల డాలర్లు దాటింది.
బిట్ కాయిన్ వ్యాల్యూ పెరుగుతున్నప్పటికీ, కొంతమందిలో నాలుగేళ్ల క్రితం అనుభవం ఆందోళన కలిగిస్తోంది. అమెరికా సాఫ్టువేర్ కంపెనీ మైక్రోస్ట్రాటెజీ బుధవారం మరిన్ని బిట్ కాయిన్స్ కొనుగోలు కోసం కన్వర్టబుల్ బాండ్స్ను విక్రయించనున్నట్లు తెలిపింది. అయితే 2017లో క్రిప్టోవైపు మొగ్గు చూపిన సమయంలో ఆ తర్వాత హఠాత్తుగా పడిపోయిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.